నిత్య కల్యాణమూర్తీ.. గోవిందా.. | - | Sakshi
Sakshi News home page

నిత్య కల్యాణమూర్తీ.. గోవిందా..

Jun 8 2025 12:11 AM | Updated on Jun 8 2025 12:11 AM

నిత్య కల్యాణమూర్తీ.. గోవిందా..

నిత్య కల్యాణమూర్తీ.. గోవిందా..

కొత్తపేట: నిత్య కల్యాణమూర్తీ.. గోవిందా.. అంటూ భక్తుల గోవింద నామస్మరణతో ఆత్రేయపురం మండలం వాడపల్లి క్షేత్రం ప్రతిధ్వనించింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా ఇక్కడ కొలువు తీరిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు శనివారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచే వాడపల్లి బాట పట్టారు. ఏడు శనివారాల వెంకన్న దర్శనం నోము పట్టిన భక్తులు మాడ వీధుల్లో ప్రదక్షిణలు చేసి, భారీగా బారులు తీరి మరీ స్వామిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కులు చెల్లించారు. అనేక మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో తెల్లవారుజామున ప్రధానార్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్‌ ఆధ్వర్యాన అర్చకులు, వేద పండితులు స్వామివారికి సుప్రభాత సేవ, వివిధ పూజాదికాలు నిర్వహించారు. అభిషేకాలు, అర్చనల అనంతరం సుగంధ భరిత పుష్పాలతో స్వామివారిని విశేషంగా అలంకరించారు. అనంతరం భక్తులకు దర్శనాలు కల్పించారు. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఆలయంలోని పలు ప్రాంతాల్లో కూలర్లు ఏర్పాటు చేశారు. మాడ వీధులు, ఆలయ ప్రాంగణంలో మజ్జిగ పంపిణీ చేశారు. విశిష్ట, ప్రత్యేక దర్శనాలు, వేదాశీర్వచనం, ఆన్‌లైన్‌, నిత్య, శాశ్వత అన్నదాన విరాళాలు, లడ్డూ ప్రసాద విక్రయం తదితర రూపాల్లో సాయంత్రం 6 గంటల సమయానికి దేవస్థానానికి రూ57,83,778 ఆదాయం సమకూరిందని ఈఓ తెలిపారు. ఎస్సై ఎస్‌.రాము ట్రాఫిక్‌ నియంత్రించి, శాంతిభద్రతలను పర్యవేక్షించారు. ధర్మపథం కార్యక్రమంలో భాగంగా రాత్రి వివిధ ప్రాంతాలకు చెందిన నృత్య కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం విశేషంగా ఆకట్టుకుంది.

ఫ వాడపల్లి క్షేత్రం.. భక్తజన సంద్రం

ఫ వేలాదిగా తరలివచ్చిన భక్తులు

ఫ రూ.57.83 లక్షల ఆదాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement