బాల్య వివాహాన్ని అడ్డుకున్న ఐసీడీఎస్‌ అధికారులు | - | Sakshi
Sakshi News home page

బాల్య వివాహాన్ని అడ్డుకున్న ఐసీడీఎస్‌ అధికారులు

Jun 5 2025 8:02 AM | Updated on Jun 5 2025 8:02 AM

బాల్య వివాహాన్ని అడ్డుకున్న ఐసీడీఎస్‌ అధికారులు

బాల్య వివాహాన్ని అడ్డుకున్న ఐసీడీఎస్‌ అధికారులు

తాడేపల్లిగూడెం రూరల్‌ : మండలంలోని ఎల్‌.అగ్రహారం రాజీవ్‌ గృహకల్ప సముదాయంలో బుధవారం రాత్రి జరగాల్సిన బాల్య వివాహాన్ని ఐసీడీఎస్‌ అధికారులు అడ్డుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరపల్లి గ్రామానికి చెందిన బాలికకు, దేవరపల్లి మండలం బంధపురం గ్రామ వాసితో బుధవారం రాత్రి బాలిక అమ్మమ్మ స్వగ్రామం ఎల్‌.అగ్రహారం రాజీవ్‌ గృహకల్ప సముదాయంలో వివాహం చేసేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి 1098 నెంబరుకు కాల్‌ రావడంతో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ కే దుర్గాభవాని, కే విశాలాక్షి, మహిళా పోలీస్‌, అంగన్‌వాడీ కార్యకర్తలు బాలిక అమ్మమ్మ ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ నిర్వహించారు. అనంతరం బాలికను తణుకులోని బాలసదన్‌కు తాత్కాలిక వసతి నిమిత్తం తరలించినట్లు ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ కే దుర్గాభవాని తెలిపారు.

6 నుంచి హాకీ పోటీలు

భీమవరం: భీమవరం పట్టణంలోని డీఎన్నార్‌ కళాశాల ఆవరణలో ఈనెల 6వ తేదీ నుంచి 15వ హాకీ ఆంధ్రప్రదేశ్‌ జూనియర్‌ ఉమెన్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు కలిదిండి ఆనందరాజు, కేవీఎస్‌ భరత్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 8వ తేదీ వరకు పోటీలు జరుగుతాయన్నారు. రాష్ట్రంలోని 15 టీమ్‌లు పాల్గొంటాయని, విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతోపాటు ఆగస్టులో కాకినాడలో నిర్వహించే జాతీయస్థాయి పోటీలకు టీమ్‌ను ఎంపిక చేస్తామన్నారు.

డివైడర్‌పైకి దూసుకెళ్లిన లారీ.. వ్యక్తి మృతి

దెందులూరు: ఓ లారీ అదుపు తప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లడంతో డివైడర్‌పై నిద్రిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల ప్రకారం జాతీయ రహదారిపై ఏలూరు రూరల్‌ మండలం రత్న డాబా సమీపంలో గురువారం డివైడర్‌పై ఓ వ్యక్తి నిద్రిస్తున్నాడు. పార్సిల్‌ లారీ అదపు తప్పి డివైడర్‌పైకి దూసుకుపోయి ఆ వ్యక్తిపై ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఏలూరు మంచినీళ్ళతోటకు చెందిన రోళ్ల చంద్రరావు(44)గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏలూరు రూరల్‌ ఎస్సై దుర్గాప్రసాద్‌ చెప్పారు.

నిందితుడిపై మూడు కేసులు

ఆకివీడు : బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితుడిపై మూడు కేసులు నమోదు చేసినట్లు ఆకివీడు రూరల్‌ సీఐ జగదీశ్వరరావు బుధవారం చెప్పారు. కిడ్నాప్‌, అత్యాచారం, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశామన్నారు. గాయాలైన నిందితుడు షేక్‌ మీరాకు భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నామన్నారు. సంతపేట ప్రాంతంలో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేసినట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement