
నవధాన్యాలతో భూమికి జవసత్వాలు
భీమవరం: వ్యవసాయమే జీవనాధారమైన జిల్లాలో రైతన్నలు ఆరుగాలం కష్టపడి ఏటా మూడు పంటలు పండించేవారు. సార్వా, దాళ్వా వరిసాగే కాకుండా దాళ్వా పంట అనంతరం ఆరుతడి పంటలుగా మినుము, పెసర, మొక్కజొన్న, బొబ్బర్లు వంటి వాటితోపాటు పశుగ్రాసానికి పిల్లిపెసర, జనుము, జొన్న వంటివాటిని పండించేవారు. అయితే కొన్నేళ్లుగా వరిసాగులో జాప్యం కారణంగా దాళ్వా వరి పంట ఏప్రిల్, మే నెలల్లో చేతికి రావడంతో మూడవ పంట వేయడానికి సమయం సరిపోవడం లేదు. మూడవ పంటగా అపరాలు, పశుగ్రాసం పండించడం వల్ల భూమికి సహజంగా పోషక పదార్థాలు లభించేవి. మూడవ పంట లేకపోవడంతో రైతులు కేవలం ఎరువులు వేయడం ద్వారానే పంట దిగుబడి పెంచుకోడానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సివస్తుంది. అయితే పాత విధానంతో మూడు పంటలు పండించడానికి వ్యవసాయశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది.
సబ్సిడీపై విత్తనాల పంపిణీ
జిల్లాలోని 20 మండలాల పరిధిలో దాదాపు 2.20 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తుండగా దీనిలో మూడవ పంట పండించేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుత దాళ్వా సీజన్ ముగింపు దశలో జిల్లాలోని 21,150 ఎకరాల్లో రైతులను అపరాల సాగుతోపాటు పశుగ్రాసం పెంచేందుకు రైతులకు 50 శాతం సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేశారు. దీనికిగాను ప్రత్యేకంగా సేకరించిన మినుము, పెసర, జీలుగు, రాగి, సజ్జలు, నువ్వులు, వేరుశెనగ, ఆవాలు, పిల్లిపెసర, జనుము, మొక్క వంటివాటితోపాటు ఆకుకూరలైన తోటకూర, పాలకూర, మెంతుకూర, చుక్కకూర, గొంగూర, బీర, అనప, దోస వంటి సుమారు 15 రకాలు కలిగిన 12 కిలోల విత్తనాలను కిట్లుగా తయారుచేసి పంపిణీ చేశారు.
ప్రయోజనం ఏమిటంటే..
భూమిలో సారాన్ని సహజంగా పెంచడానికి వేరు వ్యవస్థ ఎంతగానో దోహదం చేస్తుంది. అందువల్ల వివిధ రకాల విత్తనాలు కలగలిపి చేలలో వేయడం వల్ల రైతులకు కొంతమేరకు ఆదాయంతోపాటు ఇంటి అవసరాలు తీర్చుకునే అవకాశం ఏర్పడుతుంది. ప్రధానంగా వివిధ రకాల తీగ, ఆకుజాతి మొక్కల వేర్లు వల్ల భూమిలో బ్యాక్టీరియా వృద్ధి చెంది సహజసిద్ధంగా భూసారం పెరుగుతుంది. దీనితో వరి పండించడానికి ఎక్కువ మోతాదులో ఎరువులు వాడనవసరం లేకపోవడమేగాక తెగుళ్లు కూడా తగ్గే అవకాశముంటుంది. భూమిలో బ్యాక్టీరియా వృద్ధి చెందడం వల్ల రైతులు పంటలకు కొద్దిమొత్తంలో ఎరువులు వేసినా వాటి సామర్థ్యం పెరిగి పంటకు ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుతం కొద్దిమొత్తం విస్తీర్ణం ప్రయోగాత్మకంగా వేసి నవధాన్యాల సాగు రానున్ను రోజుల్లో జిల్లా మొత్తం విస్తీర్ణం వేయడానికి రైతులను సన్నద్ధం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
జిల్లాలో 21 ఎకరాల్లో నవధాన్యాల సాగుకు విత్తన కిట్ల పంపిణీ
భూసారం పెరగడంతోపాటు రైతులకు ఆదాయం
జిల్లా వ్యాప్తంగా 2.20 లక్షల ఎకరాల్లో నవధాన్యాల సాగుకు ప్రణాళిక
నవధాన్యాల సాగు ఎంతో ప్రయోజనం
దాళ్వా అనంతరం నవధాన్యాల సాగు ఏడాది ప్రయోగాత్మకంగా చేపట్టాం. దాదాపు 21 వేల ఎకరాల్లో రైతులకు సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేశాం. దీనివల్ల రైతులకు కొంతమొత్తం ఆదాయం రావడమేగాక భూసారాన్ని సహజసిద్ధంగా పెంచుకునే అవకాశం ఏర్పడుతుంది. రానున్న రోజుల్లో జిల్లాలోని దాదాపు 2.20 లక్షల ఎకరాల్లో నవధాన్యాలసాగు చేపట్టే విధంగా రైతులకు అవగాహన కల్పిస్తాం. – జెడ్ వెంకటేశ్వరరావు,
జిల్లా వ్యవసాయశాఖాధికారి, భీమవరం

నవధాన్యాలతో భూమికి జవసత్వాలు