
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
పొన్నూరు: పట్టణంలోని ఐలాండ్ సెంటర్లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీహరి తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన షేక్ సైదా(30) పొన్నూరులో సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని కుటుంబంలో విభేదాల కారణంగా మూడేళ్లుగా భార్యకు దూరంగా ఉంటున్నాడు. పట్టణంలో పనులు చేసుకుంటూ రాత్రి వేళల్లో సెంటర్లోని ఓ లాడ్జిలో ఉంటున్నాడు. ఉదయం లాడ్జి కింద గాయాలతో పడి ఉన్నట్లు గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ మేరకు వారు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీహరి తెలిపారు. సైదా లాడ్జి పైనుంచి జారిపడి మరణించాడా.. గొడవ నేపథ్యంలో మృతి చెందాడా అనే అనుమానాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.
అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు
దుగ్గిరాల: డ్రైవరు మద్యం మత్తులో ఉండగా అదుపు తప్పిన కారు కాలువలోకి దూసుకెళ్లిది. దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో గురువారం మధ్యాహ్నం చిలువూరు నుంచి కె.ఆర్.కొండూరు గ్రామం వైపు కారు వేగంగా వెళుతోంది. ఈ క్రమంలో అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిది. స్థానికులు చూసి కారులోని డ్రైవరును బయటకు తీశారు. అతడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. చిలువూరులో పక్కపక్కనే రెండు మద్యం దుకాణాలు ఉండటం వల్ల కొందరు నిత్యం మద్యం తాగి వేగంగా ద్విచక్రవాహనాలు, కార్లను నడుపుతున్నారని స్థానికులు చెప్పారు. పలువురు ప్రమాదానికి గురవుతున్నారని తెలిపారు. అధికారులకు అనేకసార్లు ఇక్కడ మద్యం దుకాణాలు తొలగించాలని కోరినా స్పందించలేదని పేర్కొన్నారు.