
రాజకీయ కక్షతోనే కాకాణి అరెస్ట్
ఉరవకొండ: రాజకీయ కక్షతో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డిని అరెస్ట్ చేశారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలు, అసమర్థతను ప్రశ్నించే వారిపై రెడ్బుక్ రాజ్యాంగం ద్వారా కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు. మంగళవారం స్థానిక వైఎస్సాఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి కాకాణి అక్రమ అరెస్టును ఖండించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఎలాంటి అభివృద్ది లేకపోయినా అక్రమ కేసులు, అణిచివేత చర్యలు, కక్షపూరిత రాజకీయాలకు సీఎం చంద్రబాబు ఊతమిస్తున్నారన్నారు. మాజీ ఐఎఎస్, ఐపీఎస్లను సైతం వదిలిపెట్టకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు. వైఎస్ జగన్ను అప్రతిష్టపాలు చేసి, ఆయన్ను అరెస్టు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. తప్పుడు వాంగ్మూలాలు, సాక్ష్యాలు సృష్టించి కేసుల్లో ఇరికిస్తున్నా వైనంపై ఇప్పటికే ప్రభుత్వానికి కోర్టులు మందలిస్తున్నా పాలకుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదన్నారు. భార్యభర్తలు, అన్నదమ్ముల మద్య తలెత్తే చిన్నపాటి ఘర్షణల్లో కూటమి నేతలు జోక్యం చేసుకోని రాజకీయంగా వాటిని వినియోగించుకోని గ్రామస్థాయిలో వైఎస్సాఆర్సీపీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కూటమి నేతల అక్రమ అరెస్టులకు భయపడేది లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఇప్పటికే జిల్లాలో జరిగిన మినీ మహానాడులో కొందరు టీడీపీ సీనియర్ నేతలు గళం విప్పారని, ఈ వ్యతిరేక జ్వాలలు మరింత చెలరేగి కూటమి ప్రభుత్వాన్ని దహనం చేయక తప్పదని అన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు నరసింహులు, ఈడిగ ప్రసాద్, బసవరాజు, ఏసీ ఎర్రిస్వామి, తిప్పయ్య, వీరన్న పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజం