
టీబీ డ్యాంకు 15,777 క్యూసెక్కుల ఇన్ఫ్లో
బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయంలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. గత ఏప్రిల్ 24 వరకు జీరో ఇన్ఫ్లో ఉండి 6.871 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. అదే ఈ నెల మొదటి వారం నుంచి ఇన్ఫ్లో మొదలవడంతో శుక్రవారం ఉదయానికి 15,777 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదై నీటి నిల్వ 13.680 టీఎంసీలకు చేరింది. ఎగువ భాగం ఆగుంబే, తీర్ధనహళ్లి, వరనాడు, శివమొగ్గ, సాగర, శృంగేరి తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో వరద నీరు డ్యాంలోకి వచ్చి చేరుతోంది. టీబీ డ్యాం లో 1,633 అడుగులకు గాను 1592.96 అడుగుల నీటి మట్టం చేరింది. అవుట్ఫ్లో 153 క్యూసెక్కులు ఉంది. కాగా గత ఏడాది ఇదే సమయానికి 3.330 టీఎంసీల నీరు నిల్వ ఉండి, ఇన్ఫ్లో జీరో, అవుట్ఫ్లో 30 క్యూసెక్కులు ఉండేది.
విత్తన నాణ్యతలో రాజీ పడం
అనంతపురం అగ్రికల్చర్/ బెళుగుప్ప: నాణ్యతా ప్రమాణాల మేరకు విత్తన వేరుశనగ శుద్ధి (ప్రాసెసింగ్) చేపట్టి రైతులకు మంచి విత్తనం అందేలా చూడాలని వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ ఆదేశించారు. శుక్రవారం అనంతపురంలోని విజయ ఆగ్రోసీడ్స్, బాలాజీ ట్రేడర్స్, వేంకటేశ్వర ట్రేడర్స్ ప్రాసెసింగ్ ప్లాంట్లతో పాటు బెళుగుప్పలో ఉన్న ప్రాసెసింగ్ ప్లాంట్లను సందర్శించారు. అక్కడ జరుగుతున్న విత్తనశుద్ధి కార్యక్రమాన్ని పరిశీలించారు. మొలకశాతం, అవుటన్ గురించి ప్రయోగత్మాకంగా తెలుసుకున్నారు. సరఫరాకు సిద్ధంగా ఉన్న వేరుశనగ బస్తాలు తూకం వేసి చూశారు. విత్తన నాణ్యత విషయంలో రాజీపడేది లేదని, నాసిరకమని గుర్తించినా, బాగా లేవని వెనక్కి వచ్చినా సంబంధిత ప్లాంట్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 40 శాతం రాయితీతో 50,952 క్వింటాళ్ల వేరుశనగ పంపిణీకి చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే అదనపు కేటాయింపులు ఉంటాయని తెలిపారు. ఇప్పటికే ఆర్ఎస్కేల్లో రిజిస్ట్రేషన్లు కూడా మొదలుపెట్టామని, జూన్ మొదటి వారంలోనే పంపిణీ చేస్తామని తెలిపారు. జేడీఏ వెంట ఏడీఏ ఎం.రవి, టెక్నికల్ ఏఓ రాకేష్నాయక్, ప్రాసెసింగ్ ప్లాంట్ల పర్యవేక్షక ఏఓలు కిరణ్కుమార్రెడ్డి, సాయిలక్ష్మి, శేఖర్రెడ్డి, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు.

టీబీ డ్యాంకు 15,777 క్యూసెక్కుల ఇన్ఫ్లో