
ఎస్ఏ పదోన్నతులకు సర్టిఫికెట్ల పరిశీలన
అనంతపురంం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల పదోన్నతుల్లో భాగంగా ఎస్జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్లగా పదోన్నతులు కల్పించేందుకు గురువారం సర్టిఫికెట్ల పరిశీలన జరిగింది. స్థానిక శారదా నగరపాలక ఉన్నత పాఠశాలలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, మునిసిపల్, మునిసిపల్ కార్పొరేషన్ యాజమాన్యాల పాఠశాలల టీచర్లు హాజరయ్యారు. ఒక్కో పోస్టుకు ఇద్దరు చొప్పున 1:2 ప్రకారం సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచామని విద్యాశాఖ అధికారులు చెప్పినా... మొత్తం 382 పోస్టులు ఖాళీలుంటే, 372 మంది ఎస్జీటీలు రావడం విశేషం.
యాజమాన్యాల వారీగా పరిశీలిస్తే...
ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సబ్జెక్టులకు కలిపి 26 ఖాళీలుంటే 21 మంది ఎస్జీటీలు, మునిసిపల్ పాఠశాలల్లో 304 ఖాళీలుంటే 300 మంది, మునిసిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో 52 ఖాళీలుంటే 52 మంది హాజరయ్యారు. శుక్రవారం మండల పరిషత్ పాఠశాలల టీచర్లకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. జిల్లాపరిషత్ స్కూళ్లలో అన్ని సబ్జెక్టులకు కలిపి 350 దాకా ఖాళీలున్నట్లు లెక్కలు తేల్చారు. మండల్ పరిషత్ టీచర్లతో పాటు ప్రభుత్వ, మునిసిపల్, కార్పొరేషన్ టీచర్లకు శుక్రవారం కూడా సర్టిఫికెట్ల పరిశీలనకు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
బదిలీ ఉత్తర్వుల కోసం స్కూల్
అసిస్టెంట్లు ఎదుచూపు
బదిలీల ఉత్తర్వుల కోసం స్కూల్ అసిస్టెంట్లు ఉదయం నుంచి ఎదురుచూశారు. ముందురోజే ఆప్షన్ల ప్రక్రియ పూర్తయింది. ఆ వెంటనే ఆర్డర్స్ జనరేట్ అవుతాయని అధికారులు ప్రకటించారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రిదాకా వేలాది మంది టీచర్లు బదిలీ ఉత్తర్వులు కోసం ఎదురుచూశారు. తరచూ సెల్ఫోన్లు చూసుకోవడం, డీఈఓ కార్యాలయ సిబ్బందిని ఆరా తీయడం, ఉపాధ్యాయ సంఘాల నాయకులను వాకబు చేయడం, రాష్ట్రంలోని సంఘాల నాయకులను ఆరా తీయడం కనిపించింది. అర్ధరాత్రి దాటిన తర్వాత జనరేట్ అయ్యే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
మొత్తం 4,589 మంది దరఖాస్తు
ఉమ్మడి జిల్లాలో మొత్తం 4,589 మంది స్కూల్ అసిస్టెంట్లు బదిలీల కోసం దరఖాస్తు చేసుకుని వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. వీరిలో 2,456 మంది తప్పనిసరి, 2,133 మంది టీచర్లు రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. సబ్జెక్టుల వారీగా పరిశీలిస్తే..,. బయలాజికల్ సైన్స్ 631 మంది, ఇంగ్లిష్ 656, హిందీ 383 మంది, కన్నడ ముగ్గురు, గణితం 847 మంది, పీడీలు 262 మంది, ఫిజికల్ సైన్స్ 616 మంది, సంస్కృతం ఏడుగురు, సోషల్ 544 మంది, స్పెషల్ ఎడ్యుకేషన్ 37 మంది, తెలుగు 584 మంది, ఉర్దూ 19 మంది దరఖాస్తు చేసుకున్నారు.
నేడు మండల పరిషత్ పాఠశాలల టీచర్ల సర్టిఫికెట్ల పరిశీలన
పదోన్నతి పంచాయితీ
ఇటీవల జరిగిన హెచ్ఎం పదోన్నతుత్లో నాట్ ఆప్టెడ్ (ప్రస్తుతం పదోన్నతి ఇష్టం లేదు) ఇచ్చిన ఓ స్కూల్ అసిస్టెంట్ ఇప్పుడు పదోన్నతి కావాలని అడుగుతున్నాడు. ఈ విషయం విద్యాశాఖలో ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. వివరాలు.. స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎం పదోన్నతులకు ఇటీవల కౌన్సెలింగ్ నిర్వహించారు. ధర్మవరం మునిసిపల్ బాలికల పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పని చేస్తున్న ఓ టీచరు... పదోన్నతి జాబితాలో ఉన్నాడు. వాస్తవానికి ఇదే స్కూల్లో హెచ్ఎం పోస్టు ఖాళీ ఉంది. తాను హెచ్ఎం పదోన్నతి తీసుకుని ఇదే స్కూల్కు రావాలని ఆయన భావించాడు. అయితే, సీనియార్టీ జాబితాలో ఈయనకంటే ముందు మరో ఇద్దరు టీచర్లు ఉన్నారు. సదరు టీచరు కౌన్సెలింగ్కు హాజరైనప్పుడు ధర్మవరం బాలికల పాఠశాల పోస్టు ఖాళీగానే ఉంది. నిబంధనల ప్రకారం 50 ఏళ్లు దాటిన పురుష టీచరు బాలికల పాఠశాల కోరుకున్నా... ఆయన వెనక (చివరిస్థానంలో ఉన్నాసరే) ఉన్న మహిళా టీచరు సదరు బాలికల పాఠశాల కోరుకుంటే ఆయన వెనక్కు రావాల్సిందే. ఆ సమయంలో మిగులుగా ఉన్న స్కూళ్లకు కేటాయిస్తారు. ఇదే విషయాన్ని సదరు టీచరుకు అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఆయన పదోన్నతి వద్దని ఆప్షన్ ఇచ్చాడు. ఈ క్రమంలో సీనియార్టీ జాబితాలో ఆ టీచరు వెనుక మరో ఇద్దరు టీచర్లు ఉన్నారు. అక్కడితో ఖాళీలన్నీ పూర్తవుతాయి. ఇద్దరూ పదోన్నతి పొందారు. పురుష టీచరు తీసుకోకపోవడంతో సీనియార్టీ జాబితాలోని మూడో టీచరుకు అవకాశం కల్పించారు. తాజాగా నాట్ ఆప్టెడ్ ఇచ్చిన సదరు టీచరు రంగంలోకి దిగి డీఈఓపై ఉన్నతాధికారులతో ఒత్తిళ్లు చేయించినట్లు తెలి సింది. దిక్కు తెలీని అధికారులు... ఆయన పదోన్నతి తీసుకున్న ముగ్గురు టీచర్లను పిలిపించి చివరి టీచరు రివర్షన్ వెళ్లాలని సూచించారు. ఇందుకు సదరు టీచరు ససేమిరా అంటుండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.