ఆ రికార్డులు మళ్లీ మళ్లీ బద్దలు! | - | Sakshi
Sakshi News home page

ఆ రికార్డులు మళ్లీ మళ్లీ బద్దలు!

Jun 9 2025 12:07 AM | Updated on Jun 9 2025 12:07 AM

ఆ రిక

ఆ రికార్డులు మళ్లీ మళ్లీ బద్దలు!

ఉద్యోగం.. ఉపాధి.. నిరుద్యోగ భృతి

ఇలా ఎన్నో హామీలతో నయ వంచన

జిల్లాలో 20 వేల మందికి పైగా

నిరుద్యోగులు

ఏడాదిలో రూ.72 కోట్ల భృతి బకాయి

ఏడాది తరువాత డీఎస్సీ నిర్వహణ

నియామకాలపై అభ్యర్థుల అనుమానాలు

పరిశ్రమల కల్పనకు ప్రోత్సాహం శూన్యం

దరఖాస్తుల స్థాయిలోనే

కార్పొరేషన్ల రుణాలు

సాక్షి, అమలాపురం: వంచనలో రికార్డులు సృష్టించాలన్నా.. వాటిని బద్దలుకొట్టి తిరగరాయాలన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మాత్రమే సాధ్యమనే విమర్శ సర్వత్రా ఉంది. ఎవరి అవసరాలను బట్టి వారికి ఇవ్వాల్సిన హామీలు ఎన్నిసార్లైనా.. ఎన్ని ఎన్నికల్లో అయినా ఎడాపెడా ఇచ్చేసి మళ్లీ ఎన్నికలకు అవే హామీలతో సిద్ధమైపోయి గద్దెనెక్కడం ఆయన ప్రత్యేకత. బాబోరు చెప్పారంటే చెయ్యరంతే అని నిశ్చయంగా అనుకునే వారిని సైతం ఈసారి చేస్తారేమో అనిపించేంత నమ్మించి వంచించడంలో ఆయన దిట్ట అని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. అది కూడా చదువుకున్న యువత ఆ మోసాల వలలో పడడం గమనార్హం. 2014 ఎన్నికల ముందు సైతం చంద్రబాబు నాయుడు ఇదే హామీ ఇచ్చి గెలిచారు. తీరా గెలిచిన తరువాత వంద మందిలో ఒకరిద్దరికి మాత్రమే నిరుద్యోగ భృతి అందించి.. అది కూడా ఎన్నికల ముందు ఒక నెల ఇచ్చి మమ అనిపించారు. ఈ సారి కూడా అదే హామీని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో సూపర్‌ సిక్స్‌లో ప్రకటించి నిరుద్యోగులను నమ్మించారు. ఈ హామీకి తోడు అదనంగా రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు.. నిరుద్యోగ యువతకు ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్‌ రుణాలు.. ఆపై స్థానికంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు.. విలువ ఆధారిత పరిశ్రమలకు రాయితీల పేరుతో పెద్ద ఎత్తున ఎన్నికల హామీలు గుప్పించారు. ఏడాది కాలంగా యువతకు ఒక్క పైసా నిరుద్యోగ భృతి ఇవ్వడం కాని.. రాయితీలపై రుణాలు ఇవ్వడం కాని.. పరిశ్రమల ఏర్పాటుకు కార్పొరేషన్‌ రుణాలు కాని ఇవ్వకుండా నిరుద్యోగ యువతను నిలువునా మోసం చేశారు. ఒక్క నియామకం కూడా చేపట్టకుండా వారికి పంగనామాలు పెట్టారు.

కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమలేవీ?

