
అక్కడ అధికారంలోకి రాగానే...
ఎన్నికల వేళ కూటమి హామీ.. ఇప్పుడు అడిగితే కస్సు‘బస్సు’
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్) : కూటమి గద్దెనెక్కిన తరువాత తొలుత గత ఏడాది ఆగస్టు 15వ తేదీ నాటికి ఉచిత బస్సు హామీ అమలు చేస్తామని నేతలు చెప్పారు. అనంతరం దసరా ధమాకా... దీపావళికి టపాసులు పేలాస్తామంటూ.... ప్రేలాపనలు పలికారు. సంక్రాంతికి ఉచిత ప్రయాణం అని చెప్పిన సర్కార్ మాట విన్న మహిళలు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. తిరిగి ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఇలా ఏడాదిగా పూటకో మాట చెబుతూ ప్రకటనలు చేయడంపై మహిళలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం అంటూ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి ప్రకటించగా.. ఇంకో అమాత్యుడు నారా లోకేష్ రోడ్ మ్యాప్ వేద్దాం.. వచ్చే ఏడాది నుంచి పథకాల అమలుపై దృష్టి సారిద్దామని చెప్పి మ్యాప్ గీస్తూనే ఉన్నారా... అని సామాజిక మాధ్యమాల్లో పలువురు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఏకంగా సీఎం చంద్రబాబే అసెంబ్లీ సాక్షిగా ‘పథకాలు అమలు చేయాలంటే భయమేస్తోందని’ చెప్పటంపై ప్రజలు, మహిళలు ప్రభుత్వాన్ని చీదరించుకుంటున్నారు. ఇక ఉచిత ప్రయాణం లేనట్టేనా? అని మహిళలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో భారీగా మహిళా ప్రయాణికులు
గుంటూరు జిల్లాకు సంబంధించి నిత్యం లక్ష మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 60 శాతం మంది మహిళలే ఉన్నారు. గుంటూరు కేంద్రంగా నిత్యం అనేక ప్రాంతాలకు మహిళా ఉద్యోగులు, ఆయా పనులు చేసుకునే వారు, వ్యాపారం చేసే మహిళలు, విద్యార్థులు, ఇతర పనులపై వచ్చే యువతులు రాకపోకలు సాగిస్తున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి మహిళలు 1.50 లక్షలు, పశ్చిమ నియోజకవర్గంలో 1.30 లక్షలు, తెనాలిలో 1.41 లక్షలు, పొన్నూరులో 1.15 లక్షలు, తాడికొండలో 1.60 లక్షలు, మంగళగిరిలో 2.03 లక్షలు, ప్రత్తిపాడు నియోజకవర్గంలో 1.45 లక్షలమందికిపైగా ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో గుంటూరు 1, 2, తెనాలి, పొన్నూరు, మంగళగిరి డిపోలు ఉన్నాయి. రీజియన్ పరిధిలో 345 బస్సులు సేవలు అందిస్తున్నాయి. అధికంగా మహిళలు గుంటూరు 1, 2 డిపోలు, మంగళగిరి ప్రాంతాల నుంచి హైకోర్టు, సచివాలయం, ఇతరత్రా ఉద్యోగాలకు నెలవారీ పాస్లు తీసుకుని ప్రయాణిస్తున్నారని తెలుస్తోంది. నిత్యం ఆర్టీసీ ఆదాయం రూ.1.20 కోట్లకుపైగా ఉంటుంది. మహిళలకు ఉచిత ప్రయాణం అంటే 50 శాతం అనుకున్నా... రూ.60 లక్షల మేర ప్రభుత్వం ఆర్టీసీకీ చెల్లించాల్సి ఉంటుంది. అసలే డబ్బుల్లేవ్ అని చెబుతున్న చంద్రబాబు ఉచిత ప్రయాణ హామీని ఏ రకంగా అమలు చేస్తారని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ విశ్లేషకులూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మహిళలకు ఉచిత ప్రయాణం
మాట మరిచిన కూటమి సర్కారు
రోజుకో అబద్ధం చెబుతూ హామీ
అమలు దాటవేత
అధికారంలోకి వచ్చి ఏడాది
గడుస్తున్నా చిత్తశుద్ధి కరువు
కూటమిని నమ్మి మోసపోయామని
వాపోతున్న మహిళలు
కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం హామీని అమలు చేశాయి. తమిళనాడు రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచో అమలులో ఉంది. అయితే ఏపీలో మాత్రం ఈ సదుపాయం అందని ద్రాక్షగా మారింది. ఏపీలో కూటమి ఎన్నికల సమయంలో ఉచిత బస్సు అంటూ జోరుగా ప్రచారం చేసింది. అధికారంలోకి వచ్చాక ఆ ఊసే లేకుండా పోయింది.

అక్కడ అధికారంలోకి రాగానే...