Nirmala Sitharaman: నవభారత్‌కు నవీకృత సంస్కరణలు

Nirmala Sitharaman Guest Column On Modi Implement Best Economic Reforms In India - Sakshi

పాత భారతదేశం ‘పరిరక్షణ లేదా నిర్లక్ష్యం’ మాటున వెనుకబడిపోయింది. దశాబ్దాలుగా లైసెన్సులు, కోటాల పాలనతో సాంఘిక సమానత్వం తీవ్రంగా దెబ్బతింది. ఇది భారత పెట్టుబడిదారులకు సంకెళ్లు తగిలించడమేగాక సంపదను, వనరులను కోల్పోయిన ఆర్థిక వ్యవస్థలో నిరాశ–నిస్పృహలను జొప్పించింది. ఈ నేపథ్యంలో 2014లో ప్రధానిగా పదవీ ప్రమాణం చేసిన మోదీ, ‘నవభారతం’ నిర్మించేందుకు కంకణబద్ధులయ్యారు. నవభారతానికి అప్పుడే పునాదులు పడ్డాయి. ప్రభుత్వం ఏదైనా చేయగలదన్న అతి నమ్మకాన్ని తొలగించి ప్రైవేట్‌ రంగం సామర్థ్యాలను వెలుగులోకి తీసుకురావడం కీలక లక్ష్యమైంది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థలో... ప్రత్యేకించి గడచిన ఏడేళ్లుగా పరివర్తనాత్మక మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి.

భారత ఆర్థిక వ్యవస్థలో... ప్రత్యేకించి గడచిన ఏడేళ్లుగా పరివర్తనాత్మక మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. దశాబ్దాలుగా లైసెన్సులు, కోటాల పాలనతో తీవ్రంగా దెబ్బతిన్న సాంఘిక సమానత్వం భారత పెట్టు బడిదారులకు సంకెళ్లు తగిలించడమేగాక సంపదను, వనరులను కోల్పోయిన ఆర్థిక వ్యవస్థలో నిరాశ–నిస్పృహలను చొప్పించింది. ఈ నేపథ్యంలో 1991లో ఆర్థిక వ్యవస్థ ద్వారాలు తెరుచుకోవడం మొద లైనప్పటికీ దానికి తగినట్లు తదుపరి అత్యవసర చర్యలు తీసుకోలేదు. దాంతో ‘ద్వారాలు తెరుచుకున్న’ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఆశించినంత మేర ప్రతిఫలించ లేదు. ఓ దశాబ్దం తర్వాత కొంత కృషి ప్రారం  భమైనప్పటికీ, అంతలోనే పరిపాలన చేతులు మారింది. అది కొద్ది కాలం మాత్రమే కొనసాగినా, ఓ దశాబ్దకాలం దారుణ వెనుకబాటుకు దారితీసి, ప్రపంచంలోని ఐదు దుర్బల ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారత్‌ కూడా చేరిపోయింది.

ఆ తర్వాత 2014లో ప్రభుత్వం మారినపుడు ప్రధానిగా పదవీ ప్రమాణం చేసిన మోదీ, ‘నవభారతం’ నిర్మించేందుకు కంకణబద్ధుల య్యారు. అంతకుముందు కొన్ని దశాబ్దాల నుంచీ హక్కుల సూత్రావళి ప్రాతిపదికన విధానాలను అనుసరిస్తున్నప్పటికీ పేదరికం, నిరు ద్యోగం, సదుపాయాల లేమి అనే విషవలయం నుంచి జనం బయట పడలేని దుస్థితి నెలకొంది. నైపుణ్యాలు, హస్త కళాకారులు, స్థానిక ఉత్పత్తులు, పాడి–జౌళి సహకార సంఘాలు, అన్నిటికీ పునరుజ్జీవనం, పునరుత్తేజం అవసరమైంది. పాలిపోయి, రంగు వెలిసిన పాత భారతా నికి కొంగ్రొత్త రంగులద్ది, కొత్తరూపం ఇవ్వడంద్వారా నవభారతానికి పునాదులు వేయాల్సిన అవసరం ఏర్పడింది.

