పాయింట్లపై ఫిర్యాదుల వెల్లువ | - | Sakshi
Sakshi News home page

పాయింట్లపై ఫిర్యాదుల వెల్లువ

May 31 2025 2:05 AM | Updated on May 31 2025 2:05 AM

పాయింట్లపై ఫిర్యాదుల వెల్లువ

పాయింట్లపై ఫిర్యాదుల వెల్లువ

స్టేషన్‌ పాయింట్లు 24కు మించి ఉండకూడదు

26, 28, 30 పాయింట్లు పొందిన టీచర్లపై ఫిర్యాదులు

స్కూల్‌ అసిస్టెంట్ల తాత్కాలిక సీనియార్టీ జాబితాల విడుదల

అభ్యంతరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన అధికారులు

నేడు ఎస్జీటీల తాత్కాలిక సీనియార్టీ జాబితా విడుదల

అనంతపురం ఎడ్యుకేషన్‌: బదిలీల్లో భాగంగా ఉపాధ్యాయులు నిబంధనలకు విరుద్ధంగా నమోదు చేసుకున్న పాయింట్లపై శుక్రవారం ఫిర్యాదులు వెల్లువెత్తాయి. గురువారం అర్ధరాత్రి స్కూల్‌ అసిస్టెంట్ల సీనియార్టీ జాబితాలకు సంబంధించిన తాత్కాలిక సీనియార్టీ జాబితాలు విడుదలయ్యాయి. శుక్రవారం ఉదయాన్నే పరిశీలించి.. కొందరు పాయింట్లు ఎక్కువ వేసుకోవడాన్ని గుర్తించి నగరంలోని శారదా నగరపాలక ఉన్నత పాఠశాల వద్దకు పరుగులు తీశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీచర్లు తరలివచ్చారు. ఒక స్కూల్‌లో ఎన్నేళ్లు పనిచేసినా గరిష్టంగా ఎనిమిదేళ్లకు 24 పాయింట్లు (3వ కేటగిరీ) పొందాలి. ఒక టీచరు పదేళ్లు పనిచేసినా వేసుకోవాల్సింది 24 పాయింట్లు. ఆ రకంగా సీలింగ్‌ పెట్టారు. సాంకేతిక సమస్య కారణంగా ఎన్నేళ్లు నమోదు చేసినా అన్ని పాయింట్లు పడ్డాయి. రీఅపోర్సన్‌కు గురైన టీచర్లు కూడా ఇష్టానుసారంగా పాయింట్లు నమోదు చేశారు. దీనిపై ఎంఈఓలు, డీఈఓలు పరిశీలించి అభ్యంతరాలు స్వీకరించి అదనంగా పడిన పాయింట్ల తొలిగింపునకు సిఫార్సు చేయాలంటూ విద్యాశాఖ డైరక్టర్‌ కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. దాదాపు ఏ ఒక్క మండలంలోనూ ఈ పని జరగలేదు. ఎంఈఓల లాగిన్లకు వచ్చిన దరఖాస్తులను వచ్చినవి వచ్చినట్టు అఫ్రూవల్‌ చేసి డీఈఓ లాగిన్‌కు పంపారు. డీఈఓ కార్యాలయ టెక్నికల్‌ సిబ్బంది కూడా వాటిని వెంటనే అఫ్రూవల్‌ చేసి రాష్ట్ర కార్యాలయానికి పంపారు.

300కు పైగా అభ్యంతరాలు

స్కూల్‌ అసిస్టెంట్ల తాత్కాలిక సీనియార్టీ జాబితాలను పరిశీలించిన టీచర్లు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున అభ్యంతరాలు తెలిపారు. సుమారు ఆధారాలతో రాతపూర్వకంగా 300కు పైగా ఫిర్యాదులు చేశారు. వాటన్నింటినీ డెప్యూటీ డీఈఓల ద్వారా రాష్ట్ర అధికారుల లాగిన్లకు పంపారు. శనివారం రోజుకు ఫైనల్‌ జాబితా విడుదల కానుంది. ఆలోగా ఎన్ని అభ్యంతరాలు పరిష్కారమవుతాయో.. తాము ఎన్నో స్థానంలో ఉంటామోనన్న ఆందోళన చాలామంది టీచర్లకు పట్టుకుంది. కాగా శనివారం ఎస్జీటీ తాత్కాలిక సీనియార్టీ జాబితా విడుదల కానుంది.

ప్రిఫరెన్షియల్‌ కేటగిరీపై దుమారం

చాలామంది అనర్హులు ప్రిపరెన్షియల్‌ కేటగిరీ జాబితాలో కనిపించడం పట్ల ఉపాధ్యాయుల్లో దుమారం రేపుతోంది. గార్లదిన్నె మండలంలో పని చేస్తున్న ఓ టీచరు.. కంటిచూపు తగ్గిందని వైద్య ధ్రువీకరణ పత్రం పొంది ప్రిఫరెన్షియల్‌ కేటగిరీలో హెచ్‌ఎం పదోన్నతి పొందడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. స్కూల్‌ అసిస్టెంట్ల తాత్కాలిక సీనియార్టీ జాబితాలోనూ ప్రిఫరెన్షియల్‌ కేటగిరీలో ఉన్న టీచర్ల పేర్లను చూసి కంగుతింటున్నారు. సీకేపల్లి, అనంతపురం రూరల్‌, గుత్తి, రొళ్ల, శింగనమల, బత్తలపల్లి, కూడేరు, కణేకల్లు, ధర్మవరం, పెనుకొండ తదితర మండలాల పరిధిలోని స్కూళ్లల్లో కొందరు టీచర్లు నకిలీ మెడికల్‌ సర్టిఫికెట్లు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అన్ని అవయవాలు బాగున్నవారు కూడా ఈ జాబితాలో కనిపిస్తున్నారంటూ వాపోతున్నారు. 50 ఏళ్లు దాటిన తర్వాత సహజంగానే వివిధ రోగాల బారిన పడుతుంటారని, కొందరు వాటిని అసరగా చేసుకుని ఫేక్‌ మెడికల్‌ సర్టిఫికెట్లు పొందారంటున్నారు. ఎస్జీటీల జాబితాల్లో కుప్పలుతెప్పలుగా నకిలీరాయుళ్లు కనిపిస్తారంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement