
అదృశ్యమైన మహిళ మృతదేహం లభ్యం
కరప: ఇంటి నుంచి బయటకెళ్లి అదృశ్యమైన మహిళ యానాం సమీపంలో గోదావరిలో శవమై తేలింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు, కాజులూరు మండలం డేగలపేట గ్రామానికి చెందిన దేవు త్రిమూర్తులు, చక్రమ్మ రెండో కుమార్తె సౌమ్య(23) రెండేళ్ల క్రితం సుబ్బరాజును ప్రేమ వివాహం చేసుకుంది. వారికి 14 నెలల పాప ఉంది. సౌమ్య మంగళవారం అత్తతో గొడవపడి బయటకు వెళ్లిపోయింది. దీనిపై కరప పోలీసులు అదృశ్యం కేసుగా నమోదు చేసిన విషయం విదితమే. బుధవారం ఆమె మృతదేహం పుదుచ్చేరి రాష్ట్రం యానాం వద్ద గోదావరిలో లభ్యమైంది. యానాం వంతెన పైనుంచి దూకి ఉంటుందని అక్కడి పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని వెలికితీసి, యానాం ఆస్పత్రిలో పోస్ట్మార్టం నిర్వహించారు. మృతురాలి వద్ద లభ్యమైన ఆధారాల ప్రకారం ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించి, మృతదేహాన్ని అప్పగించారు. అదనపు కట్నం కోసం భర్త వేధింపులు, మరోవైపు అత్తింటి వేధింపులు భరించలేక తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు, బంధువులు యానాం పోలీసులకు ఫిర్యాదు చేయగా, అక్కడ కేసు నమోదైంది. బుధవారం రాత్రి మృతదేహాన్ని కరప పోలీసుస్టేషన్కు తీసుకొచ్చి మృతురాలి బంధువులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వివాహ సమయంలో కట్నకానుకలు ఇచ్చారని వారు చెప్పారు. అవి చాలవంటూ అదనపు కట్నం కోసం భర్త, అత్తింటి వేధింపులు భరించలేకే ఆత్యహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు విలపించారు. తమతో మాట్లాడటానికి కనీసం ఫోన్ కూడా ఇచ్చేవారు కాదని ఆరోపించారు. ఫోన్ ఇచ్చి ఉంటే అత్తింటి బాధలు తెలిసేవని, తమ కుమార్తెను రక్షించుకునేవారమన్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు కోరారు. కరప ఎస్సై టి.సునీత మాట్లాడుతూ, యానాంలో నమోదైన కేసును ఇక్కడకు బదలాయించాల్సి ఉందన్నారు. ఆమె భర్త, అత్తమామలను అదుపులోకి తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. అంత్యక్రియల తర్వాత కేసు మార్పిడికి చర్యలు తీసుకుంటామని ఎస్సై హామీ ఇచ్చారు. ఇరు కుటుంబాల వారితో మాట్లాడతామని ఎస్సై చెప్పడంతో ఆందోళన విరమించారు.
● పోలీస్స్టేషన్ వద్ద మృతదేహంతో
బంధువుల ఆందోళన
● అత్తింటి వేధింపులే కారణమంటున్న
తల్లిదండ్రులు

అదృశ్యమైన మహిళ మృతదేహం లభ్యం