పాత భారతదేశం ‘పరిరక్షణ లేదా నిర్లక్ష్యం’ మాటున వెనుకబడి పోయింది. సమసమాజ భారతంలో ప్రభుత్వం పూర్తి సామర్థ్యం చూపగలదు... ఏదైనా చేయగలదన్న అతి నమ్మకాన్ని ప్రజల్లో  కలిగిం చారు. ఆ మేరకు స్టీల్, సిమెంట్, గడియారాలు, టెలిఫోన్లు, టైర్లు, దుస్తులు, ఔషధాలు,  కండోమ్‌లు, స్కూటర్లు, కార్లు, ఓడలు, చివరకు బ్రెడ్‌ కూడా ప్రభుత్వ సంస్థలే తయారుచేశాయి. అదేవిధంగా బ్యాంకింగ్, బీమా, చమురుశుద్ధి, గనుల తవ్వకం, హోటళ్లు, ఆతిథ్యం, పర్యాటక రంగాల కార్యకలాపాలు సహా విమానయానం, దూరవాణి సేవల్లోనూ ప్రభుత్వమే ప్రధాన పాత్ర పోషించింది. అయితే, వీటన్నిటినుంచీ వైదొలగి ప్రైవేట్‌ రంగం సామర్థ్యాలను వెలుగులోకి తీసుకురావడం ముఖ్యం. చట్టబద్ధమైన లాభార్జనకు గుర్తింపుతోపాటు ఉపాధి–సంపద సృష్టి వనరుగా గౌరవించే విధానపరమైన మద్దతు పరిశ్రమలకు అవసరం. ఈ మేరకు నేడు భారత్‌ సరికొత్తగా రూపు దిద్దుకుంటోంది. హద్దులెరుగని వాణిజ్యం లేదా నిర్దాక్షిణ్య పెట్టుబడి దారీ విధానం తరహాలో కాకుండా భారతీయ విలువలు మేళవించిన మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థగా సుస్పష్టమైన

రీతిలో ముందడుగు వేస్తోంది. దీనికి ‘అందరి సహకారం–అందరి కృషి–అందరి ప్రగతి–అందరి విశ్వాసం’ అనే తారకమంత్రం మార్గనిర్దేశం చేస్తోంది. మోదీ తొలిదఫా ప్రభుత్వం పునరుజ్జీవం, పునరుత్తేజంపై సంపూర్ణంగా దృష్టి సారించి, సంస్కరణల ద్వారాలు పూర్తిగా తెరిచింది. పేదలకు ప్రయోజనాల కల్పన దిశగా తొలి మార్గంకింద ‘జన్‌ధన్‌ యోజన, ఆధార్‌బలోపేతం, మొబైల్‌ఫోన్‌ వినియోగం’ (జామ్‌ త్రయం) అమలులోకి వచ్చాయి. అటుపైన త్వరలోనే– ‘పెన్షన్లు, రేషన్, ఇంధనం, అర్హులైన వారికి సమ్మాన్‌నిధి’ వంటి లబ్ధిని నేరుగా వారి ఖాతాల్లోనే జమచేయడానికి వీలు కల్పించే ‘ప్రత్యక్ష లబ్ధి బదిలీ’ (డీబీటీ) అమలులోకి వచ్చింది. ఈ కసరత్తుతో పన్ను చెల్లింపు దారు లైన ప్రజలకు అనుబంధ ప్రయోజనాలు అందివచ్చాయి. మరోవైపు దేశవ్యాప్తంగా రకరకాల పన్నులున్న నేపథ్యంలో ‘వస్తు సేవల పన్ను’ (జీఎస్టీ) వ్యవస్థ వాటన్నిటినీ ఏకం చేసింది. అలాగే కాల పరిమితితో కూడిన దివాలా వివిదాల పరిష్కారం దిశగా ‘ఆర్థిక అశ క్తత–దివాలా స్మృతి’కి ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. అంతే కాకుండా ‘రికగ్నిషన్‌ (గుర్తింపు), రిజల్యూషన్‌ (పరిష్కారం), రీ– క్యాపిటలైజేషన్‌ (పునః మూలధనీకరణ), రిఫార్మ్‌ (సంస్కరణ)’ పేరిట నాలుగు ‘ఆర్‌’ల సూత్రంతో ద్రవ్యరంగ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. 

ఇక మోదీ రెండోదఫా అధికారంలోకి వచ్చాక ప్రపంచ మహమ్మారి పరిస్థితుల్లోనూ ఆర్థిక దిద్దుబాటు వేగం కొనసాగింది. మహ మ్మారి సమయంలో ఏ ఒక్కరూ ఆకలిదప్పులతో అల్లాడకుండా చూడా లన్న సంకల్పం సత్ఫలితాలిచ్చింది. ఆ మేరకు దేశంలో దాదాపు 80 కోట్ల మందికి పూర్తిగా 8 నెలలపాటు ఆహారధాన్యాలు ఉచితంగా సరఫరా చేశాము. అలాగే మూడు వంటగ్యాస్‌ సిలిండర్లు, అత్యవస రాల కోసం కాస్త నగదు సాయం కూడా అందించాము. దివ్యాంగులు, నిర్మాణరంగ కార్మికులు, పేదలైన వృద్ధులకూ కొంత ఉపశమనం సాయం కల్పించాము. నాలుగుసార్లు ప్రకటించిన ‘స్వయం సమృద్ధ భారతం’ ప్యాకేజీలతో చిన్న, మధ్యతరహా పరిశ్రమలతో పాటు వర్తకులు, చిరుద్యోగులకు సకాలంలో చేయూత ఇవ్వడమైంది. 

