
పెండింగ్ వేతనాలు చెల్లించండి..
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా వ్యాపితంగా పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ పథకం కూలీల వేతనాలు వెంటనే చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించి ధర్నా చేశారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బడ్జెట్లో నిధులు తగ్గించడం వల్ల పనిదినాలు తగ్గిపోయాయని, వేతనాల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని విమర్శించారు. జిల్లాలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి పని ప్రదేశాలలో సంఘం కార్యకర్తలు విస్తృత పర్యటనలు చేశారని తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీల సమస్యలు తెలిసినట్లు చెప్పారు. తాగునీరు, టెంట్, మెడికల్ కిట్లు, రవాణా చార్జీలు లేకుండా ప్రమాదకర పరిస్థితులలో ఉపాధి కూలీలు పనులు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం వెంటనే ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని, మౌలిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, శెట్టి వినోద మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతంలో అడవుల్లో, చెరువులలో పనులు చేస్తున్న కూలీల గురించి పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. పట్టాలిచ్చిన పోడు భూముల్లో పనులను అడ్డుకుంటున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. గ్రామీణాభివృద్ధి అడ్మినిస్ట్రేటివ్ అధికారి ధర్నా వద్దకు వచ్చి వినతిపత్రం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రేపాకుల శ్రీనివాస్, ముదిగొండ రాంబాబు, బత్తుల వెంకటేశ్వర్లు, నిమ్ల వెంకన్న, మర్మం చంద్రయ్య, అలేటి కిరణ్, ఈసం నరసింహారావు, గండమాల భాస్కర్, నాగరత్నమ్మ, పిట్టల నాగమణి పాల్గొన్నారు.