ధర ఫుల్‌.. సరకు నిల్‌ | - | Sakshi
Sakshi News home page

ధర ఫుల్‌.. సరకు నిల్‌

Jun 8 2025 12:11 AM | Updated on Jun 8 2025 12:11 AM

ధర ఫుల్‌.. సరకు నిల్‌

ధర ఫుల్‌.. సరకు నిల్‌

పెరిగిన ధరలు

ప్రస్తుతం రూప్‌చంద్‌ ధరల పెరుగుదలకు పలు కారణాలు చెబుతున్నారు. ప్రధానంగా ఈ చేపల సాగు మన దేశంలోని ఆంధ్రప్రదేశ్‌తో పాటు బంగ్లాదేశ్‌, చైనాల్లో ఎక్కువగా ఉంది. చైనా, బంగ్లాదేశ్‌ల నుంచి దొడ్డి దారిన రూప్‌చంద్‌ చేపలను ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్‌కు తక్కువ ధరలకే తరలించేవారు. ఇటీవల బంగ్లాదేశ్‌ సరిహద్దులో వాణిజ్యం నిలిచిపోవడం వంటి కారణాలతో ప్రస్తుతం అటు నుంచి రూప్‌చంద్‌ దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో, ఆంధ్రాలో ఈ చేపలకు గిరాకీ పెరిగిందని భావిస్తున్నారు.

మలికిపురం: రూప్‌చంద్‌ చేపల ధరలు భారీగా పెరిగాయి. నాలుగేళ్ల క్రితం కేజీ రూ.30కి పడిపోయిన కేజీ రూప్‌చంద్‌ చేపలను ఎగుమతిదారులు ప్రస్తుతం రూ.114కు కొనుగోలు చేస్తున్నారు. మధ్యలో కాస్త పెరుగుదల ఉన్నప్పటికీ ఈ స్థాయిలో ధర పలకడం ఇదే మొదటిసారని ఎగుమతిదారులు అంటున్నారు. 2020లో అత్యధికంగా కిలో రూ.70 పలికిన ఈ చేప ధర అనంతరం రూ.30 కనిష్ట స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం ధర అయితే పెరిగిందిగానీ, రైతుల వద్ద సరకు లేదు. చెరువుల్లో కిలో రూప్‌చంద్‌ పెంపకానికి అన్ని ఖర్చులూ కలిపి రూ.80 వరకూ అవుతోంది. నాలుగేళ్లుగా ధర లేక నష్టాల బారిన పడిన రైతులు రూప్‌చంద్‌ పెంపకం జోలికే వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ధర పెరిగినా రైతుల వద్ద సరకు లేదు. ఈ చేపలకు తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, బిహార్‌, పశ్చిమ బెంగాల్‌ తదితర ఈశాన్య రాష్ట్రాల్లో బాగా డిమాండ్‌ ఉంది.

గతంలో భారీగా ఎగుమతులు

కోస్తా జిల్లాల్లో పదేళ్లుగా ఆక్వా రంగం కుదేలవుతున్న తరుణంలో రైతులు ఐదేళ్ల క్రితం ముమ్మరంగా రూప్‌చంద్‌ చేపల సాగు చేశారు. కోస్తా జిల్లాల నుంచి ఏటా 25 వేల టన్నుల రూప్‌చంద్‌ చేపలు ఇతర ప్రాంతాలకు ఎగుమతి అయ్యేవని అంచనా. అయితే, ధర పతనమైన తరువాత రైతులు దాని జోలికి వెళ్లలేదు. వేరే అవకాశం లేని ప్రాంతాల్లో తప్ప మిగిలిన ప్రాంతాలో ఈ చేపల సాగు నిలిపి వేశారు. అయినప్పటికీ ప్రస్తుతం ఏటా 5 వేల టన్నులకు పైగా ఈ చేపల ఎగుమతులు జరుగుతున్నట్లు అంచనా. ధర బాగున్న సమయంలో ఇక్కడి రైతులు సాగు చేశారు. ఎకరం చెరువులో సుమారు 4 వేల నుంచి 5 వేల వరకూ రూప్‌చంద్‌ చేప పిల్లలను పెంచుతారు. ఎకరానికి నాలుగు టన్నుల పైనే దిగుబడి వస్తుంది. తెగుళ్లను తట్టుకుని ఈ చేప పెరుగుతుంది.

