
రాయలసీమ ద్రోహి చంద్రబాబు
అనంతపురం కార్పొరేషన్: రాయలసీమ ప్రయోజనాలను ఏమాత్రమూ పట్టించుకోని ద్రోహి ముఖ్యమంత్రి చంద్రబాబు అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారిగా తాను రాయలసీమ ప్రాంత వాసి అని మహానాడులో చెప్పారని, ఆయనకు ఈ ప్రాంతం ఇప్పుడు గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు. హంద్రీ–నీవా ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం గండికోట రిజర్వాయర్ను పట్టించుకోకపోవడం, పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా కోస్తా జిల్లా నేతలతో కలిసి ధర్నాలు చేయడం, విభజన హామీల్లో అనంతపురం జిల్లాకు కేటాయించిన ఎయిమ్స్ను మంగళగిరికి తరలించడం, కర్నూలుకు రావాల్సిన హైకోర్టును.. బెంచ్ వరకే పరిమితం చేయడం వంటివి చేసిన చంద్రబాబును ఈ ప్రాంత ప్రజలు ఎప్పటికీ క్షమించబోరన్నారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో గాలేరు నగరి, హంద్రీ–నీవాకు పునాదిరాయి మాత్రమే వేశారని, 1996 నుంచి ఏళ్ల తరబడి సీఎంగా పని చేసిన చంద్రబాబు ఆ ప్రాజెక్టులను ఒక్క కిలోమీటర్ కూడా ముందుకు తీసుకెళ్లలేకపోయారని విమర్శించారు. 40 టీఎంసీల సామర్థ్యం గల హంద్రీ–నీవాను 5 టీఎంసీలకు కుదించి రాయలసీమకు తీరని అన్యాయం చేశారన్నారు.
రాయలసీమకు ప్రాధాన్యతనిచ్చిన జగన్
వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక హంద్రీ–నీవాను అనంతపురం, కర్నూలు జిల్లాకు పరిమితం చేసి, గండికోట నుంచి చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు నీరందించి హంద్రీ–నీవాను అనుసంధానం చేసేలా చర్యలు తీసుకుని.. సీమకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని అనంత పేర్కొన్నారు. జగన్ హయాంలో గండికోటకు 27 టీఎంసీల నీరు తీసుకువచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో హంద్రీ–నీవాకు రూ.4వేల కోట్లు ఖర్చు పెట్టామని చెబుతున్నారని, మరి జగన్ హయాంలో రూ.2వేల కోట్లకుపైగా ఖర్చు చేసిన విషయాన్ని దాచిపెడితే ఎలా బాబూ అన్ని ప్రశ్నించారు.
అరచేతిలో వైకుంఠం
హామీలు నెరవేర్చాలంటే తనను అధికారం నుంచి దించవద్దని, మళ్లీ గెలిస్తేనే హామీలకు గ్యారెంటీ అని, ఇప్పట్లో హామీలను నెరవేర్చే పరిస్థితి లేదని చెప్పకనే చెబుతూ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపారని అనంత మండి పడ్డారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అమలు చేస్తామని.. అధికారంలోకి వచ్చాక ఒక్కటీ అమలు చేయలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షలకు పైగా పింఛన్ల కోత విధించి అర్హులకు అన్యాయం చేశారన్నారు.
మహానాడు పేరిట మహాడ్రామా
కడపలో టీడీపీ నిర్వహించింది మహానాడు కాదని మహాడ్రామా అని అనంత వెంకటరామిరెడ్డి ఎద్దేవా చేశారు. మూడు రోజుల కార్యక్రమమంతా ఆత్మస్తుతి పరనిందగా సాగిందన్నారు. ప్రజలకు ఏం చేస్తామనే విషయంపై నోరు మెదపలేదన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చివరి దశలో చంద్రబాబును ఉద్దేశించి ఏం మాట్లాడారో ఆ వీడియోలను మహానాడులో ప్రదర్శించి ఉంటే బాగుండేదన్నారు. మామకు చేసిన మోసాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో మభ్యపెట్టాలని చూస్తే ప్రజలు నమ్మబోరన్నారు. లోకేష్ తనకు తాను యువరాజులా భావిస్తూ ఆరు శాసనాలు అనడం, దాన్ని గేమ్ఛేంజర్ అంటూ చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో శాసనాలు ఉండవని గుర్తు చేశారు. వ్యవస్థలను చేతిలో పెట్టుకుని రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న లోకేశ్కు స్థానిక ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
జూన్ 4న వెన్నుపోటు దినం
ఎన్నికల హామీలు అమలు చేయకుండా కూటమి చేసిన మోసాన్ని వివరిస్తూ జూన్ 4న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినాన్ని చేపడుతున్నట్లు అనంత తెలిపారు. సమన్వయకర్తలతో కలసి ర్యాలీగా వెళ్లి కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తామన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆలమూరు శ్రీనివాస్రెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు సాకే చంద్రశేఖర్, ఓబిరెడ్డి, మల్లెమీద నరసింహులు, చింతా సోమశేఖర్రెడ్డి, నాయకులు కృష్ణవేణి, మధు, కేశవరెడ్డి, పుల్లయ్య, గుజ్జల శివయ్య, సాకే శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రాజెక్టులపై అంతులేని నిర్లక్ష్యం
ఎన్నికల హామీల అమలులో తాత్సారం
జూన్ నాలుగో తేదీ వెన్నుపోటు దినం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత