
సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలి
చర్ల: ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో పనిచేసే సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు సమన్వయంతో పనిచేయాలని, గర్భిణులు ప్రభుత్వాస్పత్రుల్లోనే సాధారణ ప్రసవాలు పొందేలా చూడాలని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ సూచించారు. శుక్రవారం ఆశా డే సందర్భంగా మండలంలోని కొయ్యూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వాతావరణ మార్పుల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, గ్రామాలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. గ్రామాల్లో గిరిజనులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. రోడ్లపై, డ్రెయినేజీల్లో చెత్తాచెదారం, మురుగు పేరుకుపోకుండా వివరించాలన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవాలని, డాక్టర్లు, సిబ్బంది స్థానికంగా ఉండాలని ఆదేశించారు. అనంతరం వైద్యశాలలోని రికార్డులను పరిశీలించారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ చైతన్య, డాక్టర్ హారిక, డాక్టర్ స్పందన, డాక్టర్ సచిన్, సూపర్వైజర్లు ప్రసాద్, దుర్గ, ఆశా వర్కర్లు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్