
తమిళనాడు, ఏపీ ఉద్యాన అధికారుల చర్చలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని పండ్ల గుజ్జు పరిశ్రమల ప్రలోభాలకు రైతులు గురికాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మామిడి ధరలపై క్రిష్ణగిరి, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే సమన్వయ సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరి జిల్లా ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెరెక్టర్ మోహన్ ఆధ్వర్యంలో ఐదుగురు అధికారులతో కూడిన బృందం ఆదివారం చిత్తూరు జిల్లా ఉద్యానశాఖ కార్యాలయం చేరుకుంది. ఉద్యానశాఖాధికారి మధుసూదన్రెడ్డి, ఏడీ కోటేశ్వర్రావుతో మామిడి ధరలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. క్రిష్ణగిరి, చిత్తూరు జిల్లాలో మామిడి ధరల్లో తేడా లేకుండా చూసుకోవాలని తీర్మానించారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందుకు రెండు జిల్లాల కలెక్టర్లు ఆమోదం తెలపనున్నారు.