– నీట మునిగి ఇద్దరు చిన్నారుల మృతి
యాదమరి : ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన శుక్రవారం మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..చిత్తూరు మండలం తుమ్మిండపాల్యంకు చెందిన సదా కుమారుడు సిద్దు(11), తమిళనాడు రాష్ట్రం సామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రాజ్కుమార్ కుమారుడు అవినాష్ (13) మండల పరిధి కీనాటంపల్లి పంచాయతీ కోయూరులోని తన అమ్మమ్మ ఇంటికి వేసవి సెలవులకు వచ్చారు. శుక్రవారం గ్రామానికి సమీపంలో ఉన్న కొత్తచెరువు కుంట వద్ద సరదాగా ఈత కొట్టడానికి వెళ్లారు.
ముందుగా కుంటలోకి దిగి ఆడుకుంటున్న చిన్నారి సిద్దు మునిగిపోవడంతో ఒడ్డున ఉన్న అవినాష్ సిద్దుని కాపాడే యత్నంలో బురదలో కూరుకుపోయి మత్యువాత పడ్డారు. ఇది గమనించిన అటువైపుగా వెళ్తున్న కొందరు స్థానికులు కాపాడే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వేసవి సెలవులకు అమ్మమ్మ ఇంటికి వస్తే ఇలా మృత్యుఒడికి చేరుకోవడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
ఒక రోజు హెడ్మాస్టర్లు
చిత్తూరు కలెక్టరేట్ : సర్వీస్లో చేరినప్పటి నుంచి హెడ్మాస్టర్ కావలన్నది ప్రతి టీచర్ కల. అలాంటి కల ఎన్నో ఏళ్ల తర్వాత ఇద్దరు టీచర్లకు నెరవేరింది. కానీ ఆ కల ఒక రోజుకు మాత్రమే మిగిలింది. చిత్తూరు జిల్లాలోని కుప్పం మండలం ఓల్డ్ పేట్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్న శ్రీదేవి, తిరుపతి జిల్లాలోని తిరుపతి అర్బన్ మండలం జెడ్పీ పద్మావతిపురం హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా విధులు నిర్వహిస్తున్న తిమ్మసముద్రం సుధారాణి ఒక రోజు హైస్కూల్ హెచ్ఎంలుగా విధులు నిర్వహించనున్నారు. ఈ ఇద్దరు టీచర్లు ఈ నెల 31 వ తేదీన ఉద్యోగ విరమణ పొందుతున్నారు. వీరికి ఈ నెల 29 న హైస్కూల్ హెచ్ఎం గా ఉద్యోగోన్నతి లభించింది.