సమగ్రాభివృద్ధి దిశగా.. | - | Sakshi
Sakshi News home page

సమగ్రాభివృద్ధి దిశగా..

Jun 3 2025 12:25 AM | Updated on Jun 3 2025 12:25 AM

సమగ్ర

సమగ్రాభివృద్ధి దిశగా..

సీతారామ, సీతమ్మ సాగర్‌తో భూములు సస్యశ్యామలం
● రాష్ట్రంలోనే మొదటి ఎర్త్‌సైన్స్‌ యూనివర్సిటీ జిల్లాలో ఏర్పాటు ● తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో మంత్రి తుమ్మల

జాతీయ పతాకానికి వందనం సమర్పిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కూనంనేని, కలెక్టర్‌ పాటిల్‌, ఎస్పీ రోహిత్‌రాజు (ఇన్‌సెట్‌) మాట్లాడుతున్న మంత్రి తుమ్మల

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కొత్తగూడెం ప్రగతిమైదానంలో సోమవారం నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మొదట అమరవీరుల స్థూపం వద్ద ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఎస్పీ రోహిత్‌రాజ్‌తో కలిసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. సీతారామ ఎత్తిపోతల పథకం ప్రధాన కాల్వ పనులు పూర్తయ్యాయని, మూడు పంపుహౌస్‌లు ప్రారంభించడంతో ఏన్కూరు లింక్‌ కెనాల్‌ ద్వారా నీరు విడుదల చేశామని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో 1,57,574 ఎకరాల నూతన ఆయకట్టుకు నీరందడమే కాక, చిన్న నీటి తరహా చెరువుల కింద ఉన్న 42,935 ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని తెలిపారు. సీతమ్మసాగర్‌ బహుళార్థ సాధక ప్రాజెక్టు కోసం 3,123 ఎకరాల భూసేకరణ పూర్తయిందని, తాలిపేరు, కిన్నెరసాని, పెదవాగు ప్రాజెక్టుల ద్వారా 37,060 ఎకరాలకు, చిన్నతరహా నీటి పారుదల వనరులతో 1,29,058 ఎకరాలకు నీటి వసతి కల్పిస్తున్నట్లు వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.415 కోట్లతో 108 రహదారుల పనులు చేపట్టగా, ఇప్పటికే 75 పూర్తయ్యాయని, మరో 33 పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రోడ్లు, 18 బ్రిడ్జీల నిర్మాణానికి రూ.195 కోట్లు మంజూయ్యాయని చెప్పారు.

నిరంతర విద్యుత్‌..

జిల్లా ప్రజలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ అందించడమే లక్ష్యంగా రూ.38.50 కోట్లతో 33/11 కేవీ సబ్‌స్టేషన్లు 13, రూ. 3.67 కోట్లతో ఐదు 33 కేవీ సబ్‌స్టేషన్లు నిర్మించామని తెలిపారు. రూ. 21.50 కోట్లతో 33 కేవీ ఇంటర్‌లింక్‌ లైన్ల పనులు చేపట్టగా నాలుగు పూర్తయ్యాయని, మిగిలినవి పురోగతిలో ఉన్నాయని చెప్పారు.

ఎర్త్‌సైన్స్‌ యూనివర్సిటీకి ఆమోదం..

జిల్లా కీర్తిప్రతిష్టలు మార్మోగేలా రాష్ట్రంలోనే మొదటి ఎర్త్‌సైన్స్‌ యూనివర్సిటీని కొత్తగూడెంలో స్థాపిస్తున్నామని మంత్రి తుమ్మల అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు భూభారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చామని చెప్పారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మంగళవారం నుంచి ఈనెల 20 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. మారుమూల గ్రామాలు, నిరుపేదలు ఎక్కువగా ఉన్న ఈ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, మత్తు పదార్థాల నియంత్రణకు కృషి చేస్తున్న పోలీస్‌ యంత్రాంగాన్ని అభినందించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విజయవంతం చేస్తున్న అధికారులు, ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ‘నాణ్యమైన విత్తనం – రైతన్నకు నేస్తం’ కార్యక్రమంలో భాగంగా రైతులకు నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్‌, విద్యాచందన, కొత్తగూడెం ఆర్డీఓ మధు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లో వేడుకలు..

తెలంగాణ ఆవిర్భావ వేడుకలను కలెక్టరేట్‌లో సోమవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ జాతీయ పతాకాన్ని అవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

సమగ్రాభివృద్ధి దిశగా..1
1/2

సమగ్రాభివృద్ధి దిశగా..

సమగ్రాభివృద్ధి దిశగా..2
2/2

సమగ్రాభివృద్ధి దిశగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement