
ఇటుకలు మీదపడి కార్మికుడి దుర్మరణం
తణుకు అర్బన్ : తణుకు జాతీయ రహదారిపై ఇటుక లోడుతో వెళ్తున్న ట్రాక్టరు ట్రక్కు బోల్తా పడిన ఘటనలో ఒక వ్యక్తి దుర్మరణం చెందగా ముగ్గురు గాయపడ్డారు. ఘటనలో ట్రాక్టరు ట్రక్కుపై ప్రయాణిస్తున్న కార్మికుడు నక్కా ఏసు (42)పై ఇటుకలు పడడంతో మృతిచెందాడు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు నుంచి తాడేపల్లిగూడెం ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టరు తణుకు జాతీయరహదారి పాత టోల్గేట్ ప్రాంతానికి వచ్చేసరికి అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఇటుకలోడు దింపే కార్మికులు పెనుగొండ మండలం వడలి గ్రామానికి చెందిన నక్కా ఏసు, సీహెచ్ నాగబాబు, తొంట దుర్గాప్రసాద్, మద్దే ఏసు ఇటుకలోడుతో ఉన్న ట్రాక్టరుపై ప్రయాణం చేస్తున్నారు. ట్రక్కు తిరగబడిన వెంటనే కింద పడిన ఏసుపై ఇటుకలు పడిపోయాయి. స్థానికులు, తోటి కార్మికులు బలవంతంగా ఇటుకల్లోంచి అతడిని బయటకు లాగినా అప్పటికే మృతి చెందాడు. ఏసు మృతదేహాన్ని తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని మార్చురీకి తరలించగా, క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
వడలి.. కన్నీటి కడలి
వడలి గ్రామానికి చెందిన నక్కా ఏసు మృతితో ఆ కుటుంబం రోడ్డున పడిందని కుటుంబసభ్యులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. మృతుడికి భార్య భవానితోపాటు 8వ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నారు. ఒక రోజు క్రితమే నేను లేకపోతే మీరు ఎలా బతుకుతారని ఏసు తనను నిలదీశాడని భార్య భవాని రోదిస్తూ చెబుతున్న తీరు స్థానికులను కలచివేసింది. ఇలా అర్థంతరంగా వెళ్లిపోయావు.. మాకెవరు దిక్కంటూ ఆస్పత్రి ఆవరణలో ఆమె రోదనలు మిన్నంటాయి. తణుకు ఏఎస్సై రంగారావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
తణుకు జాతీయ రహదారిపై అదుపు తప్పి ఇటుక ట్రాక్టర్ బోల్తా
ఒకరి మృతి.. మరో ముగ్గురికి గాయాలు