కౌంటింగ్‌కు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

Mar 3 2025 12:12 AM | Updated on Mar 3 2025 12:10 AM

28 టేబుళ్లు.. 17 రౌండ్లు

2,18,902 ఓట్ల లెక్కింపు

ఏలూరు (మెట్రో): ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఏలూరులోని సీఆర్‌ రెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు సోమవారం ప్రారంభం కానుంది. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ఆధ్వర్యంలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని ఆరు జిల్లాల్లోని 456 పోలింగ్‌ కేంద్రాల్లో గత నెల 27న పోలింగ్‌ జరిగింది.

69.50 శాతం పోలింగ్‌

అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3,637, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 47,125, ఏలూరు జిల్లాలో 29,651, కాకినాడ జిల్లాలో 47,150, తూర్పు గోదావరి జిల్లాలో 42,446, పశ్చిమ గోదావరి జిల్లాలో 48,893 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 69.50 శాతం ఓటింగ్‌ నమోదు కాగా, బ్యాలెట్‌ బాక్సులను ఏలూరులోని స్ట్రాంగ్‌ రూములో భద్రపరిచారు. ఈ ఎన్నికల బరిలో 35 మంది నిలిచారు. టీడీపీ బలపర్చిన పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్‌ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులు మధ్య ప్రధాన పోటీ నెలకొందని భావిస్తున్నారు.

ఉదయం 7 గంటలకు..

కౌంటింగ్‌ కేంద్రానికి సిబ్బంది 6.30 గంటలలోపు చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్‌ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. మూడు షిప్టుల్లో 700 మంది సిబ్బంది ఓట్ల లెక్కింపులో పాల్గొంటారు. మొత్తం 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 17 రౌండ్లలో కౌంటింగ్‌ జరగనుంది. ప్రతి టేబుల్‌కు కౌంటింగ్‌ సిబ్బంది, సూపర్‌వైజర్‌, రోల్‌ ఇన్‌చార్జి, షిఫ్ట్‌ ఇన్‌చార్జి, మైక్రో అబ్జర్వర్లు విధులు నిర్వహిస్తారు.

సమగ్ర శిక్షణ

ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏలూరు సీఆర్‌ రెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్‌ వెట్రిసెల్వి తెలిపారు. కౌంటింగ్‌ ఏర్పాట్లను ఆదివారం ఆమె పరిశీలించారు. కౌంటింగ్‌పై సిబ్బందికి సమగ్ర శిక్షణ ఇచ్చామన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి రెండు మూడు రోజుల సమయం పట్టవచ్చన్నారు. పూర్తి భద్రతా ఏర్పాట్ల మధ్య కౌంటింగ్‌ నిర్వహిస్తామన్నారు. కౌంటింగ్‌ సిబ్బందికి డ్యూటీ పాసులు, ఏజెంట్లకు ఐడీ కార్డులు జారీ చేశామన్నారు. పాస్‌ లేనిదే కౌంటింగ్‌ కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. కౌంటింగ్‌ కేంద్రంలోనికి సెల్‌ఫోన్లను నిషేధించామన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియను రిటర్నింగ్‌ అధికారి టేబుల్‌ వద్ద నిర్వహిస్తామని తెలిపారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ పి.సాల్మన్‌రాజును కలెక్టర్‌ ఆదేశించారు.

ఎవరి లెక్కలు వారివి..

అమలాపురం టౌన్‌: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాల కోసం జిల్లా ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఏలూరు జిల్లా కేంద్రంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం నిర్వహిస్తుండడంతో పట్టభద్రులు ఎవరికివారు అంచనాలు, లెక్కలు, మెజార్టీలు కడుతున్నారు. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందోననే చర్చ ప్రజల్లో సాగుతోంది. ఈ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 64,471 మంది ఓటర్లు ఉండగా 47,125 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో 73.09 శాతం మేర పోలింగ్‌ జరిగింది. పురుషులు 27,353 మంది, మహిళలు 19,771 మంది ఓట్లు వేశారు. ఎన్నికల బరిలో 35 మంది అభ్యర్థులు ఉన్నా ప్రధాన పోటీ మాత్రం కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్‌ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులు మధ్యే జరిగిందని భావిస్తున్నారు. పోటీలో తలపడ్డ కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు రెండో ప్రాధాన్య ఓట్లపై ఆశలు పెట్టుకుని ఫలితం కోసం ఆతృతతో ఎదురు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement