
అభిప్రాయ సేకరణ చేపట్టాలి
● కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశం
అనంతపురం అర్బన్: జనాభా నిర్వహణ విధానం పాలసీపై క్యూఆర్ కోడ్ ద్వారా అభిప్రాయ సేకరణ పక్కగా చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో ‘జనాభా నిర్వహణ విధానం, ప్రతి కుటుంబం ముఖ్యం, మీ అభిప్రాయం మార్గదర్శనం’ పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించి, మాట్లాడారు. ఈ నెల 20వ తేదీ వరకు ప్రజల భాగస్వామ్య సంప్రదింపుతో అభిప్రాయ సేకరణ పూర్తి చేయాలన్నారు. ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు, సచివాలయ సిబ్బందికి తగిన సూచనలు అందజేసి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఎ.మలోల, సీపీఓ అశోక్కుమార్ పాల్గొన్నారు.
యువకుడి దుర్మరణం
గుత్తి: పట్టణ నడిబొడ్డున చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... యాడికి మండలం కొట్టాలపల్లికి చెందిన కార్తీక్ (24), శివరామిరెడ్డి గుత్తిలో గురువారం జరిగిన ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. గుత్తిలోకి చేరుకోగానే యాడికి గ్రామానికి చెందిన బషీర్, రమేష్ వెళుతున్న మరో ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొన్నారు. దీంతో రోడ్డుపై కుడి వైపు పడిన కార్తీక్ను గమనించి లారీ డ్రైవర్ బ్రేక్ వేసే లోపు చక్రం దూసుకెళ్లడంతో తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. కార్తీక్ వెనుక బైక్పై కూర్చొన్న శివరామిరెడ్డి, మరో బైక్పై ఉన్న రమేష్, బషీర్ రోడ్డుకు ఎడమ వైపు పడటంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. చిన్నపాటి గాయాలతో వారు బయటపడ్డారు. మృతుడు బేల్దారి పనులతో కుటుంబానికి చేదోడుగా ఉండేవాడు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు.
పోటీలకు కవితల ఆహ్వానం
అనంతపురం కల్చరల్: ఈ నెల 16నవిన్సెంట్ ఫెర్రర్ స్మారక కవితా పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సామాజిక సేవా కార్యకర్త రవికాంత్ రమణ గురువారం పోస్టర్లను కొప్పల మీనాక్షమ్మ ఫౌండేషన్ కార్యాలయంలో ఆవిష్కరించారు. తెలుగు వెలుగు సాహితీ సంస్థ టీవీరెడ్డి, ఆశ్రయ కృష్ణారెడ్డి, సంపాదకులు తోట నాగరాజు, లఘుచిత్రాల కెమెరామెన్ లింగాల పవన్ తదితరులు మాట్లాడారు. ఈనెల 16న విన్సెంట్ ఫెర్రర్ వర్ధంతి సందర్భంగా ‘ఆర్డీటీ సేవలు– అభాగ్యులకు వరాలు’ పేరిట కవితా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఈనెల 10వ తేదీలోపు తమ కవితలను 73828 63523 నంబర్కు పంపాలన్నారు.