
16 రోజులు... 209 కిలోమీటర్లు
కళ్యాణదుర్గం: ఉమ్మడి అనంతపురం జిల్లా జీవనాడి ఆర్డీటీ (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్) కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పురుడుపోసుకుంది. పేద ప్రజలను ఆదుకుంది. అలాంటి ఆర్డీటీకి ఇటీవల ఇబ్బందులు తలెత్తాయి. విదేశాల నుంచి సంస్థకు వచ్చే నిధులను ఆపేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న అనాలోచిత నిర్ణయం ఒక్కసారిగా పేదలను ఆందోళనలో పడేసింది. ఈ క్రమంలో ఆర్డీటీ పరిరక్షణే ధ్యేయంగా వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య ‘పాదయాత్ర’కు శ్రీకారం చుట్టారు. బుధవారం నుంచి కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజ లను చైతన్య పరుస్తూ ముందుకు సాగనున్నారు.
16 రోజులు...209 కిలోమీటర్లు
బెళుగుప్ప మండలం బ్రాహ్మణపల్లి తండా (గొంచితండా) నుంచి రంగయ్య పాదయాత్ర ఈనెల బుధవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. మొత్తంగా 16 రోజుల పాటు 209 కిలోమీటర్ల మేర కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం, శెట్టూరు, కుందుర్పి, కంబదూరు మండలాల్లోని 63 గ్రామాల మీదుగా యాత్ర సాగుతుంది. పాదయాత్ర మొదటి రోజు వైఎస్సార్ సీపీ ముఖ్య నేతలు, పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, శ్రేణులు పాల్గొని రంగయ్యకు సంఘీభావం తెలపనున్నారు.
నేటి నుంచి తలారి రంగయ్య
‘ఆర్డీటీ పరిరక్షణ మహా పాదయాత్ర’
ఆర్డీటీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరించకపోతే 55 ఏళ్లుగా పేదలు పొందుతున్న అన్ని సేవలు, సౌకర్యాలు పూర్తిగా నిలిచిపోతాయి. పిల్లల చదువులు, ఇళ్లు, వైద్య సేవలు, మహిళా సంఘాల ప్రయోజనాలు, దివ్యాంగులు, రైతులు ఇలా అందరికీ తీరని నష్టం వాటిల్లుతుంది. ఆర్డీటీని కాపాడుకోవడానికి ప్రజలందరూ కలసికట్టుగా పోరాడాలి. సంస్థ ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ రుణం తీర్చుకునే అవకాశంలా భావించి కదలిరావాలి.
– డాక్టర్ తలారి రంగయ్య, మాజీ ఎంపీ