
నైపుణ్యాన్ని ప్రదర్శించి జిల్లాకు మంచి పేరు తీసుకురండి
సత్తెనపల్లి: క్రీడాకారులు క్రీడానైపుణ్యాన్ని ప్రదర్శించి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మాబు హుస్సేన్ అన్నారు. స్థానిక సుగాలీకాలని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పల్నాడు జిల్లాస్థాయి సబ్ జూనియర్స్, జూనియర్స్ బాలబాలికల ఫుట్బాల్ సెలక్షన్ ట్రయల్స్ గురువారం జరిగాయి. ఈ సెలక్షన్కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 70 మంది బాలురు, 50 మంది బాలికలు ఫుట్బాల్ క్రీడలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడాకారులు విజయమే లక్ష్యంగా పెట్టుకొని రాణించాలన్నారు. సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీరామ్ రెడ్డి, అచ్చిరెడ్డి, మహబూబ్ సుభాని, నరసింహారావులు మాబు హుస్సేన్ను ఘనంగా సత్కరించారు. పల్నాడు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. సుబ్రహ్మణ్యేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాకు సెలెక్ట్ అయిన ఫుట్బాల్ క్రీడాకారులు త్వరలో జరిగే స్టేట్ మీట్లో పాల్గొంటారన్నారు. అనంతరం అతిథులను ఘనంగా సన్మానించారు. అనంతరం జిల్లా సబ్ జూనియర్స్, జూనియర్స్ బాల, బాలికల జట్లను ప్రకటించారు.