
బాబు షూరిటీ..
ఇంటింటికి మద్యం గ్యారంటీ
భట్టిప్రోలు (కొల్లూరు): నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు.. నీకు రూ.18 వేలు.. నీకు రూ. 18 వేలు అని చెప్పుకుని ప్రజలను మోసగించిన కూటమి ప్రభుత్వం నేడు నీకు బీరు.. నీకు విస్కీ.. నీకు బ్రాందీ.. ఇంటింటికి మద్యం సీసాలు అనే రీతిలో రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేపడుతూ లిక్కర్ మాఫియాతో రాష్ట్రాన్ని నింపేసిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి వరికూటి అశోక్బాబు విమర్శించారు. గురువారం బాపట్ల జిల్లా భట్టిప్రోలులో టీడీపీ నాయకులు మద్యం దుకాణాలలో చేస్తున్న అక్రమాలపై వరికూటి అశోక్బాబు వినూత్నరీతిలో నిరసన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ మద్యం దుకాణాల విషయంలో నిబంధనలు మీరితే ఉక్కుపాదం మోపుతానన్న సీఎం చంద్రబాబు టీడీపీ నాయకులు చేసే అక్రమాలపై ఆయన ఉక్కుపాదం మోపలేకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. మద్యం దుకాణాలలో అనుమతులు లేని పర్మిట్ రూమ్లు, బెల్టు దుకాణాలపై రాష్ట్ర వ్యాప్త పోరాటానికి భట్టిప్రోలులో చేపట్టిన నిరసన ప్రదర్శనే నాందిగా మారనుందని చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు. ఒక్కో మద్యం దుకాణం నుంచి స్థానిక ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు నుంచి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ వరకు 30 శాతం వాటాల రూపంలో చెల్లిస్తున్నట్లు దుకాణదారులే చెబుతున్నారన్నారు. తమకు 30 శాతం వాటాలు అందని పక్షంలో మద్యం దుకాణాలలో అనుమతులు లేని పర్మిట్ రూమ్లు, బెల్టు దుకాణాలపై తక్షణం చట్టపరమైన చర్యలు చేపట్టి కేసులు నమోదు చేయించి తమ నిజాయితీని ప్రజల ముందు నిరూపించుకోవాలని సవాలు చేశారు.
వినూత్న రీతిలో నిరసన...
తొలుత ఆయన భట్టిప్రోలు రథం సెంటర్ నుంచి కూరగాయలు అమ్మే తోపుడు బండి, పండ్లు అమ్మే బుట్టల్లో ఖాళీ మద్యం సీసాలతో వినూత్న రీతిలో నిరసన ప్రదర్శన జరిపారు. భట్టిప్రోలు, అద్దేపల్లి వీధులలో వైఎస్సార్ సీపీ శ్రేణులతో ప్రదర్శనగా స్థానిక పోలీసుస్టేషన్కు చేరుకున్న ఆయన చుండూరు సీఐ శ్రీనివాసరావు, భట్టిప్రోలు ఎస్ఐ శివయ్యలకు వినతిపత్రం అందజేసి అనుమతులు లేని పర్మిట్రూమ్లు, బెల్టు దుకాణాలపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు.
మద్యం అక్రమాలపై రాష్ట్ర వ్యాప్త పోరాటానికి నాంది వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి వరికూటి అశోక్బాబు