
రేషన్ పంపిణీ పారదర్శకంగా జరగాలి
జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్
రాయచోటి: జిల్లాలోని 1123 చౌక ధరల దుకాణాలు ద్వారా పారదర్శకంగా రేషన్ పంపిణీ జరగాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉదయం రాయచోటిలో రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం చెన్నముక్కపల్లి, రెడ్డివారిపల్లిలో రేషన్ పంపిణీని పునఃప్రారంభించారు. అనంతరం 65 సంవత్సరాలు పైబడిన వారికి ఇంటివద్దనే రేషన్ అందించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న రేషన్ పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 1123 చౌక ధరల దుకాణాలలో 4,97,969 రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. రేషన్ కార్డుల ద్వారా 14,82,094 మంది సభ్యులు రేషన్ ద్వారా లబ్ధి పొందనున్నారని పేర్కొన్నారు. ఇందులో 65 సంవత్సరాల పైబడిన కార్డుల సంఖ్య 53,707గా ఉందన్నారు. ఈ కార్డుల ద్వారా 69336 మంది సభ్యులు లబ్ధి పొందుతారని తెలిపారు. ప్రతినెల 1 నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు రేషన్ పంపిణీ జరుగుతుందని పేర్కొన్నారు. ఏక లేదా ద్విసభ్య కార్డుల్లోని 65 సంవత్సరాలపైబడిన వారికి, దివ్యాంగులకు వారి ఇంటివద్దనే రేషన్ పంపిణీ ఒకటో తేది నుంచి 05వ తేది వరకు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య సమయంలో పంపిణీ చేస్తారన్నారు.. కార్యక్రంమలో రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రఘురాం, సిబ్బంది పాల్గొన్నారు.