
సచివాలయ ఉద్యోగుల నిరసనాగ్రహం
● రాజేష్ నాయుడుపై క్రిమినల్ చర్యలకు డిమాండ్
అనంతపురం: మహానాడుకు జన సమీకరణ చేయలేదని వార్డు వెల్ఫేర్ సెక్రటరీ అశ్వత్థరెడ్డిని టీడీపీ 30వ డివిజన్ ఇన్చార్జ్ రాజేష్నాయుడు పరుష పదజాలంతో దూషించడంపై సచివాలయ ఉద్యోగులు నిరసనాగ్రహం వ్యక్తం చేశారు. రాజేష్నాయుడుపై క్రిమినల్ కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం టూటౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ శ్రీకాంత్ యాదవ్కు బాధితుడితో కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఉద్యోగుల సంఘం నాయకులు లక్ష్మీనారాయణ, సుధాకర్, రామకృష్ణ తదితరులు మీడియాతో మాట్లాడారు. పార్టీ కార్యక్రమానికి జనాలను సమీకరించే బాధ్యత సచివాలయ ఉద్యోగులది కాదన్నారు. బాధితుడు అశ్వత్థరెడ్డికి న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఉద్యోగులను నోటికొచ్చినట్టు తిడుతూ భయభ్రాంతులకు గురిచేస్తే విధులు ఎలా నిర్వర్తిస్తారని ప్రశ్నించారు.
● జిల్లాలోని కళ్యాణదుర్గం, గుంతకల్లు, తాడిపత్రి పట్టణాల్లో సచివాలయ ఉద్యోగులు శనివారం ధర్నా చేసి టీడీపీ నేత రాజేష్నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగులు ఏ పార్టీకి సంబంధించిన వారు కాదన్నారు. జాబ్చార్ట్ ప్రకారం విధులు నిర్వర్తిస్తామే తప్ప ఏ పార్టీకీ కొమ్ము కాసే ప్రసక్తే లేదని సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు స్పష్టం చేశారు.