
చంద్రబాబు పాలనలో జిల్లాలో అరాచకం కొనసాగుతోంది. లోకేష్
● పుట్లూరు మండలం కోమటిగుంట్ల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు మనోహర్, విశ్వనాథ్, శేఖర్ తదితరులపై టీడీపీ నాయకులు కర్రలతో దాడి చేశారు. అదే సమయంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు ఎరికలయ్య(55) టీడీపీ నాయకుల్ని అడ్డుకుని నిలువరించే ప్రయత్నం చేయడంతో ఆయనపై బండరాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. బలమైన గాయాలతో అక్కడే కుప్పకూలి ఎరికలయ్య మృతి చెందాడు.
● రాప్తాడులో వైఎస్సార్సీపీకి చెందిన చిగిచెర్ల నారాయణరెడ్డి, ముత్యాలమ్మ దంపతుల హత్య రాష్ట్రాన్నే కుదిపిసేంది. పొలం తగాదా విషయంలో ఇనుపరాడ్లు, కట్టెలు, వేట కొడవళ్లతో దాడి చేయడంతో ఘటనాస్థలంలోనే భార్య, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో భర్త మృతి చెందారు. రాప్తాడు సమీపంలోని గంగలకుంటకు చెందిన పొలం విషయంగా దాయాదుల మధ్య నెలకొన్న వివాదంలో టీడీపీ నేతలు తలదూర్చి ఈ ఘాతుకానికి తెగబడ్డారు.
రాప్తాడు మండలంలో టీడీపీ నాయకులు నిప్పు పెట్టడంతో
కాలిపోయిన బోరు, డ్రిప్ పరికరాలు (ఫైల్)
రాప్తాడు మండలం వరిమడుగులో స్థలం కబ్జా కోసం టీడీపీ నాయకులు ధ్వంసం చేసిన బండలు (ఫైల్)
అనంతపురం: కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజా ప్రతినిధుల నుంచి సామాన్యుల వరకూ ఎవరికీ రక్షణ లేకుండా పోయింది. ప్రభుత్వ ఆస్తుల విధ్వంసకాండ కొనసాగుతోంది. ఇక ప్రైవేట్ ఆస్తుల విధ్వంసానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. పచ్చ ముఠాలు రెచ్చిపోయి ఆస్తుల విధ్వంసానికి తెరతీస్తున్నారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, తాగునీటి ట్యాంకులు వంటి ప్రభుత్వ ఆస్తులను కూలగొట్టారు. టీడీపీ అధికార మదానికి పోలీసు శాఖ దాసోహమైంది. ప్రభుత్వ ప్రేరిపిత దాడులు కావడంతో చేష్టలుడిగి చూస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలాయి.
● సార్వత్రిక ఎన్నికల అనంతరం తాడిపత్రి పట్టణంలో వైఎస్సార్సీపీ ముస్లిం మైనార్టీ నాయకుడు ఫయాజ్ బాషా నూతనంగా గృహాన్ని నిర్మించారు. ఇందుకు సంబంధించి అన్ని అంశాలు సక్రమంగా ఉన్నాయి. మున్సిపాలిటీ అనుమతులూ ఉన్నాయి. అయినా... ఫయాజ్బాషా నిర్మించిన ఇంటిని ఆక్రమణల పేరుతో తొలగించేందుకు మునిసిపల్ అధికారులను తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి పురమాయించారు. ఇంటిని కూల్చాలని ఒత్తిడి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అధికారుల చర్యలను పలు దఫాలుగా ఫయాజ్ బాషా అడ్డుకున్నారు. దీంతో నేరుగా జేసీ ప్రభాకర్రెడ్డి రంగంలో దిగి జేసీబీని తీసుకెళ్లి ఫయాజ్బాషా ఇంటి పైకి టీడీపీ కార్యకర్తలతో రాళ్ల దాడి చేయించారు. అనంతరం టీడీపీ కార్యకర్తలపై ఫయాజ్బాషానే రాళ్ల దాడికి పాల్బడ్డారంటూ రివర్స్ కేసు నమోదు చేయించారు.
● సార్వత్రిక ఎన్నికలు పూర్తయినప్పటి నుంచి ఇప్పటి వరకూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అడుగుపెట్టనివ్వకుండా రెడ్బుక్ రాజ్యాంగంతో అడ్డుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో జరిగిన గొడవల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డిని, జేసీ ప్రభాకర్రెడ్డి ఇరువురినీ తాడిపత్రి వదిలి వెళ్లాలని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యాక జేసీ ప్రభాకర్రెడ్డి ఒక్కరే తాడిపత్రిలో కాలు పెట్టారు. కానీ కేతిరెడ్డి పెద్దారెడ్డిని మాత్రం పోలీసులు అనుమతించలేదు. ఈ నేపథ్యంలో తాడిపత్రికి వెళ్లడానికి హైకోర్టు నుంచి అనుమతులు తీసుకున్నా పెద్దారెడ్డిని ఇప్పటికీ అక్కడ కాలు పెట్టనివ్వడం లేదు. హైకోర్టు ఆదేశాలను సైతం ఎస్పీ పట్టించుకోలేదంటే రెడ్ బుక్ రాజ్యాంగానికి పోలీస్ వ్యవస్థ ఎంతలా దాసోహమైందో అర్థం చేసుకోవచ్చు.
