
వైఎస్సార్సీపీ నేతపై టీడీపీ గూండాల దాడి
యాడికి: మండలంలో టీడీపీ గూండాలు బరితెగించి బోయరెడ్డిపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నేత మారుతిపై దాడికి పాల్పడ్డారు. సోమవారం మధ్యాహ్నం బోయరెడ్డిపల్లి నుంచి తన ద్విచక్ర వాహనంపై పెన్నా సిమెంటుకు బయలు దేరిన మారుతిని పరిశ్రమ సమీపంలో ఉన్న వంక వద్ద అదే గ్రామానికి చెందిన టీడీపీ గూండాలు అడ్డుకుని కట్టెలు, పైపులతో దాడి చేశారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన మారుతి ప్రస్తుతం అనంతపురంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వెంకట్రామిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు భోగాతి బ్రహ్మానందారెడ్డి, మల్లికార్జున, రామకృష్ణ తదితరులు అనంతపురంలోని ఆస్పత్రికి చేరుకుని మారుతిని పరామర్శించారు.
చాగల్లు రిజర్వాయర్లో అమ్మవారి విగ్రహం లభ్యం
పెద్దపప్పూరు: చాగల్లు రిజర్వాయర్లో అమ్మవారి పంచలోహ విగ్రహం లభ్యమైంది. పెద్దయక్కలూరు గ్రామానికి చెందిన కొందరు జాలర్లు ఆదివారం రాత్రి చేపల వేట కోసం చాగల్లు రిజర్వాయర్ దిగువ ప్రాంతంలో వలలు వేయగా 3 అడుగుల ఎత్తు దాదాపు 30 కిలోల బరువు ఉన్న పంచలోహపు అమ్మవారి విగ్రహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న పెద్దపప్పూరు గ్రామస్తులు అమ్మవారి విగ్రహాన్ని మేళతాళాలతో ఘనంగా ఊరేగించి చౌడేశ్వరిదేవి ఆలయంలో ఉంచారు.
కర్ణాటక వాసి దుర్మరణం
పెద్దవడుగూరు: మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై కాశేపల్లి టోల్ప్లాజా వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... కర్ణాటకలోని రాయచూర్ నుంచి పేపర్ బెడ్స్ లోడ్తో వచ్చిన ఐచర్ వాహనం అనంతపురంలో అన్లోడ్ చేసి సోమవారం తెల్లవారుజామున తిరుగు ప్రయాణమైంది. కాశేపల్లి టోల్ప్లాజా దాటగానే డ్రైవర్ ఖలీల్ నిద్ర మత్తులో జోగడంతో ముందు వెళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొన్నాడు. ప్రమాదంలో రాయచూరు జిల్లా మాన్వికి చెందిన ఐచర్ క్లీనర్ మహమ్మద్ (31) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి సోదరుడు యూనస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
మార్కెట్ వసూళ్లు ఆశాజనకం
అనంతపురం అగ్రికల్చర్: మార్కెట్యార్డు పరిధిలో వివిధ రకాల ఫీజు వసూళ్లు ఆశాజనకంగా ఉన్నట్లు ఆ శాఖ ఏడీ పి.సత్యనారాయణచౌదరి తెలిపారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. జిల్లాలోని9 మార్కెట్ కమిటీలు, 15 చెక్పోస్టుల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.13.49 కోట్లు వసూళ్లు లక్ష్యంగా పెట్టుకోగా మొదటి రెండు నెలల కాలంలో 18 శాతంతో రూ.2.42 కోట్లకు పైగా సాధించినట్లు వివరించారు. అందులో మే నెల టార్గెట్ రూ.1.01 కోట్లు కాగా రూ.1.03 కోట్లు వసూలైందన్నారు.

వైఎస్సార్సీపీ నేతపై టీడీపీ గూండాల దాడి

వైఎస్సార్సీపీ నేతపై టీడీపీ గూండాల దాడి