
రామాలయంలో సుదర్శన హోమం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ యాగశాలలో సోమవారం చిత్తా నక్షత్రం సందర్భంగా సుదర్శన హోమం నిర్వహించారు. కాగా, మూలమూర్తులు ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు.
డయాగ్నస్టిక్
సెంటర్లలో తనిఖీ
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెంలోని ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లను డీఎంహెచ్ఓ భాస్కర్నాయక్ సోమవారం తనిఖీ చేశారు. ఈ క్రమంలో విమ్టా ల్యాబ్స్ లిమిటెడ్కు తగిన అనుమతులు లేవని, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద సూచించిన మార్గదర్శకాలు పాటించడం లేదని తేలడంతో సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టపరమైన, భద్రతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. ఆరోగ్య సంబంధిత సేవలు, నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
భద్రాచలం: గిరిజన దర్బార్లో వినతులు ఇచ్చే వారి సమస్యలు సత్వరమే పరిష్కరించేలా అధికారులు కృషి చేయాలని ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్ అన్నారు. సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో ఆయన వివిధ గ్రామాల నుంచి వచ్చిన గిరిజనుల దరఖాస్తులు స్వీకరించి సంబంధిత అధికారులకు అందచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అర్హతల మేరకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పథకాలు సద్వినియోగం అయ్యేలా పర్యవేక్షించాలని సూచించారు. గిరి జల వికాసం ద్వారా బోర్లు, నూతన మత్స్య సొసైటీల ఏర్పాటు, వితంతు మహిళల పెన్షన్ తదితర సమస్యలపై ఎక్కువ మంది వినతిపత్రాలు అందించారు. కార్యక్రమంలో డీడీ మణెమ్మ, గురుకుల ఆర్సీఓ అరుణకుమారి, ఎస్డీసీ రవీంద్రనాథ్, హెచ్ఈఓ లింగానాయక్, జేడీఎం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కాకతీయుల
కాలం నాటి శిలాశాసనం
నేలకొండపల్లి: మండలంలోని అనాసాగారంలో కాకతీయుల నాటి శిలాశాసనాన్ని గుర్తించారు. గ్రామ పాత బొడ్రాయి సెంటర్లో రావిచెట్టు వద్ద ఈ శాసనం వెలుగుచూసింది. నాలుగు అడుగుల పొడవు, అడుగు మందంతో ఉన్న నల్లరాతి బండపై ఓ వైపున 19 పంక్తులతో తెలుగు లిపిలో రాసి ఉన్న శాసనాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కోకన్వీనర్ కట్టా శ్రీనివాస్ నేతృత్వాన సోమవారం గుర్తించారు. శాసనంపై శివలింగం, దానికి రెండువైపులా సూర్యచంద్రుల చిహ్నాలు ఉన్నాయి. మహామండలీశుడు కాటేయ(రుద్రసేనాని కొడుకు) రాజ్యం ఏలుతున్నప్పుడు గోవిందమాంబ, దేవశెట్టి కొమ్మోజు తవ్వించిన రుద్రసముద్రానికి ఎకరంన్నర భూదానం చేసినట్లు ఈ శాసనం తెలుపుతోందని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బృందం కన్వీనర్ హరగోపాల్, గ్రామ పెద్దలు వున్నం వెంకయ్య, పసుమర్తి శ్రీనివాస్, తిరుమల్, షేక్ రహీముతుల్లా తదితరులు పాల్గొన్నారు.

రామాలయంలో సుదర్శన హోమం

రామాలయంలో సుదర్శన హోమం