
రైలు ఢీకొని వ్యక్తి మృతి
కొత్తగూడెంఅర్బన్: సింగరేణి ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్ఐ జె.సురేశ్ కథనం ప్రకారం.. తడకలపూడి, చీమలపహాడ్ రైల్వేస్టేషన్ మధ్యన దాదాపు 35 నుంచి 40 ఏళ్ల వయసు గల వ్యక్తిని సింగరేణి రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి ఒంటిపై తెలుపు రంగు ఫుల్షర్టు, బ్రౌన్ కలర్ పాయింట్ ఉన్నాయి. రైల్వేట్రాక్పై చెత్త ఏరుకునే బస్తాలు, మృతుడు చూడడానికి యాచకుడి లాగా ఉన్నారని స్థానికులు తెలిపారు. తడికలపూడి రైల్వేస్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని జిల్లా ప్రధాన ఆస్పత్రి మార్చురిలో భద్రపరిచినట్లు వివరించారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 99890 25481, 87126 58600, 970137 1472 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
కేసు నమోదు
ములకలపల్లి: సోదరుడిపై దాడి చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ రాజశేఖర్ కథనం ప్రకారం.. మండలంలోని మూకమామిడికి చెందిన హుస్సేన్.. తన సోదరుడు రజాక్కు ఏడేళ్ల కిందట రూ.60 వేలు ఇచ్చాడు. రజాక్ ప్రస్తుతం మిర్యాలగూడలో ఉంటున్నాడు. ఈ నెల 28న తిరిగి మూకమామిడికి రాగా, హుస్సేన్, అతని భార్య నస్రీన్ తీసుకున్న నగదు ఇవ్వాలని అడిగారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రజాక్.. హుస్సేన్, నస్రీన్లపై దాడి చేశాడు. నస్రీన్ శుక్రవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
పాల్వంచ: తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. స్థానికుల కథనం మేరకు.. వనమాకాలనీలో మూగిది గణపతి ఐదు రోజుల కిందట కుటుంబ సభ్యులతో కలిసి ఊరెళ్లాడు. ఇంటికి శుక్రవారం వచ్చి చూడగా.. ఇంటి కిటికీ ఐరన్ రాడ్లను కోసి, బీరువా తెరిచి, అందులోని 15 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండి, రూ.50 వేల నగదు చోరీకి గురైనట్లు తేలింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.