వైభవంగా వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

వైభవంగా వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు

Jun 4 2025 1:19 AM | Updated on Jun 4 2025 1:19 AM

వైభవం

వైభవంగా వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు

నగరంపాలెం: స్థానిక కొత్తపేట (పశువుల ఆసుపత్రి)లోని శ్రీజగన్నాథస్వామి వారి దేవస్థానంలో శ్రీరుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణు గోపాల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామి వారిని పెండ్లి కుమారునిగా, రుక్మిణి, సత్యభామ అమ్మవార్లను పెండ్లి కుమార్తెగా అలకరించారు. రాత్రి 7 గంటలకు అంకురారోపణ, కలశస్థాపన, ధ్వజారోహణ, విశ్వక్సేన పూజ, అఖండ దీపారాధన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. వారికి నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమాలను దేవస్థానం ఈవో టి.సుభద్ర పర్యవేక్షించారు.

ఆళ్ల నాగేశ్వరరావుకు తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం

తెనాలి: తెనాలికి చెందిన కవి, ఆర్టీసీ కండక్టర్‌ ఆళ్ల నాగేశ్వరరావు పేరు తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదైంది. విజయవాడకు చెందిన ‘తెలుగు కళారత్నాలు’ సాంస్కతిక సేవా సంస్థచే సోమవారం అర్ధరాత్రి వరకు ఏకధాటిగా 10 గంటలపాటు జరిగిన సకల కళాప్రదర్శనలో నాగేశ్వరరావు సాహిత్య ప్రదర్శనకు ఈ గౌరవం లభించింది. సంబంధిత ధ్రువీకరణ పత్రం, పతకాన్ని ఏపీ సచివాలయం ఓఎస్‌డీ డాక్టర్‌ ప్రభాకర్‌, విశ్రాంత ఆదాయ పన్ను అధికారి డాక్టర్‌ పతంగి చెన్నయ్య, ప్రముఖ రచయిత్రి డాక్టర్‌ సరికొండ రమాదేవి సమక్షంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు యూవీ రత్నం అందజేశారు.

జనాభా నిర్వహణపై

క్యూఆర్‌ కోడ్‌తో ప్రజాభిప్రాయం

నరసరావుపేట: జనాభా నిర్వహణ విధానంపై ప్రజలను భాగస్వాములను చేసేందుకు ఈ నెల 1 నుంచి 20వ తేదీ వరకు క్యూఆర్‌ కోడ్‌ విధానం ద్వారా ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయం సేకరిస్తున్నట్లు జిల్లా అర్ధ గణాంకశాఖ అధికారి మాలతి పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం క్యూఆర్‌ కోడ్‌ పోస్టర్‌ను జిల్లా కలెక్టర్‌ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు వారి పరిధిలోని కుటుంబాల నుంచి జనాభా నిర్వహణ అభిప్రాయాలను క్యూఆర్‌ కోడ్‌ ద్వారా సేకరించాలని ఆదేశించారు. జేసీ సూరజ్‌ గనోరే, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

నేడు నాగార్జునసాగర్‌లో సామూహిక యోగా

నరసరావుపేట: జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం నాగార్జునసాగర్‌ వద్ద బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించనున్నామని పల్నాడు జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు మంగళవారం పేర్కొన్నారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించి యోగా ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని పేర్కొన్నారు. మే 28న ఇప్పటికే కోటప్పకొండపై సామూహిక యోగా నిర్వహించామన్నారు. జూన్‌ 11న కొండవీడు కోట, జూన్‌ 18న అమరావతి ధ్యానబుద్ధ విగ్రహం వద్ద సామూహిక యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం మంగళవారం 512.00 అడుగుల వద్ద ఉంది. సాగర్‌ జలాశయం నుంచి కుడి కాలువకు 4,050 క్యూసెక్కులు విడుదల అవుతోంది.

చిట్‌ఫండ్‌ యజమానికి బెయిల్‌ మంజూరు

గుంటూరు లీగల్‌: చిట్‌ ఫండ్‌ యజమానికి గుంటూరు జిల్లా ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్‌ జడ్జి కోర్టు మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది. పాలడుగు పుల్లారావు సాయిసాధన చిట్‌ఫండ్‌ కంపెనీ నడుపుతూ రూ.కోట్లు స్కామ్‌ చేసి ప్రజలను మోసం చేశారనే అభియోగంపై అరెస్టయ్యారు. దీనిపై నరసరావు పేట–1 టౌన్‌ సిట్‌ సీఐడీ వారు కేసు నమోదు చేశారు. ఇరువురి హామీతో షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.

వైభవంగా వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు1
1/1

వైభవంగా వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement