
లక్ష్యానికి దూరంగా..
జిల్లాలో భారీగా తగ్గిన తునికాకు సేకరణ
● నిర్దేశిత లక్ష్యంలో 40.77 శాతమే ● టెండర్లలో జాప్యం, అకాల వర్షాల ప్రభావం
పాల్వంచరూరల్: ఈసారీ తునికాకు సేకరణ లక్ష్యం నెరవేరలేదు. గతేడాది కంటే కూడా సేకరణ తగ్గింది. గడిచిన సంవత్సరం లక్ష్యంలో 41.7 శాతం సేకరిస్తే ప్రస్తుత సంవత్సరం 40.77 శాతం మాత్రమే సేకరించారు. మే నెల రెండో వారం నుంచి సేకరణ ప్రారంభంకాగా కేవలం పక్షం రోజులే గిరిజనులు తునికాకు సేకరించారు. అప్పటి నుంచి అకాల వర్షాలు రావడం, కొందరు ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లడంతో తునికాకు సేకరణ లక్ష్యం నెరవేరలేదని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలోని ఆరు డివిజన్లలో ఈ ఏడాది సేకరణ లక్ష్యం 35,100 స్టాండర్డ్ బ్యాగులుగా నిర్దేశించగా, 14,313 స్టాండర్డు బ్యాగులు మాత్రమే సేకరించారు. మే 31 వరకు సేకరణ జరగాల్సి ఉండగా, ఐదు రోజుల ముందే సేకరణ నిలిచిపోయింది. కాగా గతేడాది 35,300 స్టాండర్డ్ బ్యాగుల లక్ష్యానికి 13,478.66 స్టాండర్డు బ్యాగుల తునికాకు సేకరించారు.
కారణాలు ఇవే..
అకాల వర్షాలు, టెండర్ల ప్రక్రియలో జాప్యంతో కూలీలు ఆకు సేకరణపై ఆసక్తి చూపలేదు. వర్షాల కారణంగా ఆకు చీడ పట్టి పనికిరాకుండా పోయింది. దీంతో నాణ్యమైన ఆకు కూడా దొరకలేదు. ఏటా ఏప్రిల్ నెలాఖరులో తునికాకు సేకరణ ప్రారంభిస్తారు. అప్పటి నుంచి మే వరకు సుమారు 30 నుంచి 35 రోజుల వరకు ఆకు సేకరిస్తారు. కానీ గత వేసవిలో మాత్రం టెండర్లలో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో మే నెల రెండో వారంలో సేకరణ ప్రారంభమైంది. కేవలం పది, పదిహేనురోజులు మాత్రమే ఆకు సేకరణ జరిగింది. దీనికితోడు అకాల వర్షాలు కూడా ప్రభావం చూపాయి. కాగా గతంలో 50 ఆకుల కట్టకు రూ.3 చొప్పున చెల్లిస్తే ఈసారి రూ.3.30 చొప్పున కూలీలకు చెల్లించారు.
డివిజన్ల వారీగా తునికాకు సేకరణ వివరాలు
డివిజన్ లక్ష్యం సేకరణ శాతం
కిన్నెరసాని 3,200 1,117 35
అభయారణ్యం
భద్రాచలం 9,700 4,338 43
ఇల్లెందు 10,600 2,550 20
మణుగూరు 5,400 3,952 73
పాల్వంచ 2,300 356 15
కొత్తగూడెం 3,900 2,000 20
మొత్తం 35,100 14,313 40.77

లక్ష్యానికి దూరంగా..