
ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్న ప్రభుత్వాలు
అనంతపురం అర్బన్: సంస్కరణల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై ఆర్థిక భారాలను మోపుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు విమర్శించారు. ఆస్తి పన్ను పెంపును వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక గణేనాయక్ భవన్లో ప్రభుత్వాల సంస్కరణల వల్ల ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాలపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆదానీకి దాసోహమైందని ఆరోపించారు. ఆదానీకి లబ్ధి చేకూరేలా పెంచిన విద్యుత్ చార్జీలపై ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలన్నారు. సర్దుబాటు పేరుతో రూ.18 వేల కోట్ల భారాన్ని ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం మోపిందన్నారు. విద్యుత్ చార్జీలు పెంచబోమని, స్మార్ట్ మీటర్లను పగలకొట్టాలంటూ ఎన్నికల సమయంలో చెప్పిన కూటమి పార్టీలు అధికారంలోకి రాగానే మాట మార్చాయని మండిపడ్డారు. విద్యుత్చార్జీల పెంపు, స్మార్ట్మీటర్ల ఏర్పాటు, ఆస్తిపన్ను పెంపునకు వ్యతిరేకంగా ప్రజలందరినీ కలుపుకుని రానున్న రోజుల్లో పోరాటాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి రామిరెడ్డి, సిటిజెన్స్ ఫోరమ్ నాయకులు ఏజీరాజమోహన్, నాయకులు మత్తుజ, వెంకటనారాయణ, ప్రకాష్, గోపాల్, మసూద్, ఇర్ఫాన్ పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాబూరావు