
సమ్మెకు సన్నద్ధం!
● ఈ నెల 7 నుంచి సమ్మె చేపట్టనున్న ఆర్టీసీ కార్మికులు ● ఖమ్మం రీజియన్ పరిధిలో 2,012 మంది సిబ్బంది
చుంచుపల్లి: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో మరోసారి సమ్మె సైరన్ మోగనుంది. ఈ నెల 7 నుంచి సమ్మె చేపట్టనున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ గత నెల 7న హైదరాబాద్ లేబర్ కమిషన్ కార్యాలయంలో ప్రకటించింది. 2019లో ఆర్టీసీ కార్మికులు 54 రోజులపాటు సమ్మె చేపట్టారు. ఆ సమయంలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేశారు. కానీ విలీన ప్రక్రియ చేపట్టలేదు. కార్మిక సమస్యలు పరిష్కరిస్తామని, పీఆర్సీ బకాయిలు చెల్లిస్తామని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా తమ సమస్యలు పట్టించుకోవడం లేదని ఆర్టీసీ కార్మికులు ఆరోపిస్తున్నారు. దీంతో సమస్యల పరిష్కారానికి కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి సమ్మెకు శంఖారావం పూరించాయి. ఖమ్మం రీజియన్ పరిధిలోని ఖమ్మం, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, ఇల్లెందు ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. ఈ ఏడు డిపోల పరిధిలో 556 బస్సు సర్వీసులు ఉండగా, 2,012 మంది వరకు ఉద్యోగులు, కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా పెండింగ్లో ఉన్న వేతన సవరణ బకాయిల చెల్లింపుల వంటి 21 డిమాండ్లను పరిష్కరించుకునేందుకు ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టబోతున్నారు.
ప్రధానమైన డిమాండ్లు ఇవే..
● ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి. ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి.
● 2017 వేతన సవరణ బకాయిలు చెల్లించాలి. కొత్త అలవెన్స్లు అమలు చేయాలి.
● 2021, 2025 వేతన సవరణలు అమలు జరపాలి. ఉద్యోగ భద్రత కల్పించి, సిబ్బందిపై పనిభారం తగ్గించాలి. ఎంటీడబ్ల్యూ యాక్టును అమలు చేయాలి.
● ఆర్టీసీ అభివృద్ధికి ఏటా బడ్జెట్లో 3 శాతం నిధులను కేటాయించాలి. సంస్థ అప్పులను టేకోవర్ చేయాలి.
● బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ కారణంగా నిరపరాధులైన డ్రైవర్లను శిక్షించొద్దు. వారిని వైద్య పరీక్షలకు పంపాలి. మహాలక్ష్మి పథకం అమలులో జరిగే తప్పిదాలకు సిబ్బందిని అక్రమంగా శిక్షించొద్దు. జీరో టికెట్ బదులు స్మార్ట్ కార్డులు ప్రవేశ పెట్టాలి.
● ఎలక్ట్రిక్ బస్సులను కేంద్రం ప్రభుత్వం పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొని ఆర్టీసీకి ఇవ్వాలి. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి. అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలి.
● కారుణ్య నియామకాలు రెగ్యులర్ ప్రాతిపదికన చేపట్టాలి. ప్రస్తుతం కన్సాలిడేటెడ్ పే కింద పని చేస్తున్న వారందరినీ రెగ్యులరైజ్ చేయాలి.
● అద్దె బస్సులు, ఎలక్ట్రిక్ బస్సుల డ్రైవర్లను, ఇతర సిబ్బందిని, అద్దె బస్సులను ఆర్టీసీలోకి తీసుకోవాలి.
● 2019 సమ్మె కాలంలో ఉద్యోగులపై నమోదు చేసిన పోలీసు కేసులను ఎత్తి వేయాలి. పీఎఫ్, సీసీఎస్ నుంచి యాజమాన్యం వాడుకున్న డబ్బులను వడ్డీతో సహా చెల్లించాలి.
● అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కన్సల్టెన్సీల పేరు మీద పని చేస్తున్న అధికారులను, సూపర్ వైజర్లను తొలగించి వారి స్థానాలను ప్రమోషన్లు ద్వారా భర్తీ చేయాలి.
● గ్యారేజ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. వర్క్షాపులను మెరుగు పరచాలి. మహిళా కండక్టర్లతో పాటు మహిళ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. వారికి రాత్రి 8 గంటలలోపు విధులు ముగించేలా చూడాలి.
● ఆర్టీసీలో రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు కొనాలి. స్క్రాప్ బస్సులను రద్దు చేయాలి. మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలి.
ఖాళీలను భర్తీ చేయడంలేదు
దశాబ్ద కాలంగా ఆర్టీసీలో ఖాళీలను భర్తీ చేయడంలేదు. 8 గంటల డ్యూటీని 16 గంటల వరకు పెంచి కార్మికులను పని ఒత్తిడికి గురి చేస్తున్నారు. దీనివల్ల అనారోగ్యం బారిన పడుతున్నాం. ప్రధాన డిమాండ్ల సాధనకు సమ్మె చేపడుతున్నాం.
–జి.రమేష్ బాబు,డ్రైవర్
సమస్యల పరిష్కారానికే..
కార్మికులకు రావాల్సిన అన్ని ర కాల బకాయిలు చెల్లించడంతో పాటు ప్రధానమైన సమస్యల ను పరిష్కరించాలని ఈ నెల 7 నుంచి సమ్మెబాట పడుతున్నాం. అనేక దఫాలుగా ప్రభుత్వం, యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు. –కందుల భాస్కరరావు, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి

సమ్మెకు సన్నద్ధం!

సమ్మెకు సన్నద్ధం!