
కమ్ముకుంటున్నా.. కరుణించట్లేదు!
అనంతపురం అగ్రికల్చర్: ఆశల నైరుతి రుతుపవనాలు ఈ సారి చాలా ముందుగానే గత నెల 26న ప్రవేశించడంతో అన్నదాతలు సంబరపడ్డారు. ఖరీఫ్ సాగుకు ఇబ్బంది లేకుండా విస్తారంగా వర్షాలు పడతాయని ఆశించారు. కానీ... ‘నైరుతి’ ప్రవేశించి వారం కావొస్తున్నా ప్రభావం మాత్రం చూపడం లేదు. రుతుపవనాలు రాకమునుపు జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురిశాయి. ‘నైరుతి’ ప్రవేశించాక అనుకూల వాతావరణం మధ్య మంచి వర్షాలు కురుస్తాయని ఆశించినా ఆ పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. వారం రోజులుగా అక్కడక్కడా తేలికపాటి మినహా ఎక్కడా మంచి వర్షపాతం నమోదు కాలేదు. 15 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలుల ధాటికి మేఘాలు చెదిరిపోతున్నాయి. ఈ క్రమంలో మూడు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. 36 నుంచి 38 డిగ్రీలు, రాత్రిళ్లు 23 నుంచి 26 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఈ నెల 15 నుంచి... జూలై నెలంతా ఖరీఫ్ కింద పంటల సాగుకు అనుకూలమని శాస్త్రవేత్తలు, అధికారులు చెబుతున్నారు. మరోపక్క వ్యవసాయశాఖ, ఏపీ సీడ్స్ రాయితీ విత్తన పంపిణీ మొదలు పెట్టకపోవడం.. కూటమి సర్కారు నుంచి ఇప్పటివరకు ఎలాంటి సాయం లేక సాగుకు రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కాగా రాగల రెండు రోజులు జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు అక్కడక్కడా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపారు.
ఇంకా మొదలు కాని ‘నైరుతి’ ప్రభావం
గాలి వేగానికి చెదిరిపోతున్న మేఘాలు