● జిల్లా వ్యాప్తంగా ఖాళీ స్థలాలనే కాకుండా పట్టా స్థలాలనూ టీడీపీ నేతలు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. అడ్డుకోబోయిన సొంత దారులపై దాడులకు తెగబడుతున్నారు.
చిన్నారులనే కనికరం లేకుండా
● రాయదుర్గం మండలం యర్రగుంట గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థినిపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ముక్కన్న లైంగిక వేధింపులకు పాల్బడ్డాడు. మనో వేదనకు గురైన ఆ బాలిక హెచ్చెల్సీలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. అప్రమత్తమైన స్థానికులు బాలికను కాపాడారు. ముక్కన్నకు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.
● గత నెలలో కేవలం రోజుల వ్యవధిలోనే 15 మంది మహిళలు, బాలికలు అదృశ్యమయ్యారు. కారణాలు ఏమైనా ఇప్పటి వరకూ కొన్ని అదృశ్యం కేసుల్లో మిస్టరీ వీడలేదు.
రాక్షసత్వానికి పరాకాష్ట
కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో
అంతులేని ఆకృత్యాలు, దౌర్జన్యకాండ
ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల విధ్వంసం
అక్రమ కేసులు, అరెస్ట్లు, హత్యలు
రెడ్బుక్ రాజ్యాంగానికి దాసోహమన్న పోలీసులు
కుంటి సాకులతో కేసులు
ఆగని దౌర్జన్యకాండ
జిల్లాలో ఇప్పటి వరకూ 70 మందికి పైగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. రివర్స్ కేసులతో వేధింపులకు గురి చేశారు.
చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కళ్యాణదుర్గంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య, పార్టీ నాయకుడు మాదినేని ఉమామహేశ్వర నాయుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోయ తిప్పేస్వామితో పాటు మొత్తం 48 మంది నాయకులు వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసేందుకు ర్యాలీగా వెళ్తుండగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కానిస్టేబుల్ లింగరాజును ప్రభావితం చేసి, ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు తప్పుడు కేసు నమోదు చేయడం గమనార్హం.
చిన్నారిపై జరిగిన అఘాయిత్యాన్ని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఖండించి, నిందితులను శిక్షించాలని ప్రెస్మీట్లో కోరినందుకు కేసు నమోదు చేసి, వేధింపులకు గురి చేశారు.
ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్కుమార్పై దాడికి యత్నించారంటూ ఎంపీ గోరంట్లమాధవ్పై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం ఆయన బెయిల్పై విడుదలయ్యారు.
విద్యుత్ బిల్లుల పెంపు అంశంపై నిరసన తెలిపేందుకు సిద్ధమైన ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డిపై ఉరవకొండలో ట్రాఫిక్కు అంతరాయంకలిగించారనే నెపంతో అక్రమ కేసు నమోదు చేశారు.
గుమ్మఘట్ట మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ గౌని కాంతారెడ్డి.. ఓ యాక్సిడెంట్ కేసు విషయంలో పంచాయితీ చేసి బాధితులకు అందాల్సిన రూ.నాలుగు లక్షలను వాడుకున్నాడని తప్పుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేయించి రిమాండ్కు పంపారు.
ఆత్మకూరు, రాయదుర్గం మండలం ఆయతపల్లి, బెళుగుప్ప గ్రామాల్లోని సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమంగా కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారు.
డి.హీరేహల్ మండలంసిద్దాపురం తండాలో తాగునీటి కొళాయి విషయంగా ఘర్షణ పడి ఏడుగురు వైఎస్సార్సీపీ నాయకులపైనే రివర్స్ కేసు నమోదు చేయించి రిమాండ్కు పంపారు.
డి.హీరేహల్ మండలం కళ్లెం గ్రామంలో చోటు చేసుకున్న చిన్న పాటి ఘర్షణకు రాజకీయ రంగు పులిమి 11 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసు బనాయించి రిమాండ్కు పంపారు.

చంద్రబాబు పాలనలో జిల్లాలో అరాచకం కొనసాగుతోంది. లోకేష్

చంద్రబాబు పాలనలో జిల్లాలో అరాచకం కొనసాగుతోంది. లోకేష్