కోనసీమ జిల్లా వ్యవసాయ ఆధారితం. ఇక్కడ భారీ పరిశ్రమల ఏర్పాటుకు వనరులున్నా అవకాశాలు తక్కువ. కేజీ బేసిన్‌లో పెద్ద పెద్ద కార్పొరేట్‌ సంస్థలు, బహుళ జాతి సంస్థలకు తప్ప స్థానికులకు పరిశ్రమలు పెట్టే అవకాశం లేదు. ఆర్థిక వనరులు కూడా లేవు. వాటికి అనుబంధ పరిశ్రమలు కూడా స్థానికేతరులే పెడతారు. ఇక్కడ ఏదైనా పరిశ్రమ పెట్టాలంటే అది వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలే పెట్టాల్సి ఉంది. దీనిపై గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున కసరత్తు జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వన్‌ డిస్ట్రిక్ట్‌ వన్‌ ప్రొజెక్టు’ కోనసీమ జిల్లాను కొబ్బరి, క్వాయర్‌కు ఎంపిక చేశారు. దీనిలో భాగంగా కొబ్బరి, కొబ్బరి పీచు విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో 285 వరకు క్వాయర్‌ చిన్న, మధ్య తరహా, పెద్ద పరిశ్రమలు ఉన్నాయని అంచనా. ఇవి కాకుండా మహిళలు తాళ్లు తయారు చేసే చిన్నచిన్న యూనిట్లు కూడా ఉన్నాయి. క్వాయర్‌ పరిశ్రమలు ఆశాజనకంగా ఉన్నా కొబ్బరితో తయారు చేసే పరిశ్రమలు లేవని గుర్తించిన గత ప్రభుత్వం వాటిని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా కోకోనట్‌ బోర్డు, క్వాయర్‌ బోర్డు, పరిశ్రమల శాఖ, డీఆర్‌డీఏ, ఎంఎస్‌ఎంఈ, ఖాదీ బోర్డు వంటి వాటిని ఒక గొడుగు కిందకు తీసుకువచ్చి వాటితో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. కొబ్బరి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసే పరిశ్రమలకు రాయితీలు కూడా పెంచాలని నిర్ణయించాయి. ఈ ప్రాజెక్టు జిల్లాలో పట్టాలెక్కే సమయంలో ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ ఏడాది కాలంలో దీని ప్రస్థావనే లేకుండా పోయింది. దీని స్థానంలో కొత్తగా కోకోనట్‌ పార్కు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రచారం చేస్తోంది. దీని వల్ల ఒనగూరే ప్రయోజనం ఎంతో చూడాల్సి ఉంది. ఇదే కాకుండా మిగిలిన చిన్న పరిశ్రమల ఏర్పాటు కూడా జిల్లాలో జరగలేదు. దీని వల్ల ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందిన నిరుద్యోగ యువత పెద్దగా లేదనే చెప్పాలి. పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలో ఐదేళ్లలో నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగ కల్పన అనేది ప్రకటనలకు, ప్రచారానికే పరిమితం కానుంది.

డీఎస్సీ నియామకాలు ఎప్పుడో?

చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో పెట్టిన సంతకాలలో ఒకటి మెగా డీఎస్పీ ఫైల్‌ పైనే. తొలి సంతకం కార్యరూపం దాల్చడానికి ఏడాది సమయం పట్టింది. డీఎస్సీకి సంబంధించి పరీక్షల నిర్వహణ వాయిదాలపై వాయిదా వేసి అధికారంలోకి వచ్చిన ఏడాదికి నిర్వహిస్తున్నారు. పరీక్షల తరువాత నియామకాలు వెంటనే చేపడతారనే నమ్మకం అభ్యర్థులలో లేకపోవడం గమనార్హం.

అన్యాయంగా తొలగించారు

18 నెలల ముందుగా ఎండీయు ఆపరేటర్లను, హెల్పర్లను ప్రభుత్వం తొలగించి అన్యాయం చేసింది. 2027 వరకు కాంట్రాక్టు ఉండగా నోటీసు ఇవ్వకుండా అన్యాయంగా తొలగించారు. గత నెలకు జీతాలు చెల్లించలేదు. తమను తొలగించడం వల్ల జిల్లా వ్యాప్తంగా 710 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రభుత్వం తమకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించి అదుకోవాలి.

– బొంతు రామదాసు, ఎండీయూ ఆపరేటర్‌,

రేషన్‌ వాహనాల సంఘం జిల్లా అధ్యక్షుడు,

అయినవిల్లి మండలం

నిరుద్యోగ భృతి లేదు

నిరుద్యోగ భృతిని ప్రభుత్వం విజయవంతంగా ఎగ్గొట్టింది. 2014లో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి కేవలం ఒక్క నెల మాత్రమే.. అది కూడా ఎంపిక చేసిన తమ పార్టీ కార్యకర్తలకు ఒక్క నెల మాత్రమే నిరుద్యోగ భృతి అందజేసి అయిందనిపించారు. ఈసారి ఎన్నికల ముందు టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో మరోసారి నిరుద్యోగ భృతిని పెట్టారు. అది కూడా సూపర్‌ సిక్స్‌ పథకంలో దీనిని ఒక హామీగా చెప్పారు. గెలిచి ఏడాది అవుతున్నా ఆ హామీ నెరవేర్చకుండా నిరుద్యోగ యువతను చంద్రబాబు రెండోసారి మోసం చేసి జోకొడుతున్నారు. జిల్లాలో సుమారు 20 వేల మంది వరకు నిరుద్యోగ యువత ఉంటుందని అంచనా. వీరికి నెలకు రూ.మూడు వేల చొప్పున ఏడాది కాలంలో రూ.36 వేలు కూటమి ప్రభుత్వం ఎగనామం పెట్టినట్టు అవుతుంది. మొత్తం మీద ఏడాది కాలంలో రూ.72 కోట్లను కూటమి ప్రభుత్వం విజయవంతగా ఎగ్గొట్టింది.

