
డీఎస్సీ పరీక్షలకు 55 మంది గైర్హాజరు
అమలాపురం రూరల్: జిల్లాలో ఆదివారం డీఎస్సీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. రెండు పరీక్షా కేంద్రాల్లో రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరిగినట్లు డీఈఓ షేక్ సలీం బాషా ఒక ప్రకటనలో తెలిపిపారు. ఉదయం మొదటి షిఫ్ట్లో
భట్లపాలెం బీవీసీ ఇంజనీరింగ్ కాలేజ్లో 160 మందికి 159 మంది హాజరై, ఒకరు గైర్హాజరు అయ్యారు. చెయ్యేరు శ్రీనివాస ఇంజినీరింగ్ కాలేజ్లో 160 మందికి 156 మంది హాజరై నలుగురు గైర్హాజరయ్యారన్నారు. రెండో షిఫ్ట్ మధ్యాహ్నం బీవీసీ కళాశాలలో 160 మందికి 138 హాజరై 22 మంది గైర్హాజరైనట్టు తెలిపారు. శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాలలో 160 మందికి 132 హాజరై 28 మంది గైర్హాజరయ్యారని ఆయన తెలిపారు.
లక్ష్మీనృసింహునికి
జన్మ నక్షత్ర పూజలు
సఖినేటిపల్లి: అంతర్వేది ఆలయంలో లక్ష్మీనృసింహుని జన్మనక్షత్రం స్వాతిని పురస్కరించుకుని ఆదివారం అష్టోత్తర కలశాభిషేకం నిర్వహించారు. ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యాన స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, అర్చకుడు పి.రామశేషాచార్యులు ఈ పూజలు చేశారు. తొలుత వశిష్ట గోదావరి నది నుంచి 108 కలశాలతో తెచ్చిన పవిత్ర జలాలతో ఆలయ ప్రదక్షిణ చేసి అనంతరం స్వామివారి మూల మంత్రంతో ఆవాహనం చేసి అర్చన చేశారు. అలాగే సర్వదేవతలను కలశల్లోకి ఆవాహనం చేసి విశేష పూజలు చేశారు. భక్తులకు అన్నదాన పథకంలో భోజన వసతి అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ పర్యవేక్షించారు. అలాగే శనివారం రాత్రి ఆలయంలో వేంకటేశ్వరుని తిరు కల్యాణ మహోత్సవాలు ప్రారంభించారు. ఐదు రోజులు పాటు ఉత్సవాలు జరుగనున్నట్లు స్థానాచార్య రంగాచార్యులు అన్నారు. విష్వక్సేన పూజ, అంకురార్పణ, ధ్వజారోహన వంటి విశేష కార్యక్రమాలు చేశారు.
షైనింగ్ స్టార్స్కు నేడు సన్మానం
అమలాపురం రూరల్: పది, ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ పేరుతో సోమవారం నగదు పురస్కారాలు, ప్రశంసా పత్రాలు ప్రదానం చేయనున్నారు. మండలాల వారీగా సామాజికవర్గాల వారీగా మొదటి ఆరు స్థానాల్లో నిలిచిన వారికి వాటిని ఇవ్వనున్నారు. ఓసీ, బీసీ సామాజిక వర్గాల నుంచి ఇద్దరు వంతున, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరు వంతున రూ.20వేల చొప్పున చెక్కులు, పతకం, ప్రశంసా పత్రాన్ని అందజేయనున్నారు. ఇంటర్ విద్యార్థులకు సైతం 22 మండలాల నుంచి 29 మందికి, పదో తరగతి విద్యార్థులు 139 మందికి ఈ పురస్కారాలు ఇవ్వనున్నారు. స్థానిక సత్యనారాయణ గార్డెన్స్లో నిర్వహించే ఈ కార్యక్రమానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఆయా పాఠశాలల హెచ్ఎంలు పాల్గొననున్నారు. ఇప్పటికే ఎంఈఓలు ఆయా విద్యార్థులకు సమాచారం అందజేశారు. కలెక్టర్ డాక్టర్ మహేష్కుమార్ రావిరాల ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో జిల్లా మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీం బాషా, సమగ్ర శిక్షా ఏపీసీ జి.మమ్మీ, ఆర్డీవో మాధవి పర్యవేక్షించారు.
నేడు పీజీఆర్ఎస్
అమలాపురం రూరల్: కలెక్టరేట్ గోదావరి భవన్లో సోమవారం ఉదయం పది గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహిస్తునట్లు జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు 1100 కాల్ సెంటర్ ద్వారా తమ ఫిర్యాదుల పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చునన్నారు. ప్రజల సౌకర్యం కోసం ఈ వేదికను మూడు రెవెన్యూ డివిజన్లలోని 22 మండల కేంద్రాలు, 4 మున్సిపల్ కార్యాలయాలలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అర్జీదారులు ఆయా స్థాయిలలో తమ సమస్యలను నమోదు చేసుకుని పరిష్కారం పొందాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

డీఎస్సీ పరీక్షలకు 55 మంది గైర్హాజరు