
ఈఏపీ సెట్లో కోనసీమ సత్తా
● అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో టాప్–3గా మల్లేష్కుమార్
● ఇంజినీరింగ్, ఫార్మసీలో 2,866
● అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో 1,384 మంది అర్హత
రాయవరం: రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఇటీవల నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. కాకినాడ జేఎన్టీయూ ఏపీ ఈఏపీ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వీవీ సుబ్బారావు ఫలితాలను ఆదివారం విడుదల చేశారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్లకు చెందిన డేగల అఖిరానంద వినయ్ మల్లేష్కుమార్ రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు సాధించి, టాప్ 10 ర్యాంకర్లలో ఒకరిగా నిలిచాడు. అలాగే జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో రాయవరం మండలం పసలపూడికి చెందిన బిక్కిన సృజన రాష్ట్ర స్థాయిలో 194, అంబాజీపేట మండలం మాచవరం గ్రామానికి చెందిన గండ్రోతు అఖిల్ సాయి 207 ర్యాంకు సాధించాడు. అలాగే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో జిల్లాలో ఉప్పలగుప్తం మండలం నిమ్మకాయల కొత్తపల్లికి చెందిన లంకే అభిషేక్ 39, రావులపాలేనికి చెందిన తుమ్మూరి శివమణిదీప్ 44, రాయవరం గ్రామానికి చెందిన ద్వారంపూడి శ్యామ్ కృష్ణారెడ్డి 57, కె.గంగవరం మండలం సత్యవాడకు చెందిన పేకేటి లక్ష్మీ సాయి దినేష్ 73వ ర్యాంకు, మండపేటకు చెందిన పోలిశెట్టి తేజశ్రీభాస్కర్ 143, రాయవరం మండలం వెంటూరుకు చెందిన నురుకుర్తి వైష్ణవి 150, రావులపాలెం మండలం ఊబలంకకు చెందిన గాడుగొయ్యిల రేణుశ్రీ లక్ష్మీప్రసన్న 157, మండపేటకు చెందిన రెడ్డి ప్రజ్ఞశ్రీ 224వ ర్యాంకు సాధించారు.
బాలికలదే పైచేయి
ఇంజినీరింగ్ విభాగం ఫలితాల్లో బాలికలదే పైచేయిగా ఉంది. జిల్లాలో 4,036 మంది దరఖాస్తు చేయగా, ప్రవేశ పరీక్షకు 3,891 మంది హాజరై 2,866 మంది అర్హత సాధించారు. 1,380 మంది బాలురు, 1,486 మంది బాలికలు ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో 73.65 శాతం ఉత్తీర్ణత సాధించగా, వీరిలో బాలుర ఉత్తీర్ణత 72.02 శాతం, బాలికల ఉత్తీర్ణత 75.24 శాతంగా ఉంది. అలాగే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో 1,601 మంది దరఖాస్తు చేయగా, 1,510 మంది ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,384 మంది ప్రవేశ పరీక్షలో అర్హత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 91.65 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలుర ఉత్తీర్ణత 86.22 శాతం కాగా, బాలికల ఉత్తీర్ణత 93.02 శాతంగా ఉంది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగాల్లో బాలికల ఉత్తీర్ణత శాతం పైచేయిగా ఉండడం గమనార్హం.
రాయవరం విద్యార్థికి 57వ ర్యాంకు
రాయవరం గ్రామానికి చెందిన ద్వారంపూడి శ్యామ్కృష్ణారెడ్డి రాష్ట్ర స్థాయిలో 57వ ర్యాంకు సాధించాడు. ప్రణాళిక ప్రకారం చదవడం వల్ల తాను ఈ ర్యాంకు సాధించినట్లు కృష్ణారెడ్డి తెలిపారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం ర్యాంకు సాధించడానికి ఉపకరించినట్లు తెలిపాడు.
ఎంసెట్లో అభిరామ్కు 29వ ర్యాంక్
అమలాపురం టౌన్: అమలాపురం పట్టణం యర్రమిల్లివారి వీధికి చెందిన కొప్పినీడి వినాయక అభిరామ్ ఎంసెట్లో 29వ ర్యాంక్ (బైపీసీ విభాగం) సాధించాడు. అభిరామ్ విజయవాడ శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాడు. అభిరామ్ తండ్రి స్థానిక యర్రమిల్లివారి వీధిలో సాయిలీల ఆర్థోపెడిక్ హాస్పటల్ ప్రధాన వైద్యుడు కేవీ రమణకుమార్. తాను నీట్ పరీక్ష రాశానని ఎంబీబీఎస్ ఆపై పీజీ చదవి మంచి డాక్టర్ కావాలన్నది తన లక్ష్యమని అభిరామ్ తెలిపారు.
యశ్వంత్ రాజాకు 26వ ర్యాంక్
పి.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన కోడూరి యశ్వంత్ రాజా ఎంసెట్లో 26వ ర్యాంక్ (ఇంజినీరింగ్) సాధించాడు. యశ్వంత్ రాజా తల్లిదండ్రులు నాగ రత్నంనాయుడు, సత్యవేణి. రాజమహేంద్రవరం తిరుమల కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాడు. ప్రస్తుతం యశ్వంత్ రాజా కుటుంబం అమలాపురంలోనే నివాసం ఉంటోంది. హైదరాబాద్ ఐఐటీలో చదివి ఇంజినీర్ కావాలన్నదే తన లక్ష్యమని యశ్వంత్రాజా తెలిపాడు.

ఈఏపీ సెట్లో కోనసీమ సత్తా

ఈఏపీ సెట్లో కోనసీమ సత్తా