దరఖాస్తులకే పరిమితమైన కార్పొరేషన్‌ రుణాలు

జిల్లాలో బీసీ, ఎస్సీ, కాపు, ఇతర సామాజిక వర్గాలకు అడిగిన వారికి అడిగినన్ని రుణాలు కార్పొరేషన్ల ద్వారా ఇస్తామని కూటమినేతలు ఊరువాడ ప్రచారంతో హోరెత్తించారు. దరఖాస్తు చేసుకున్న అందరికీ సబ్సిడీ రుణాలని ఊరించారు. గత ఏప్రిల్‌ నెలలో ఆర్భాటంగా దరఖాస్తులు స్వీకరించారు. కూటమి నేతల మాటలు నమ్మి, స్వయం ఉపాధి పొందవచ్చనే ఆశతో వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. తీరా మంజూరుకు వచ్చేసరికి వారి ఆశలపై ప్రభుత్వం మళ్లీ నీళ్లు చల్లింది. వివిధ కార్పొరేషన్ల ద్వారా మంజూరు చేసిన యూనిట్లు పదుల సంఖ్యలో ఉంటే.. వాటికి దరఖాస్తులు వేల సంఖ్యలో వచ్చాయి. ఇంతా చేసి ఒక్కో నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాలకు కలిపి అన్ని కార్పొరేషన్ల నుంచి సుమారు 120 యూనిట్లు కేటాయించారు. వీటి కోసం 1,500 నుంచి 2,500 మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో, ఈ అరకొర యూనిట్లు తాము సిఫారసు చేసిన వారికే దక్కాలంటూ అనేక నియోజకవర్గాల్లో కూటమిలోని మూడు పార్టీల నేతలు గొడవలకు దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. టీడీపీ, జనసేన నాయకుల మధ్య అయితే పెద్ద యుద్ధమే జరుగుతోంది. పెద్ద సంఖ్యలో ఆశావహులు ఉన్నప్పుడు ఒకరిద్దరికి లబ్ధి చేకూరిస్తే మొదటికే మోసం వస్తుందని భయపడ్డారు. ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలకు తెలిపి మొత్తం యూనిట్ల పంపిణీ నిలిపివేశారు.

ఉన్న ఉద్యోగాలు పీకేశారు

కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కొత్త కొలువులు, ఉపాధి కల్పన, వృత్తుల ప్రోత్సాహం అటుంచి ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నారు. సంక్షేమ పథకాల లబ్ధిని గడప వద్దనే అందించి, ప్రజా సేవలో మమేకమైన వలంటీర్‌ వ్యవస్థను మొత్తానికే ఎత్తేశారు. మాజీ సీఎం జగన్‌ ఏర్పాటు చేసిన వలంటీర్‌ వ్యవస్థలో జిల్లాలో పట్టణ, గ్రామ స్థాయిలో సుమారు 9,900 మంది సేవలందించారు. సంక్షేమ పథకాల లబ్ధిని అందించడం, ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకోవడం, ప్రజలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు వారి వద్దకు తీసుకు రావడం వంటి సేవలతో పాటు కరోనా, గోదావరి వరదల వంటి విపత్కర సమయాల్లో నిరుపమాన సేవలందించారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్లకు రూ.పది వేల చొప్పున అందిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని గాలికి వదిలేశారు. తాజాగా ఇంటింటా రేషన్‌ అందించే ఎండీయూ వాహన వ్యవస్థ నిలిపివేశారు. జిల్లాలో ఉన్న 355 వాహనాలకు సంబంధించి ఒక్కొక్క దానిలో ఒక ఆపరేటర్‌, ఒక హెల్పర్‌ చొప్పున మొత్తం 710 మందికి ఉపాధి లేకుండా చేశారు.

ఆ రికార్డులు మళ్లీ మళ్లీ బద్దలు!1
1/4

ఆ రికార్డులు మళ్లీ మళ్లీ బద్దలు!

ఆ రికార్డులు మళ్లీ మళ్లీ బద్దలు!2
2/4

ఆ రికార్డులు మళ్లీ మళ్లీ బద్దలు!

ఆ రికార్డులు మళ్లీ మళ్లీ బద్దలు!3
3/4

ఆ రికార్డులు మళ్లీ మళ్లీ బద్దలు!

ఆ రికార్డులు మళ్లీ మళ్లీ బద్దలు!4
4/4

ఆ రికార్డులు మళ్లీ మళ్లీ బద్దలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement