
రేషన్ దందా
పలమనేరు : కూటమి ప్రభుత్వ రాకతో ఇప్పటికే గంజాయి, గ్రానైట్, ఇసుక, మట్టి అక్రమ రవాణా జోరందుకుంది. ఈ నేపథ్యంలో జిల్లా నుంచి కర్ణాటకలోని బంగారుపేటకు రేషన్ బియ్యం అక్రమ రవాణా ఇప్పుడు ఊపందుకుంది. చిత్తూరు సమీపంలోని పాలసముద్రం నుంచి నిత్యం కర్ణాటకకు నాలుగు వాహనాల్లో నలబై టన్నుల బియ్యం అక్రమ రవాణా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వాహనాలు పట్టపగలే పాలసముద్రం నుంచి చిత్తూరు, పలమనేరు మీదుగా బంగారుపేటకు ఎలాంటి తనిఖీ అధికారుల భయం లేకుండా యథేచ్ఛగా తరలిపోతున్నాయి.
గతంలో బియ్యం అక్రమ రవాణాలో ఆరితేరిన అక్రమార్కులు కూటమి నేతల అండతో మళ్లీ బియ్యం రవాణాను సాగిస్తున్నట్లు తెలుస్తోంది. పాలసముద్రానికి చెందిన ఓ కీలక వ్యక్తి ఆ ప్రాంతంలోని ఏజెంట్ల ద్వారా రేషన్ బియ్యాన్ని సేకరించి రహస్య గోదాంలో నిల్వ ఉంచుతున్నట్లు తెలిసింది. కాణిపాకం ప్రాంతానికి చెందిన ఓ యువకుడు రహస్యంగా బియ్యం స్టాకు పాయింట్ పెట్టినట్లు సమాచారం. వీరి నుంచి గంగవరం మండలం నాలుగు రోడ్లు, పలమనేరు పట్టణానికి చెందిన ముగ్గురి వాహనాల్లో నిత్యం పాలసముద్రం నుంచి సరుకును కర్ణాటకకు తరలిస్తున్నారు.
టన్నుకు రూ.4 వేలు.. నెలకు రూ.42 లక్షల ఆదాయం
పాలసముద్రంలో స్మగర్లు టన్ను బియ్యం రూ.21 వేలకు కొంటున్నారు. ఇదే బియ్యం కర్ణాటకలోని బంగారుపేటకు చేరితే అక్కడ టన్ను రూ.27 వేలకు అమ్ముతున్నారు. ఇందులో రూ.2 వేలు రవాణా ఖర్చులు పోనూ నికరంగా టన్నుకు రూ.4 వేలు మిగులుతుంది. రోజుకు నాలుగు వాహనాల్లో 40 టన్నులైతే రోజుకు రూ.1.60 లక్షల లాభం దక్కుతోంది. ఈ లెక్కన నెలకు రూ.42 లక్షల ఆదాయం వస్తుండడంతో అక్రమార్కులకు ఇదో మంచి వ్యాపారంలా మారింది. భారీ లాభాలు వస్తుండడంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, స్పెషల్ పార్టీ, ఆ మార్గంలోని పోలీసులతో పాటు సంబంధం ఉన్న పలు శాఖలకు నెల నెలా మామూళ్లు అందుతుండడంతోనే వీరి వ్యాపారం సజావుగా సాగుతోందని విమర్శలున్నాయి. ఏదేమైనా దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది.
ఎటూచూసినా బియ్యం బస్తాలే....
జిల్లాలోని నగరి, గంగాధర నెల్లూరు మండలాల్లో పలుచోట్ల తమిళ బియ్యంతో పాటు, స్థానిక రేషన్ బియ్యాన్ని డీలర్ల ద్వారా స్మగర్లు కొంటున్నట్లు తెలుస్తోంది. బుధవారం సైతం నగరి మండలంలోని కేవీఆర్పేట ఎంజీఆర్నగర్ ఈశ్వరుని ఆలయం సమీపంలో చౌక దుకాణం డీలర్లు ఐదు టన్నుల దాకా బియ్యాన్ని కర్ణాటకకు తరలించేందుకు సిద్ధంగా పెట్టినట్లు స్థానికులు గుర్తించారు. దీనిపై అదే ప్రాంతానికి చెందిన స్థానికులు డీఎస్వోకు సైతం ఫిర్యాదు చేసినా స్పందనలేదని తెలిసింది. ఇదే విధంగా పాలసముద్రం, కార్వేటినగరంతో పాటు తమిళనాడుకు ఆనుకొని ఉన్న పలు మండలాల్లో భారీగా బియ్యం అక్రమ నిల్వలున్నట్లు తెలుస్తోంది.
ఊపందుకున్న బియ్యం అక్రమ రవాణా!
పాలసముద్రం నుంచి బంగార్ పేటకు తరలింపు
టన్ను రూ.27 వేలకు విక్రయాలు
రూ.లక్షలు ఆర్జిస్తున్న అక్రమార్కులు
స్మగ్లింగ్ కోసమే నాలుగు వాహనాలు
నాలుగు వాహనాలు కేవలం బియ్యం అక్రమ రవాణా కోసమే వాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ వాహనాల వివరాలను ఆయా మార్గాల్లోని కొందరికి స్మగర్లు మందుగానే ఇచ్చి ఈ వాహనాలను ఆపకుండా ఉండేలా మామూళ్లు ఇస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

రేషన్ దందా

రేషన్ దందా

రేషన్ దందా