చందోలు(కర్లపాలెం): బగళాముఖి అమ్మవారి కొలుపులలో రెండో రోజు కిరాత రూప వారాహి దివ్య అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి వార్షిక తిరునాళ్ల మహోత్సవంలో భాగంగా జరుగుతున్న కొలుపులలో గురువారం చెరుకుపల్లి మండలం కుంచలవారిపాలెం గ్రామానికి చెందిన గ్రామపెద్దలు చెంచురెడ్డి, రవిచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారి ఆలయానికి వచ్చి బగళాముఖి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారులు, 16మంది సభ్యులు భక్తిశ్రద్ధలతో బగళాముఖి అమ్మవారి పావనం, ఘటములను శిరస్సున ధరించి మంగళవాయిద్యాలతో తమ గ్రామంలోనికి తీసుకువెళ్లి ఊరేగింపు నిర్వహించారు. గ్రామంలోని భక్తులు అమ్మవారి పావనం, ఘటములకు పసుపు, కుంకుమలతో పూజలు చేసి హారతులిచ్చారు.
నేడు ప్రాధాన్యత క్రమంలో ఉపాధ్యాయులు హాజరు కావాలి
గుంటూరు ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియలో భాగంగా ప్రాధాన్యత క్రమంతో పాటు శారీరక వైకల్య కేటగిరీలో పాయింట్లు పొందుటకు అర్హత కలిగి, ఇటీవల జీజీహెచ్ మెడికల్ బోర్డులో నిర్వహించిన నిర్ధారణ పరీక్షల్లో న్యాయం జరగలేదని భావించే ఉపాధ్యాయులు శుక్రవారం ఉదయం 10 గంటలకు జిల్లాకోర్టు ఎదుట ఉన్న ఏపీ టీఎఫ్ జిల్లా కార్యాలయంలో హాజరు కావాలని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. నిజమైన అర్హతలు కలిగిన ఉపాధ్యాయులు పాత, కొత్త మెడికల్ సర్టిఫికెట్లతో రావాలని సూచించారు. ఇతర వివరాలకు 99497 47464, 89192 50950, 77022 98003, 99487 49115 నంబర్లలో సంప్రదించాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె. బసవ లింగారావు తెలిపారు.
వాటర్ సప్లయ్ సబ్డివిజన్ డీఈగా మనోహర్
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ విజయపురిసౌత్ కాలనీ వాటర్ సప్లయ్ సీవరేజ్ సబ్ డివిజన్ డీఈగా జి.మనోహర్ బాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇప్పటి వరకు నెల్లూరులోని తెలుగుగంగ ప్రాజెక్ట్ ఏఈఈగా పనిచేశారు. పదోన్నతిపై నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కాలనీకి డీఈగా వచ్చారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మనోహర్ బాబు ను డీఈ మురళీధర్, ఏఈఈ హిమబిందు తదితరులు అభినందించారు.
దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి భక్తులు విరాళాలు అందజేస్తున్నారు. హైదరాబాద్కు చెందిన జి.నాగకుమారి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి రూ. లక్ష విరాళాన్ని అన్నదానానికి అందజేశారు. చైన్నెకి చెందిన డి.ఫణీంద్రరావు కుటుంబం ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ. 1,00,116 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
కార్తికేయుని సన్నిధిలో ప్రత్యేక పూజలు
మోపిదేవి: శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ వెల్ఫేర్ కమిషనర్ శ్రీరామ సత్యనారాయణ గురువారం దర్శించుకున్నారు. ఆయన ప్రత్యేక పూజలు చేశారు.

వారాహి దివ్య అలంకరణలో దర్శనమిచ్చిన బగళాముఖి