
విద్యార్థిని ఆత్మహత్య
కణేకల్లు: పదో తరగతి పరీక్షలో ఫెయిల్ కావడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన మేరకు... కణేకల్లు మండలం కె.కొత్తపల్లికి చెందిన గౌరమ్మ, పోతన్న దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరి పెద్ద కుమార్తె స్వాతి (15) కణేకల్లులోని కేజీబీవీలో చదివిస్తున్నారు. ఇటీవల వెలువడిన పదో తరగతి పరీక్షల్లో తన సహ విద్యార్థులందరూ ఉత్తీర్ణులు కాగా, స్వాతి మాత్రం ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయింది. కష్టపడి చదివినా ఒక సబ్జెక్ట్తో ఫెయిలయ్యాననే బాధలో మానసికంగా కుదేలైన ఆమె.. ఆదివారం ఉదయం కుటుంబసభ్యులందరూ చర్చికి వెళ్లిన సమయంలో మధ్యాహ్నాం 1 గంటకు ఇంట్లో ఒంటరిగా ఉన్న స్వాతి తన చున్నీతో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చర్చి నుంచి ఇంటికొచ్చిన తల్లిదండ్రులు విగతజీవిగా ఉరికి వేలాడుతున్న కుమార్తెను చూసి బోరుమని విలపించారు. ఘటనపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
వృద్ధురాలి బలవన్మరణం
తాడిపత్రి: మండలంలోని వంగనూరు – చల్లవారిపల్లి రైల్వే స్టేషన్ల మధ్య సోమవారం ఉదయం ఓ వృద్ధురాలు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు జీఆర్పీ ఎస్ఐ నాగప్ప తెలిపారు. సుమారు 60 సంవత్సరాల వయస్సు ఉంటుందని అంచనా వేశారు. మృతురాలి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. దీంతో గుర్తు తెలియని వృద్ధురాలి ఆత్మహత్యగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
రజక విద్యార్థులకు
ప్రతిభా పురస్కారాలు
అనంతపురం ఎడ్యుకేషన్: ఇటీవల విడుదలైన ఇంటర్, పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ చాటిన జిల్లాలోని రజక సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్లు రజక ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు సి.ఎర్రిస్వామి, ఆనంద్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పదో తరగతిలో 450 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులు, ఇంటర్లో 650 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులు అర్హులు. బయోడేటాతో పాటు మార్కుల జాబితా, కుల ధ్రువీకరణ పత్రం జతచేసి మే 20వ తేదీలోపు సి.ఎర్రిస్వామి, టీచర్, 1–1– 284, ఆర్కేనగర్, అనంతపురం చిరునామాకు దరఖాస్తులు పంపాలి. పూర్తి వివరాలకు 98668 76190, 91107 00830, 83412 44333, 80966 88896లో సంప్రదించవచ్చు.