
సింహాచలం ఘటనకు ప్రభుత్వ తప్పిదాలే కారణం
రేపల్లె: కూటమి ప్రభుత్వ తప్పిదాల వల్లే పవిత్ర దేవాలయాలలో అపశృతులు చోటుచేసుకుని భక్తులు ప్రాణాలు కోల్పోతున్నారని వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధికార ప్రతినిధి కేవీ కృష్ణారెడ్డి ఆరోపించారు. పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సింహాచలం దేవాలయంలో గోడ గూలి ఏడుగురు భక్తులు దుర్మరణం పాలవడం బాధాకరమన్నారు. ఈ ఘటనకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలన్నారు. హడావుడిగా కట్టిన నాసిరకం గోడ కూడటం వల్లే భక్తులు ప్రాణాలు కోల్పోయారన్నారు. చందనోత్సవం వేడుకకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని తెలిసినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. గతంలోనూ కొన్ని సందర్భాలలో కుటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది భక్తులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఇప్పటికై నా ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి ప్రముఖ దేవాలయాల్లో కట్టుదిట్ట ఏర్పాట్లు చేయడంతోపాటు సింహాచలం ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
మృతుల కుటుంబాలను ఆదుకోవాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి కేవీ కృష్ణారెడ్డి