ప్రత్యేకంగా పర్యాటక అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేకంగా పర్యాటక అభివృద్ధి

May 31 2025 12:22 AM | Updated on May 31 2025 12:22 AM

ప్రత్యేకంగా పర్యాటక అభివృద్ధి

ప్రత్యేకంగా పర్యాటక అభివృద్ధి

● ఎకో టూరిజంలో కనకగిరి గుట్టలకు స్థానం ● భద్రాచలం, కిన్నెరసాని, పులిగుండాల అనుసంధానానికి ప్రణాళిక ● రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

పెనుబల్లి: జిల్లాలో పర్యాటక అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నందున ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తద్వారా పర్యాటక రంగానికే కాక స్థానికులకు ఆదాయం పెరగనుందని చెప్పారు. పెనుబల్లి మండలం పులిగుండాల ప్రాజెక్టు వద్ద అటవీశాఖ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న ఎకో టూరిజం ప్రాజెక్టును కలెక్టర్‌ ముజ్మమిల్‌ఖాన్‌, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్‌ మట్టా రాగమయితో పాటు అటవీ, పోలీసు అధికారులతో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. బ్రహ్మళకుంట అటవీప్రాంత సమీపాన పులిగుండాల సాగునీటి ప్రాజెక్టు వద్ద రూ.20 లక్షలతో చేపట్టిన టూరిజం పనులను పరిశీలించాక, టూరిస్టుల కోసం ఏర్పాటు చేసిన బస్సును ప్రారంభించారు.

రాష్ట్రంలో మూడు ప్రాజెక్టులు

పులిగుండాల వద్ద సుమారు 30 వేల హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించిన అటవీ ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎకోటూరిజం ప్రాజెక్టుగా గుర్తించి అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తోందని మంత్రి తుమ్మల వెల్లడించారు. రాష్ట్రంలోని వికారాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలతో పాటు ఖమ్మం జిల్లాలోని పులిగుండాల ప్రాజెక్టు వరకు కనకగిరి గుట్టల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. వీటన్నింట్లో పులిగుండాల ప్రాజెక్టును కీలకంగా గుర్తించి అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. సుమారు రూ.7 కోట్ల నిధులతో ఎకో టూరిజం పనులకు శ్రీకారం చుట్టామని వివరించారు. కాగా, పెనుబల్లి మండలంలో ఇటీవల పోడు పేరుతో అడవులు నరుకుతున్నట్లు తెలిసిందని.. ఇలాంటి వారిపైనే కాక నిర్లక్ష్యంగా వహించే సిబ్బందిపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పులిగుండాల ప్రాజెక్టు పరిధిలో చిరుతపులి, ఎలుగుబంటి, తోడేలు వంటివే కాక 120 రకాల పక్షి జాతులు సంచరిస్తున్నందున పర్యాటకంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. పులిగుండాల ప్రాజెక్టు నుండి అటవీ మార్గం ద్వారా భద్రాచలం వరకు వెళ్లేలా రహదారులను అభివృద్ధి చేయడంతో పాటు భద్రాచలం, కిన్నెరసాని, పులిగుండాల ప్రాజెక్టులను అనుసంధానం చేసేలా ప్రణాళికలు ఉన్నాయని వెల్లడించారు. ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ అటవీ, పర్యాటక శాఖల మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు సహకారంతో పులిగుండాల ప్రాజెక్టు అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖాధికారి సిద్ధార్థ్‌ విక్రమ్‌సింగ్‌, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ రాయల నాగేశ్వరరావు కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, నాయకులు మట్టా దయానంద్‌తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement