అసత్యాలు.. అర్ధసత్యాలేనా? పూర్తి నిజాలు రాయరెందుకు? 

Eenadu Fake News On Andhra Pradesh government - Sakshi

పైసలూ పోయే.. పరువూ పోయే!’ అంటూ తప్పుడు కథనం

ఈ పనులకు సంబంధించి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినవే రూ.2 వేల కోట్లు

ఆ విషయం దాచిపెట్టి... రాష్ట్ర ప్రభుత్వం రూ.520 కోట్లు చెల్లించట్లేదని రాతలు

టీడీపీ హయాంలో గ్రామాల్లో వేసిన సీసీ రోడ్ల బిల్లులు చెల్లించిందీ ఈ సర్కారే

ఆ ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.4,481 కోట్లను మూడేళ్లలో చెల్లించిన జగన్‌ ప్రభుత్వం

అప్పట్లో ఫామ్‌పాండ్స్‌ నిర్మాణం పేరుతో రూ.వేల కోట్ల మేర ఉపాధి నిధుల దోపిడీ

అదే ఉపాధి నిధులతో ఈ ప్రభుత్వం వచ్చాక 36 వేలకు పైగా శాశ్వత భవనాల నిర్మాణం

అప్పుట్లో బకాయిలనూ ప్రశ్నించలేదు... ఇప్పుడు కేంద్రాన్నీ పల్తెత్తు మాట అనరు ఇదీ ‘ఈనాడు’ తీరు  

సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించిన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు, డిజిటల్‌ లైబ్రరీ భవనాలకు సంబంధించి గత ఏడాది ఆగస్ట్‌ రెండో వారం వరకు సమర్పించిన అన్ని బిల్లులనూ ప్రభుత్వం అప్పుడే చెల్లించేసింది. ఆ తరువాత చేపట్టిన భవనాలకు సంబంధించి రూ.520 కోట్ల మేర బిల్లులను చెల్లించాల్సి ఉందన్నది ‘ఈనాడు’ కథనం. వైఎస్సార్‌ సీపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు మన ప్రభుత్వమే కదా అన్న ఉద్దేశంతో పనులు చేశారని... కానీ వారికి బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారని రామోజీరావు వారిపై ఎక్కడలేని ప్రేమా ఒలకబోశారు కూడా!!. కానీ ఈ నిర్మాణాలకు సంబంధించి కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇంకా రూ.2,000 కోట్ల నిధులు రావాల్సి ఉంది.

మరి అందులో వీరికి చెల్లించాల్సింది ‘ఈనాడు’ లెక్కల ప్రకారం చూసుకున్నా నాలుగో వంతే కదా? మరి కేంద్రం ఇవ్వటం లేదన్న విషయాన్ని రామోజీ ఎందుకు ప్రస్తావించరు? ప్రభుత్వ భవన నిర్మాణాల బిల్లుల చెల్లింపునకు సహజంగానే కొంత సమయం పడుతుంది. నిజం చెప్పాలంటే రాష్ట్రంలో గ్రామీణ భవనాలకు సంబంధించిన బిల్లులు ఆరు నెలలుగా మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. టీడీపీ హయాంలో చంద్రబాబు తన­యుడు లోకేశ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండగా.. ఏళ్ల తరబడి బిల్లులు చెల్లించలేదు. అప్పట్లో ఏమాత్రం ప్రశ్నించని ‘ఈనాడు’.. ఇప్పుడు కేంద్రాన్ని పల్లెత్తు మాట అనకుండా మొత్తం తప్పంతా రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నట్లు రాయటమే విచిత్రం.  

టీడీపీ ఎగ్గొట్టిన రూ.4,481 కోట్లను చెల్లించిందెవరు? 
టీడీపీ హయాంలో 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు చంద్రబాబు తనయుడు లోకేశ్‌ మెటీరియల్‌ కేటగిరీలో రాష్ట్రానికి వచ్చే నిధుల కంటే 10 రెట్లు ఎక్కువ విలువైన పనులను టీడీపీ కార్యకర్తలకు కట్టబెట్టారు. వీటిలో సిమెంట్‌ రోడ్లతోపాటు ఇతర పనులను సైతం పార్టీ కార్యకర్తలకు అప్పగించేశారు. ఎన్నికలకు ఏడాది, ఏడాదిన్నర ముందు ఉపాధి మెటీరియల్‌ కేటగిరీలో దాదాపు రూ.20 వేల కోట్ల విలువైన పనులను కట్టబెట్టగా... వాటిలో మూడో వంతు కూడా పనులు జరగలేదు. మరోవైపు పనులు పూర్తిచేసిన వారికి బిల్లులూ చెల్లించలేదు. అప్పట్లో చేసిన పనులకు దాదాపు రూ.4,481 కోట్ల మేర బకాయిలు పెండింగ్‌లో ఉండగా.. ఆ తరవాత అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమే ఆ బిల్లులను పూర్తిగా చెల్లించింది. 

బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం ఈపూరు లో ఎన్నికలకు ముందు రూ. 31 లక్షలు అంచనా వ్యయంతో 2019 ఫిబ్రవరి లో నిర్మించిన సుమారు 200 మీటర్ల సీసీ రోడ్డు పరిస్థితి   

ఫామ్‌ పాండ్స్‌ పేరిట దోచేసినా.. 
చంద్రబాబు హయాంలో ఉపాధి హామీ పథకం నిధులతో పంట కుంటలు (ఫామ్‌ పాండ్స్‌) పేరుతో రైతుల పొలాల్లో పొక్లెయిన్లతో గుంతలు తవ్వించారు. వాటినే కూలీలతో తవ్వించినట్టు చూపించారు. ఒక్కో గుంతకు రూ.5 వేల చొప్పున పొక్లెయిన్ల యజమానులకు చెల్లించి.. కూలీలతో చేయించామంటూ ఒక్కొక్క గుంతకు రూ.లక్ష వరకు బిల్లులు దోచేశారు. టీడీపీ అధిష్టానమే ఈ మేరకు ప్రణాళిక రచించి రూ.వేల కోట్లను పార్టీ నాయకులకు దోచిపెట్టింది.

అప్పట్లో దాదాపు తొమ్మిదిన్నర లక్షల పంట కుంటలు తవ్వినట్టు రికార్డులు ఉండగా.. ఇప్పుడు అందులో పదో వంతు కూడా కనబడటం లేదని అధికారులే చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో వేసిన సిమెంట్‌ రోడ్లూ అక్రమాల్లోనే కూరుకుపోయాయి. నాటి సీసీ రోడ్లు నాణ్యత లేక పాడయ్యాయి. సాధారణంగా సిమెంట్‌ రోడ్లు 20 ఏళ్ల పాటు నాణ్యంగా ఉండాలి. రెండు, మూడేళ్లకే అవన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. 

మొత్తంగా మూడేళ్లలో రూ.11,827 కోట్ల చెల్లింపులు 
► చంద్రబాబు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం నిధులలో ఎక్కువ భాగం తమ కార్యకర్తల దోపిడికే వెచ్చించగా.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆ నిధులతో గ్రామాల్లో శాశ్వత భవన నిర్మాణాలకు పూనుకుంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉమ్మడి నిధులు (ఉపాధి హామీ పథకం మెటిరీయల్‌ కేటగిరీలో) గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 36 వేలకు పైగా గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ వంటి భవనాలను నిర్మిస్తోంది. వీటికి సంబంధించి ఇప్పటికే నిర్మాణం పూర్తయిన పనులకు దాదాపు రూ.4,200 కోట్ల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. 

► గత ప్రభుత్వం బకాయి పెట్టిన మరో రూ.4,481 కోట్లు, మూడేళ్లలో సిమెంట్‌ రోడ్లు, డ్రెయిన్లు వంటివి నిర్మించినందుకు గాను సుమారు మరో రూ.3 వేలకు పైగా కోట్లను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఖర్చు చేసింది.  

► ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కేటగిరీలో గత మూడేళ్లలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉమ్మడి నిధులు కలిపి మొత్తం రూ.11827 కోట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖకు విడుదల కాగా.. ఆ మేరకు చెల్లింపులు కూడా పూర్తయ్యాయి.   

► గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించి మధ్యలో ఆపేసిన పనులతోపాటు వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక కొత్తగా ప్రారంభించిన పనులను కలిపి 47,258 కిలోమీటర్ల పొడవైన సిమెంట్‌ రోడ్లు, బీటీ రోడ్లకు సంబంధించి 49,402 పనులు పురోగతిలో ఉన్నట్టు రాష్ట్ర గ్రామీణాభి వృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top