ఇదే సమయంలో అనేక వ్యవస్థీకృత సంస్కరణలు కూడా చేపట్టడం విశేషం. రెండోదఫా మోదీ ప్రభుత్వం సాధారణ బడ్జెట్‌ అనంతరం కార్పొరేట్‌పన్నును తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం ఆ సంస్కరణల్లో ఒకటి. కొత్త కంపెనీలకు ఈ పన్నును 15 శాతంగా నిర్ణయిస్తే, ప్రస్తుత సంస్థలకు 22 శాతానికి తగ్గించింది. అలాగే కంపెనీలకు కనీస ప్రత్యా మ్నాయ పన్ను (మ్యాట్‌) మినహాయించింది. రైతులకు సాధికారత కల్పన లక్ష్యంగా మూడు వ్యవసాయ సంస్కరణల చట్టాలు చేసింది.  ఇక మహమ్మారి సమయంలోనూ దేశవ్యాప్తంగా బ్యాంకుల విలీన ప్రక్రియ నిరాఘాటంగా సాగిపోయింది. ఆ మేరకు 2017లో 27గా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్య ఇవాళ 12కు దిగివచ్చింది. దీంతోపాటు జాతీయ ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ, భారత రుణ వసూళ్ల పునర్వ్యవస్థీకరణ కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఈ రెండు కంపెనీలూ వాణిజ్య బ్యాంకుల నిరర్ధక ఆస్తుల లెక్కలు తేల్చి, వాటి వసూలుకు కృషి చేస్తాయి. ఈ బకాయిల విలువ పరిపూర్ణతకు భరోసాగా ప్రభుత్వం తదనంతర వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. 

దేశంలోకి మరిన్ని పెట్టుబడులు రప్పించేందుకు, భారతదేశాన్ని తయారీ కూడలిగా మార్చడానికి వీలుగా 13 కీలక రంగాల కోసం ‘ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం’ (పీఎల్‌ఐ) ప్రారంభించడ మైంది. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ పునర్నవీకరణ నేపథ్యంలో ఈ పథకం కింద మొబైల్, వైద్య పరికరాలు, ఔషధ రంగంలో ఏపీఐ/ కేఎస్‌ఎం’ తయారీ, ఆహార తయారీ, జౌళి తదితరాల్లోకి పెట్టుబడులు వచ్చాయి. ఆర్థిక వ్యవస్థకు ఎంతో ముఖ్యమైన టెలికాం, విద్యుత్‌ రంగాల్లో దీర్ఘకాలం నుంచీ ఎదురుచూస్తున్న సంస్కరణలు ప్రారంభ మయ్యాయి. ప్రభుత్వరంగ సంస్థలకు సంబంధించి కేంద్ర బడ్జెట్‌– 2021 ఒక విధానం ప్రతిపాదించింది. తదనుగుణంగా కనీస సంఖ్యలో మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థలను అనుమతించే వ్యూహాత్మక రంగాలను గుర్తించింది. అదే సమయంలో ఈ రంగాలు మొత్తం ప్రైవేట్‌సంస్థలన్నిటికీ అవకాశం కల్పిస్తాయి. 

బ్యాంకులలో చిన్న డిపాజిట్‌దారులకు ఊరటగా రూ. 5 లక్షల దాకా డిపాజిట్లకు బీమా సదుపాయాన్ని విస్తరిస్తూ ‘డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ క్రెడిట్‌ గ్యారంటీ చట్టం’ సవరించడమైంది. ఈ చర్యతో బ్యాంకు లపై ఏవైనా ఆంక్షలు విధించినప్పుడు మొత్తం డిపాజిట్లలో 98.3 శాతానికి బీమా రక్షణ లభిస్తుంది. దీంతోపాటు చిన్న సంస్థలకు హామీ రహిత రుణాల లభ్యత దిశగా ‘స్వనిధి, ముద్ర, స్టాండప్‌’ పథకాలు ఇప్పటికే విజయవంతంగా అమలవుతూ పేదలు ఆత్మ గౌరవంతో జీవించడంలో అన్నివిధాలా తోడ్పడుతున్నాయి. ఇంతేకాదు... ప్రజ లతో మమేకమైన నాయకత్వం, ‘సబ్‌ కా సాథ్‌....’ తారకమంత్రం ఇంకా ఎంతో చేయగలవనడంలో అతిశయోక్తి లేదు.


వ్యాసకర్త కేంద్ర ఆర్థిక–కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మంత్రి 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top