
పొలంలో దౌర్జన్యంగా దారి ఏర్పాటు
రైల్వేకోడూరు అర్బన్ : మండలంలోని చియ్యవరం పంచాయతీ వడ్డిపల్లికి చెందిన చంద్రగిరి వెంకటేష్, లక్ష్మిదేవమ్మల కుటుంబానికి 639–4లో 3.81 సెంట్లు మామిడి తోట ఉంది. వారి పొలం పక్కన ఉన్న రఘురామయ్య, రామచంద్రయ్యలు గత కొంత కాలంగా తమ పొలానికి వేరే దారి ఉన్నా రోడ్డుపై నుండి తమ పొలానికి దారి ఉందని శుక్రవారం రెండు జేసీబీలతో దౌర్జన్యంగా , కూటమి నాయకులు, అధికారులు, పోలీసుల అండతో 70 శాతం దారి ఏర్పాటు చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. తాము అడ్డుకొనే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసుల అండతో దారి ఏర్పాటు చేస్తున్నారని వాపోయారు. కోర్టు ఆర్డరు ప్రకారం రైతులను ఇబ్బంది పెట్టకుండా వారు ఇచ్చిన చోట పరిహారం చెల్లించాలి అని ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోలేదని తెలిపారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపినా ఫలితం లేదన్నారు. తహసీల్దార్ తమ మాట వినకుండా వెళ్లిపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుక్రితం సబ్ కలెక్టర్కు విన్నపించామని అయినప్పటికీ పోలీసులు, రెవెన్యూ అధికారుల అండతో పనులు చేసుకొంటున్నారని పేర్కొన్నారు. ఉన్న 3.80 సెంట్లలో వారికి దారి ఇస్తే తమ పరిస్థితి ఏంటని వారు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయకుంటే ఆత్మహత్యే శరణ్యమని వాపోయారు.

పొలంలో దౌర్జన్యంగా దారి ఏర్పాటు