
రైతులను ఖరీఫ్ సాగుకు సమాయత్తం చేయాలి
లక్కిరెడ్డిపల్లి : ఖరీఫ్ సాగుకు రైతులను సమాయత్తం చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్ క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించారు. శుక్రవారం మండలంలోని లక్కిరెడ్డిపల్లి, అనంతంపల్లి రైతు సేవా కేంద్రాల్లో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా రైతులు, సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కడపకు చెందిన కేవీకే శాస్త్రవేత్తలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్ మాట్లాడుతూ వేరుశనగ సాగు చేసుకునే రైతులు ఈ ఏడాది కదిరి, లేపాక్షి, విశిష్ట రకం వంటి విత్తనాలు సాగు చేసుకుంటే అనువుగా ఉండటంతోపాటు మంచి దిగుబడులు సాధించవచ్చన్నారు. రైతులు ప్రతి ఏడాది వరి, వేరుశనగే కాకుండా పప్పు ధాన్యాలు పంటలైన కంది, ఉలవ, అలసంద, పెసలు, మినుముల సాగుపై మక్కువ చూపాలన్నారు. కేంద్ర నూనె గింజల పరిశోధన సంస్థ శాస్త్రవేత్త బసవరాజ్ మాట్లాడుతూ ఆముదంలో ఐసీహెచ్–5,6 అనే రకాలు తొంభై రోజులకే కాపునకు వస్తాయన్నారు. ఉద్యానశాఖ అధికారిణి నాగమణి మాట్లాడుతూ పండ్లతోటల సాగుపై ఆసక్తి ఉన్న రైతులు రైతుసేవా కేంద్రాలలోని సిబ్బందిని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీపీఎం వెంకటమోహన్, ఏడీఏ జయరాణి, కెవికె శాస్త్రవేత్త శిల్పకళ, ఏఈఓలు కెరోలిన్, అంజనమ్మ, విహెచ్ఏలు సాయి, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.