
శ్రీవాసవీ దేవస్థానంపై కూటమి కుట్రలు
తెనాలి: పట్టణ బోసురోడ్డులోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వివాదం తారాస్థాయికి చేరింది. అధికారమే అండగా సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకున్నారు. మరోరోజు పోలీసు బలగాల నడుమ ఏకపక్షంగా తమకు తామే కొత్త కమిటీ ఎన్నికై నట్టు రాసేసుకున్నారు. అసలు కమిటీ సర్వసభ్య సమావేశాన్ని మే నెల నాలుగో తేదీన ఏర్పాటుచేస్తూ సభ్యులకు నోటీసులు పంపింది. ఆలయ కమిటీ వివాదం హైకోర్టులో ఉంది. మరో మూడురోజుల్లో ఉత్తర్వులు రానున్నాయి. ఈలోగానే ఎక్కడ కోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తుందనే భావనతో హడావుడిగా ప్రమాణస్వీకారానికి తెగబడ్డారు. మరికొన్ని గంటల్లో ప్రమాణస్వీకారం చేసేందుకు సన్నాహాల్లో ఉన్నారు. స్వయం ప్రకటిత కమిటీ పోకడలతో ఆర్యవైశ్యులు మనోవేదన చెందుతున్నారు.
పురాతన దేవాలయం
తెనాలిలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ప్రత్యేకమైంది. సువిశాలమైన నాలుగెరకాల విస్తీర్ణంలో 125 ఏళ్లకు పూర్వమే ఇక్కడ నిర్మితమైన శ్రీవాసవీ అమ్మవారి ఆలయం పురోగతి 2004 నుంచి విస్తృతమైంది. దేవస్థానం స్థలంలోనే గీతాభవనం, వైశ్య వ్యాయామశాల, వైశ్యవిద్యార్థి ధర్మనిధి, ఆర్యవైశ్య అపరకర్మశాల ఉన్నాయి. శ్రీరమాసహిత సత్యనారాయణస్వామి ఆలయాన్ని నిర్మించారు. నాలుగు కల్యాణమండపాలు, 20 సూట్లు సమకూరాయి. దేవస్థానం సత్రం కమిటీ దాతల సహకారంతోనే ఇవన్నీ సమకూర్చుకోగలిగారు. ఆలయానికి నెలకు రూ.10 లక్షల వరకు ఆదాయం వస్తోంది.
ఆలపాటి అరంగేట్రంతోనే..!
రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఎమ్మెల్సీగా ఎన్నికవటంతో ఆలయ పాలకవర్గంపై ఆధిపత్యం కోసం టీడీపీ ఆర్యవైశ్య నేతల ఆరాటం మొదలైంది. పాలకవర్గం పదవీకాలం పూర్తవటంతో ఈనెల 13న సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటుచేశారు. టీడీపీకి చెందిన ఆర్యవైశ్య నేతలు సమావేశం జరక్కుండా గందరగోళం సృష్టించారు. ఆర్యవైశ్యులు కాని టీడీపీ నేతలు, అన్య కులస్థులను భారీగా సమీకరించారు. వీరిలో కొందరు రౌడీషీటర్లు కూడా ఉన్నారు. దీంతో విధిలేని స్థితిలో సమావేశాన్ని వాయిదా వేశారు. ఇదే అదనుగా తర్వాత రెండురోజులకు టీడీపీ ఆర్యవైశ్యులు సమావేశానికి పిలుపునిచ్చారు. 15న తమ మద్దతుదారులతో వచ్చారు. అసలు కమిటీ నాయకుల అభ్యంతరాలను ఖాతరు చేయలేదు. అధికారం అండతో తమకు తామే కమిటీని కొత్త పుస్తకాల్లో రాసుకున్నారు. ఆఫీసు రూమ్ తాళాలు పగులగొట్టారు. తిరిగి వెళుతూ జై ఆలపాటి అంటూ నినాదాలు చేసుకుంటూ వెళ్లారు. ఇక అప్పట్నుంచి దూకుడు మొదలైంది.
అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘనే అధికారం అండగా రెచ్చిపోతున్న వైనం వివాదం హైకోర్టులో ఉన్నా ఖాతరు చేయని ధిక్కారం గంటల వ్యవధిలో ప్రమాణస్వీకారానికి ముహూర్తం 4వ తేదీ సమావేశానికి చట్టబద్ధ్దత లేదంటూ ప్రచారం స్వయం ప్రకటిత కమిటీ ఆగడాలపై ఆర్యవైశ్యుల ఆవేదన
ఏకపక్ష కమిటీ ప్రకటనపై ఆవేదన
ఆ తర్వాత అసలు కమిటీ మే నెల 4వ తేదీన సర్వసభ్య సమావేశానికి నిర్ణయించింది. వెయ్యి మంది సభ్యులకు లేఖలను పంపింది. కమిటీ బైలా నిబంధనల ప్రకారం సర్వసభ్య సమావేశంలో నిర్ణయం ప్రకారం ఎన్నిక నిర్వహించాలి. పోటీ ఉన్నట్టయితే మరో తేదీని నిర్ణయించి రహస్య బ్యాలెట్లో ఎన్నికలు జరపాల్సి ఉంది. అవేమీ లేకుండానే ఏకపక్షంగా కమిటీని ప్రకటించటం, పాత కమిటీ రద్దయిందన్న ప్రచారంపై ఆర్యవైశ్యులు నివ్వెరపోతున్నారు. పవిత్రమైన శ్రీవాసవీ అమ్మవారి దేవస్థానం ప్రాంగణాన్ని వివాదాలకు కేంద్రంగా చేయటంపై వారు వేదన పడుతున్నారు. మరోవైపు ఈ వివాదం హైకోర్టులో ఉంది. అసలు కమిటీ హైకోర్టును ఆశ్రయించగా, స్వయం ప్రకటిత కమిటీ తరఫున కేవియట్ వేశారు. మొత్తానికి మే నెల రెండో తేదీన దీనిపై హైకోర్టు స్పష్టత ఇవ్వనుందనే వార్తలు వచ్చాయి.
తీర్పు నేపథ్యంలో హడావుడిగా ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు..
దీంతో దృశ్యం మారింది. హడావుడిగా బుధవారం సాయంత్రం స్వయం ప్రకటిత పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఏర్పాటుచేస్తున్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్రమంత్రి నాదెండ్ల మనోహర్ అతిథులుగా ఆహ్వాన పత్రికలను సిద్ధం చేశారు. హైకోర్టులో వివాదం ఉన్న నేపథ్యంలో స్వయం ప్రకటిత కమిటీ ప్రమాణస్వీకారం ఏమిటి? ఇందుకు కూటమి మంత్రులు ఎలా వస్తారు? అంటూ పట్టణంలో తీవ్ర చర్చ నడుస్తోంది. పాలకవర్గం ప్రస్తుత అధ్యక్షుడు, ఆలయ అభివృద్ధిలో తనదైన ముద్రవేసిన నూకల వెంకట వేణుగోపాలరావు తీవ్ర అస్వస్థతకు లోనవటంతో ‘మెడికల్ ఎమర్జన్సీ’గా అమెరికా తరలించారు. ఇలాంటప్పుడు ఎన్నడూలేనివిధంగా ఆలయ పాలకవర్గంలో ఆధిపత్యం కోసం టీడీపీ ఆర్యవైశ్య నేతలు నిబంధనలను అడ్డగోలుగా ఉల్లంఘించటం, అందుకు మంత్రులు సైతం సై అంటూ వస్తామనటం తీవ్ర విమర్శలకు గురవుతోంది.