మసిబారుతున్న బతుకులు.. | - | Sakshi
Sakshi News home page

మసిబారుతున్న బతుకులు..

May 31 2025 12:22 AM | Updated on May 31 2025 12:22 AM

మసిబా

మసిబారుతున్న బతుకులు..

భద్రాచలంఅర్బన్‌/కరకగూడెం: పొగాకు అన్ని రకాలుగా ప్రమాదకరమేనని, పొగాకు ఉత్పతులన్నీ నోరు, గొంతు, అన్న వాహిక, కడుపు, ఊపిరితిత్తులు, మూత్రవ్యవస్థపై ప్రభావాన్ని చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. పొగాకులో పాలిసైక్లిన్‌ ఆటోమేటిక్‌ హైడ్రోకార్బైడ్స్‌, నైట్రోజీన్‌ అమైన్స్‌తోపాటు కాడ్మియం, క్రోమియం, ఇథిలిన్‌ ఆకై ్సడ్‌ వంటి దాదాపు 72 రకాల కేన్సర్‌ కారకాలు ఉంటాయంటున్నారు.

బలవుతున్న యువత..

జిల్లాలో 18 నుంచి 24 ఏళ్లలోపు వయసున్న యువత పొగాకు ఉత్పత్తుల వినియోగానికి బానిసలవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. దీనికి ప్రధాన కారణం చెడు సావాసాలు. ఏటా కొత్తగా 8 శాతం మంది సిగరెట్‌కు అలవాటు పడుతున్నట్లు అంచనా. పొగాకు ఉత్పత్తుల వినియోగంతో ప్రతి నెలా రూ.కోట్ల ఆదాయం వస్తున్నట్లు సమాచారం. దీనిని బట్టి చూస్తే జిల్లాలో పొగాకు వినియోగం ఏ మేరకు ఉందో తెలుస్తోంది. పొగతాగే వారితోపాటు పీల్చే వారు సైతం అనారోగ్యానికి గురవుతున్నారు. పొగ తాగే భర్తల కారణంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీ్త్రలలో పునరుత్పత్తి శక్తి తగ్గడం, అబార్షన్లు జరగడం, పిండంలో లోపాలు వంటి సమస్యలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది.

జిల్లాలో ఇలా..

జిల్లాలో సుమారు 3 లక్షల మందికి పైగా పొగతాగడం, లేదా పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నట్లు అంచనా. వీరంతా వివిధ రకాల గుండె, ఊపిరితిత్తుల జబ్బులకు గురవుతున్నారు. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 714 మంది కేన్సర్‌ బాధితులున్నారు. అనధికారికంగా ఇంకా ఎక్కువగానే ఉన్నట్లు సమాచారం. ఎక్కువ మంది పొగ తాగడం, పొగాకు ఉత్పత్తులను వినియోగించడమే అనారోగ్యానికి కారణంగా తెలిసింది. పొగతాగడం వల్ల గొంతు, ఊపిరితిత్తులు, కడుపు, మూత్రపిండాల కేన్సర్‌ సోకే అవకాశం ఉంది. గుండె రక్తనాళాలు బిరుసుగా మారి హార్ట్‌ఎటాక్‌ రావడం, నాడీ సంబంధ వ్యాధులు, పక్షవాతం, మధుమేహం, రక్తపోటు, మానసిక రుగ్మతలకు కారణమ్యే అవకాశాలున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

భద్రాచలంలో డీఅడిక్షన్‌ సెంటర్‌

భద్రాచలం పట్టణంలో శాంతినగర్‌కాలనీలో దక్షత సొసైటీ ఆధ్వర్యంలో డీ అడిక్షన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. పొగాకుతోపాటు ఇతర వ్యసనాలకు బానిసలైన వారికి కౌన్సెలింగ్‌, బిహేవియర్‌ థెరపి చేస్తూ, మందులు అందజేస్తున్నారు. ఈ సెంటర్‌లో వైద్యుడు, కౌన్సిలర్లు, సూపర్‌వైజర్లు, ఫీల్డ్‌ వర్కర్లు 22 మంది పనిచేస్తున్నట్లు ఈ కేంద్రం అధ్యక్షుడు గుత్తా బాబు, ఉపాధ్యక్షురాలు సరోజనమ్మ తెలిపారు. కలెక్టర్‌ జితేశ్‌ వి.పాటిల్‌, ఎస్పీ రోహిత్‌రాజు ప్రచార కరపత్రాలు, స్టిక్కర్లను ఇటీవల ఆవిష్కరించారు.

చుట్ట, బీడీ, సిగరెట్‌తో ఎన్నో అనర్థాలు

గుండెపోటు, పక్షవాతం, ఊపిరితిత్తుల వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు

నేడు ప్రపంచ పొగాకు

వ్యతిరేక దినం

పొగతాగడం వల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయని, అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చుట్ట, బీడీ, సిగరెట్‌ ఏదైనా ఆరోగ్యానికి హానికరమని తెలిసినా కూడా చాలామంది మారడం లేదు. ఆ అలవాటును వదిలేయడం లేదు. ఈ విషయాలను పరిశీలించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా మే 31వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరపాలని తీర్మానించింది. 1988 నుంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆందులో భాగంగా జిల్లాలో వైద్యశాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది సదస్సులు, ర్యాలీలు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు.

ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం..

పొగాకు ఏ రూపంలో ఉన్నా అది ప్రాణాంతకమే. సిగరెట్లు, బీడీలు, గుట్కా, నమిలే పొగాకు ఇవన్నీ తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. కేవలం వినియోగదారుల ఆరోగ్యానికే కాదు పరోక్ష ధూమపానం ద్వారా కుటుంబ సభ్యులు, పిల్లల ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆరోగ్యకరమైన భవిష్యత్‌ కోసం పొగాకు వ్యసనం నుంచి బయటపడాలి.

– భాస్కర్‌నాయక్‌, డీఎంహెచ్‌ఓ

మందులు పనిచేయవు..

ధూమపానం చేసేవారిలో మందులు పనిచేయని పరిస్థితి ఉంటుంది. మధుమేహం, రక్తపోటు ఉన్న వారు ధూమపానం చేస్తే మందులు వాడినా వ్యాధులు అదుపులో ఉండవు. ధూమపానం చేసేవారిలో మధుమేహం కారణంగా వచ్చే దుష్ఫలితాలు అధికంగా ఉంటాయి. కంటి రెటీనా సమస్యతో పాటు, సైలెంట్‌ హార్ట్‌ ఎటాక్‌, పక్షవాతం, కిడ్నీల సమస్యలు తలెత్తుతాయి.

– డాక్టర్‌ సీతారామరాజు, మధుమేహ నిపుణుడు

మసిబారుతున్న బతుకులు.. 1
1/3

మసిబారుతున్న బతుకులు..

మసిబారుతున్న బతుకులు.. 2
2/3

మసిబారుతున్న బతుకులు..

మసిబారుతున్న బతుకులు.. 3
3/3

మసిబారుతున్న బతుకులు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement