
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
రాయవరం: ఇంటర్మీడియెట్ ఫస్టియర్, సెకండియర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు మే నెలలో సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఇంటర్ ఫస్టియర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో 34 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్ జనరల్ విద్యార్థులు 3,315 మంది పరీక్షలకు హాజరు కాగా 1,137 మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ విభాగంలో 947 మందికి 380 మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లాలో 2,508 మంది విద్యార్థులు హాజరు కాగా, 1,122 మంది ఉత్తీర్ణత సాధించగా, ఒకేషనల్ విభాగంలో 826 మంది పరీక్షలకు హాజరు కాగా, 454 మంది ఉత్తీర్ణత సాధించారు.
సీనియర్ సిటిజన్లతో నేడు యోగా ప్రదర్శన
అమలాపురం రూరల్: యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ఉదయం 7 నుంచి 8 గంటల వరకూ సీనియర్ సిటిజన్లతో ప్రత్యేక యోగా ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అమలాపురం మెట్ల సత్యనారాయణ పార్క్, కొత్తపేట ఎంపీడీఓ కార్యాలయం, రామచంద్రపురంలోని కృత్తివెంటి పేర్రాజు పంతులు ప్రభుత్వ కళాశాలలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు.
నేటి నుంచి రీచ్లలోఇసుక విక్రయాలకు బ్రేక్
అమలాపురం రూరల్: రుతు పవనాలు సమీపిస్తున్నందున జిల్లాలోని 20 బహిరంగ రీచ్లలో ఆదివారం నుంచి ఇసుక విక్రయాలు నిలుపు చేస్తున్నట్టు కలెక్టర్ మహేష్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇకపై స్టాక్ యార్డుల ద్వారా మాత్రమే ఇసుక విక్రయాలు జరుగుతాయని స్పష్టం చేశారు. రావులపాలెం, గోపాలపురం, జొన్నాడ, ఆత్రేయపురం, తాతపూడి, అమలాపురం, ఊబలంక–1, 2, వద్దిపర్రు–1, 2, పొడగట్లపల్లి–1, 2, కపిలేశ్వరపురం, ఆలమూ రు, పులిదిండి, ఆత్రేయపురం మండలం అంకంపాలెం, నార్కెడ్మిల్లి తదితర రీచ్లలో ఇసుక విక్రయాలు నిలుపు చేస్తున్నామని వివరించారు. ఈ 20 రీచ్లకు వెళ్లే మార్గాల్లో కందకాలు తవ్వి, ఇసుక తవ్వకాలను నిషేధిస్తామని వెల్లడించారు.
11న మహాజ్యేష్టాభిషేకం
సఖినేటిపల్లి: అంతర్వేది క్షేత్రంలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి మూలవరులకు ఈ నెల 11న జ్యేష్టా నక్షత్ర పర్వదినం సందర్భంగా మహా జ్యేష్టాభిషేకం నిర్వహిస్తున్నారు. దీనికి అవసరమైన సప్త నదీ జలాలతో కూడిన కలశలను అర్చకులు శనివారం ఆలయానికి చేర్చారు. ఆలయంలో అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో వీటిని భద్రపరిచారు. సప్త నదులైన గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి పవిత్ర జలాలతో మహా జ్యేష్టాభిషేకం వైభవంగా నిర్వహించనున్నామని ప్రధానార్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ తెలిపారు. ఆ రోజు ఉదయం విష్వక్సేన పూజతో విశేషాభిషేకానికి శ్రీకారం చుడతామని, అనంతరం సప్తనదీ జలాలతో అభిషేకించి, మహా శాంతి హోమం నిర్వహిస్తామని స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, వేద పండితుడు చింతా వేంకటశాస్త్రి అన్నారు. సూపరింటెండెంట్ పి.విజయ సారథి తదితరులు పాల్గొన్నారు.
అప్పనపల్లిలో
భక్తజన కోలాహలం
మామిడికుదురు: అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి ఆలయం శనివారం భక్తులతో కోలాహలంగా మారింది. స్వామి వారి తిరు కల్యాణ మహోత్సవాల సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. స్నానఘట్టంతో పాటు పాత గుడి, కొత్త ఆలయం, కల్యాణకట్ట వద్ద భక్తుల సందడి నెలకొంది. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారికి తలనీలాలు సమర్పించారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన బాల బాలాజీ స్వామిని భక్తులు దర్శించుకున్నారు. స్వామి వారికి వివిధ సేవల ద్వారా రూ.4,16,615 ఆదాయం వచ్చిందని ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. స్వామి వారిని 5,800 మంది దర్శించుకున్నారని, 3,500 మంది స్వామి వారి అన్న ప్రసాదం స్వీకరించారని వివరించారు. లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా రూ.83,955 వచ్చిందన్నారు. నిత్యాన్నదాన ట్రస్టుకు భక్తులు రూ.86,273 విరాళాలుగా సమర్పించారని తెలిపారు.