
ఇక్కడ ఇలా..
అక్కడ అలా..
బోనకల్ లో శరవేగంగా..
గతేడాది అక్టోబర్లో బోనకల్ లో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లోనూ త్వరితగతిన స్థల సేకరణ, టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇప్పుడు పనులు మొదలుపెడితే కనీసం వచ్చే విద్యాసంవత్సరం నాటికై నా యంగ్ ఇండియా ఫలాలు విద్యార్థులకు అందే అవకాశం ఉందని అంటున్నారు.
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘రేవంత్రెడ్డి పేరు చెబితే యంగ్ ఇండియా స్కూళ్లు గుర్తొస్తాయి’ అని సీఎం ఇటీవల గర్వంగా ప్రకటించుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలకెత్తుకున్న యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం జిల్లాలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మారింది.
అంతా ఒకేచోట..
తెలంగాణ వచ్చిన తర్వాత కేజీ నుంచి పీజీ విద్యలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వేర్వేరుగా గురుకుల పాఠశాలలు నియోజకర్గానికి ఒకటి చొప్పున ప్రారంభించారు. ఈ గురుకులాల్లో చాలా వరకు ఇప్పటికీ అద్దె భవనాల్లో అరకొర సౌకర్యాల మధ్యనే కొనసాగుతున్నాయి. అయితే సామాజికంగా అందరినీ ఒకే చోట కలుపుతూ సమానత్వం తెచ్చే లక్ష్యంతో సకల హంగులతో అన్ని గురుకులాలను ఒకే చోట నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి యంగ్ ఇండియా స్కూళ్లుగా పేరు పెట్టింది. గతేడాది అక్టోబర్లో తొలి విడతగా 18 యంగ్ ఇండియా స్కూళ్లకు శంకుస్థాపన చేయగా ఇందులో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు, మధిర నియోజకర్గాలకు చోటు దక్కింది.
జిల్లాకు ఐదు మంజూరు
మలి విడతలో భాగంగా ఈ ఏడాది మార్చి 8న ప్రభుత్వం 55 నియోజకవర్గాలకు యంగ్ ఇండియా స్కూళ్లు మంజూరు చేసింది. ఇందులో ఇల్లెందు, పినపాక, కొత్తగూడెం నియోజకర్గాలకు స్థానం దక్కింది. కాగా ఇటీవల అశ్వారావుపేట, భద్రాచలం నియోజకర్గాలకు కూడా మంజూరు చేస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణానికి కనీసం 20 నుంచి 25 ఎకరాలు అవసరం పడుతుంది. ఒక్కో స్కూల్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.200 కోట్లు ఖర్చు చేయనుంది. మొత్తంగా ఐదు స్కూళ్లకు రూ.1000 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రస్తుత మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా ఈ స్కూళ్లు నడవనున్నాయి.
స్కూళ్లకు స్థల సమస్య..
జిల్లాకు మూడు యంగ్ ఇండియా స్కూళ్లు మంజూరై దాదాపు మూడు నెలలు కావొస్తున్న ఇప్పటివరకు మణుగూరు, కొత్తగూడెం మినహా మరెక్కడా స్థల సేకరణ పూర్తి కాలేదు. ఇల్లెందు నియోజకర్గానికి మంజూరైన యంగ్ ఇండియా స్కూల్ కోసం బైపాస్ రోడ్డులో 25 ఎకరాల స్థలం గుర్తించారు. అయితే ఇది వివాదంలో ఉండటంతో స్థల సేకరణ అంశం ఎంతకీ తేలడం లేదు. మరో ప్రత్యామ్నాయ స్థలం చూసేందుకు స్థానిక రాజకీయ నాయకులు సుముఖంగా లేరు. దీంతో ఈ విషయంలో పీటముడి బిగుసుకుంది. కొత్తగూడెంలో రెండేళ్ల క్రితం సింగరేణి సంస్థ భారీ ఎత్తున భూములను రెవెన్యూ శాఖకు బదిలీ చేసింది. పట్టణంలోని గోధుమ వాగు సమీపంలో ఇలా కేటాయించిన భూములను యంగ్ ఇండియా స్కూల్కు కేటాయించినట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అయితే ఇక్కడ టెండర్ల ప్రక్రియ ప్రారంభం కాలేదు. మణుగూరులో పట్టణ పరిధిలో 20 ఎకరాలను రవాణా శాఖ కేటాయించినా.. ఆ తర్వాత ఈ అంశంపై స్తబ్ధత నెలకొంది. ఇక అశ్వారావుపేట, భద్రాచలంలో ఇప్పటికే స్థల సేకరణ సమస్య ఎక్కువగా ఉంది. దీంతో యంగ్ ఇండియా స్కూళ్లు ఎక్కడ నిర్మించాలనే అంశం ఎవరికీ అంతుపట్టడం లేదు.
అడుగు ముందుకు పడని ‘యంగ్ ఇండియా’
ఖమ్మం జిల్లాలో శరవేగంగా సాగుతున్న పనులు
మంజూరుతోనే సరిపెట్టుకున్న భద్రాద్రి జిల్లా..
పలుచోట్ల కొలిక్కి రాని స్థల సేకరణ

ఇక్కడ ఇలా..