ఇవీ ప్రత్యేకతలు

కొన్ని దేశాల్లో పిరాపింగా లేదా రెడ్‌–బెల్లీడ్‌ పాకు అని కూడా ఈ చేపను పిలుస్తారు. ఇది దక్షిణ అమెరికా మూలానికి చెందిన మంచినీటి చేప. రెడ్‌–బెల్లీడ్‌ పాకును అసోంలో సాధారణంగా శ్రీరుప్చంద్ఙ అని పిలుస్తారు. పాకు అనేది అనేక దక్షిణ అమెరికా చేప జాతులను సూచించడానికి ఉపయోగించే సాధారణ పేరు. ప్రత్యేకమైన రుచి కలిగిన చేపల్లో రూప్‌చంద్‌ ఒకటి. చెరువుల్లో పెంచుతారు కాబట్టి దీనిని కోస్తాలో చెరువు చందువా అని పిలుస్తారు. సముద్ర చందువా చేపలకు పోటీగా దీనిని మత్స్యశాఖ శాస్త్రవేత్తలు ఇక్కడ ప్రవేశపెట్టారు. కోల్‌కతా నుంచి సీడ్‌ వస్తుంది. సముద్ర చందువా చేపలు ఒక సీజన్‌లో మాత్రమే లభిస్తాయి. రూప్‌చంద్‌ చేప మన దేశంతో పాటు బంగ్లాదేశ్‌, చైనాల్లో కూడా పెరుగుతుంది. అన్ని సీజన్లలోనూ లభిస్తుంది. ఇది భిన్నమైన నిర్మాణ శైలి కలిగి ఉన్న చేప. సముద్ర చందువాతో పాటే, చెరువు చందువా చేపను చైనీస్‌లో ఫ్రాంఫెట్‌ అని పిలుస్తారు. తెలుగులో దీనిని చందువా లేదా సందువా అని అంటారు. ఈ జాతి చేపలు కొన్ని ఎరుపు, తెలుపు, నలుపు, సిల్వర్‌ రంగుల్లో ఉంటాయి. చెరువుల్లోనూ, నదుల్లోనూ పెరుగుతాయి. సిల్వర్‌ రంగు చేపలు ఉప్పునీటిలో సైతం పెరుగుతాయి. ఎముకను కలిగి ఉండటం ఈ చేప ప్రత్యేకత. అయితే ముళ్లు గుచ్చుకుంటాయనే భయం లేకుండా ఈ చేపలను ఎక్కువగా ఇష్టంగా తింటారు. రూప్‌చంద్‌ మాంసంలో ఎక్కువగా ప్రొటీన్లు, విటమిన్లు లభిస్తాయి. పోషక విలువలు అధికంగా ఉండే ఈ చేపలను ఆహారంగా తీసుకోవడం ఆరోగ్యకరం. దీనిలో ప్రత్యేకంగా అమైనో ఆమ్లాలు, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. రూప్‌చంద్‌ చేపలో సోడియం, పొటాషియం, కాల్షియం, ఐరన్‌, విటమిన్‌–సి, విటమిన్‌–ఇ, శాచ్యురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌, అన్‌ శాచ్యురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌ లభిస్తాయి. ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి తింటే మెదడు బాగా పని చేస్తుంది. గుండె జబ్బులకు గురి కాకుండా ఉంటారు. ఇందులో ఉండే ఐరన్‌, మెగ్నీషియం మానవ శరీరంలోని ఎంజైముల పని తీరును మెరుగుపరుస్తాయి.

ఫ అమాంతం పెరిగిన రూప్‌చంద్‌ ధర

ఫ కేజీ రూ.113

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement